ఎన్ఎస్డిసితో సామ్సంగ్ ఒప్పందం
న్యూఢిల్లీ : ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉద్యోగాల కోసం 50 వేల మంది యువతకు శిక్షణ ఇచ్చేందుకు ‘సామ్సంగ్ దోస్త్’ (డిజిటల్ అండ్ ఆఫ్లైన్ నైపుణ్యాల శిక్షణ) కార్యక్రమాన్ని సామ్సంగ్ ప్రారంభించింది. దేశవ్యాప్తంగా నైపుణ్య శిక్షణ కేంద్రాల ద్వారా కార్యక్రమాన్ని అమలు చేసేందుకు నేషనల్ స్కిల్ డవలప్ మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎస్డిసి)తో సామ్సంగ్ భాగస్వామం కుదుర్చుకుంది. మొదటి దశలో భాగంగా 2,500 మందితో శిక్ష ప్రారంభించనుంది. దేశంలో 120 కేంద్రాల్లో స్కూల్ నుండి ఉత్తీర్ణత పొందిన వారికి శిక్షణ ఇవ్వనున్నారు. సామ్సంగ్ సౌత్వెస్ట్ ఆసియా ప్రెసిడెంట్, సిఇఒ కెన్ కాంగ్ మాట్లాడుతూ, సామ్సంగ్ దోస్త్ కార్యక్రమం భారత ప్రభుత్వ స్కిల్ ఇండియాకు మద్దతు ఇస్తోందని అన్నారు. యువత 200 గంటలు ఆన్ లైన్, తరగతి గది మిశ్రమ శిక్షణ తీసుకున్న తర్వాత సామ్సంగ్ రీటైల్ స్టోర్స్లో 5 నెలలు ఆన్-ది-జాబ్ శిక్షణతో పాటు నెలవారీ స్టైపెండ్ ఇస్తుంది. శిక్షణ నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్ వర్క్కి అనుగుణంగా ఇస్తారు. ఇది పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఉంటుంది. కస్టమర్ ప్రమేయం, సేల్స్ కౌండర్ నిర్వహణ, కస్టమర్ సందేహాల్ని నిర్వహించడం, ఉత్పత్తి ప్రదర్శన, పోస్ట్- కోవిడ్ చర్యలు వంటి నైపుణ్యాలు దీనిలో భాగంగా ఉంటాయి.