Monday, April 29, 2024

న్యాయం, ధర్మం గెలిచిందనే భావన తెలుగు ప్రజల్లో వచ్చింది: మంత్రి పేర్నినాని

- Advertisement -
- Advertisement -

అమరావతి:  టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు కోర్టు రిమాండ్ విధించడంతో న్యాయం, ధర్మం గెలిచిందనే భావన తెలుగు ప్రజల్లో వచ్చిందని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. న్యాయ స్థానాలను ఎల్లకాలం ఏమార్చడం సాధ్యం కాదని చెప్పారు. 1977 నుంచి చంద్రబాబు ఎన్నో స్కాంలు, ఎంతో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇన్నాళ్లూ పట్టుబడకుండా నక్కజిత్తులు వేస్తూ స్టేలు తెచ్చుకుంటూ వచ్చారని విమర్శించారు. తెలంగాణ ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు ఎంత గడ్డి కరిచేందుకైనా దిగజారతారని విమర్శించారు. స్లీపర్ సెల్స్ ద్వారా చంద్రబాబు ఇన్నాళ్లూ రక్షించబడ్డారని చెప్పారు. అయితే చంద్రబాబు పాపం ఇన్నేళ్లకు పండిందని చెప్పుకొచ్చారు.

ఈ కేసు మాత్రమే కాదు.. ఇంకా డొంక కదలాల్సిన అవసరం ఉందని చెప్పారు. చంద్రబాబు అరెస్ట్ విషయంలో సిఐడి అధికారులు చట్ట ప్రకారమే వ్యవహరించారు. దర్యాప్తు జరిగే కొద్దీ అన్నీ పేర్లు బయటకొస్తుంటాయి డిఐజి స్థాయి అధికారిపై రెచ్చిపోయి నోటికొచ్చి మాట్లాడారని, బెదిరింపులకు దిగారని ఆరోపించారు. కానీ ఆ అధికారి మాత్రం చాలా సహనంతో ఓపికగా వ్యవహరించారన్నారు. చంద్రబాబు వద్ద అధికారులు చట్టప్రకారమే నడుచుకున్నారని చెప్పారు. చంద్రబాబు ఆయనను అరెస్ట్ చేస్తారని రెండు రోజుల ముందే చెప్పారని అంటే సిఐడి అరెస్ట్ చేస్తుందనే సమాచారం చంద్రబాబుకు ఉందని చెప్పారు. చంద్రబాబు హెలికాఫ్టర్‌లో వెళ్దామని అధికారులు చెబితే వద్దని రోడ్డుమార్గంలో వచ్చారని తెలిపారు. టిడిపి నేతలు ఎంతో సీన్ చేద్దామని చూసిన వాళ్లు రెండు చోట్ల మాత్రమే జనాలను సమీకరించగలిగారని విమర్శించారు.

సిఐడి, పోలీసులు బాబుకు మర్యాద ఇచ్చారు. చంద్రబాబు విషయంలో సిఐడి అన్ని నిబంధనలూ పాటించింది. కోర్టు వద్ద చంద్రబాబును కలిసేందుకు ఆయన కుటుంబ సభ్యులను అనుమతించారు కదా అని అన్నారు. చంద్రబాబుకు స్పెషల్ సెల్ కావాలని కోరితే సిఐడి న్యాయవాదులు అభ్యంతరం చెప్పలేదన్నారు. ఎంతో మర్యాదగా చూశారన్నారు. పవన్, పురందేశ్వరి, లెఫ్ట్ పార్టీలు చంద్రబాబును కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. టిడిపి టీడీపీ నేతలు స్కామ్ జరగలేదని ఎక్కడా చెప్పరని, కానీ అరెస్ట్ మాత్రం అక్రమమని అంటారన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు నచ్చవు గానీ ఆయన డైలాగ్‌లు మాత్రం చెబుతారన్నారు. ఇసిజి తీయాలని డాక్టర్ చెబితే చంద్రబాబు ఆయన షర్ట్ తీయొద్దని అంటారన్నారు. చంద్రబాబు ఏమో ఆయన ఫిట్‌గా ఉన్నానని చెబుతున్నారని, కానీ టిడిపి నేతలు మాత్రం ఆయన వయసు చూడాలని అంటున్నారని ఎద్దేవా చేశారు. ఈ స్కామ్ వల్ల నష్టపోయింది ఏపీ ప్రజలు, నిరుద్యోగ యువకులు అని అన్నారు. కోర్టులో జడ్జి ముందు కూడా చంద్రబాబు రాజకీయ ఉపన్యాయం ఇచ్చారని అన్నారు. స్కిల్ స్కామ్‌లో జరగలేదని కోర్టులో చెప్పగలిగారా? అని ప్రశ్నించారు. సాంకేతిక అంశాలు, కుంటిసాకుల మీదే టిడిపి లాయర్లు వాదించారని చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News