హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం నుంచి సహకారం చాలా తక్కువగా ఉందని మంత్రి కెటిఆర్ తెలిపారు. మేకిన్ ఇండియా అంటూనే రాష్ట్రాలకు కేంద్రం సహకరించడంలేదని వాపోయారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు బంధు పథకాన్ని ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని పేర్కొన్నారు. రైతు బంధుతో తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయని, ప్రపంచ ఎగుమతుల్లో భారత్ వాటా కేవలం రెండు శాతం మాత్రమే ఉందని, తెలంగాణ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కెటిఆర్ వివరించారు. ముంబయిలో నాస్కామ్ టెక్నాలజీ అండ్ లీడర్ షిప్ ఫోరమ్ 28వ సదస్సులో కెటిఆర్ మాట్లాడారు. తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చినామని, ఇంటింటికి రక్షిత మంచి నీరు అందిస్తున్నామని, ఐటి పరిశ్రమను జిల్లా కేంద్రాలకు విస్తరించామని, టెక్ మహీంద్ర లాంటి ప్రముఖ కంపెనీలు వరంగల్లో తమ శాఖలను ఏర్పాటు చేశాయని వివరించారు. తెలంగాణ మోడల్ అభివృద్ధి దేశంలోని మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. అమెరికా, జపాన్ లాంటి దేశాలు అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున అప్పులు చేశాయని, తెలంగాణ జిడిపి చాలా మెరుగ్గా ఉందని, ప్రపంచంలోనే అతి పెద్దదైనా ఫార్మ క్లస్టర్ 19 వేల ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నామన్నారు. వరంగల్ మెగా టెక్స్టైల్ పార్క్ దేశంలోనే పెద్దదని తెలియజేశారు.