వారణాసి:కరోనా వైరస్ దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న నేపథ్యంలో దేవుళ్లకూ ఈ వ్యాధి సోకకుండా పూజారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వింతగా ఉన్నప్పటికీ ఇది వాస్తవం. ఉత్తర్ ప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిలోని ప్రహాదేశ్వర ఆలయానికి చెందిన పూజారులు ఆలయంలోని శివలింగానికి మాస్కు ధరింపచేసి కరోనా వైరస్ బారి నుంచి రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేగాక భక్తులెవరూ శివలింగాన్ని తాకడానికి వీల్లేదని కూడా వారు చెబుతున్నారు. శివలింగానికి మాస్కు వేయడం అసాధారణ చర్య కాదని ఆలయ పూజారి ఆనంద్ పాండే తెలిపారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాపిస్తున్న పరిస్థితులలో ఈ వ్యాధిపై ప్రజలలో చైతన్యం తీసుకొచ్చేందుకు కాశీ విశ్వనాథునికి మాస్కు వేశామని ఆయన చెప్పారు. చలికాలంలో వెచ్చదనం కోసం విగ్రహాలకు ఏ విధంగా దుస్తులు వేస్తామో..ఎండాకాలంలో చల్లదనం కోసం గర్భగుడిలో ఏ విధంగా ఎసి వేస్తామో అలాగే విగ్రహాలకు మాస్కులు వేస్తామని పాండే వివరించారు. ఆలయంలోని ఇతర పూజారులు కూడా మాస్కులు ధరించి పూజలు చేయడం విశేషం.