Friday, April 26, 2024

బిఆర్‌ఎస్ ఓ ప్రభంజనం

- Advertisement -
- Advertisement -

భారత దేశానికి స్వాతం త్య్రం వచ్చే కాలం నాటికి దేశంలో ప్రధాన రాజకీయవేత్తలుగా మహాత్మా గాంధీ, పండిట్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, డా.బి.ఆర్. అంబేడ్కర్ ఉండేవారు. ఈ నలుగురూ ఆ కాలంలో కాంగ్రెస్ పార్టీకి చెందినవారే. ప్రధాన జాతీయ పార్టీలుగా కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలుండేవి. మొదటి ప్రధాని ఎవరు కావాలన్న విషయంలో మహాత్మా గాంధీ తాను ఏ పదవీ చేపట్టకుండా మహాత్ముడుగానే మిగిలి ఉండదలుచుకున్నారు. అయితే ప్రధానమంత్రిని ఎన్నిక చేసే కింగ్ మేకర్ మాత్రం గాంధీజీ యే. మిగతా ముగ్గురూ ఒకే పార్టీకి చెందిన వారైనా భిన్నాభిప్రాయాలున్న వారు. సర్దార్ పటేల్ హిందుత్వ భావజాలం బాగాఉన్నవారు.

నెహ్రూ సోషలిస్టు రష్యా ప్రభావంతో సెమీ సోషలిస్టు, లౌకిక భావాలనున్నవారు. బి.ఆర్. అంబేద్కర్ ప్రపంచంలోనే గొప్ప విద్యావంతుడుగా, ఈ దేశ అట్టడుగు వర్గాల పక్షాన నిలబడి స్వపార్టీ నాయకులు. గాంధీ, నెహ్రూ, పటేల్ లాంటి వాళ్లందరితోనూ పోరాడి కుల వ్యవస్థను ప్రశ్నించినవారు. కుల నిర్మూలన కోరుకున్నవారు. దేశంలో అత్యంత పీడితులు, బాధితులు, సామాజిక అసమాన, అస్పృశ్య బాధితులైన అణగారిన జాతుల పక్షాన నిలిచి జీవితాన్ని అంకితం చేసినవారు. అప్పటికే దేశ విభజన ప్రభావం, మత కలహాలు, స్వాతంత్య్ర పోరాటంలో అసువులు బాసిన వారు, వందలాది సంస్థానాలుగా దేశం విడిపోయి సంక్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో హిందుత్వ భావజాలం ఉన్న పటేల్‌ను, అట్టడుగు వర్ణాల పక్షాన నిలిచిన అంబేడ్కర్‌ను కాకుండా సెమీ సోషలిస్టు, లౌకిక భావాలున్న నెహ్రూను ప్రధానమంత్రిగా ఎన్నిక చేశారు గాంధీజీ.

CEC Decide to Change party name TRS to BRS

నెహ్రూ రష్యా సోషలిస్టు విధానాల ప్రేరణతో సెమీ సోషలిస్టు విధానాలను, లౌకిక విధానాలను, అలీన విధాన విదేశాంగ నీతిని, సర్వమత సమానత్వ భావనను అనుసరిస్తూ నవ భారత నిర్మాతగా, శాంతి దూతగా ప్రసిద్ధి చెందారు. భారీ నీటి ప్రాజెక్టుల, ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేయడం, సస్య విప్లవం, పారిశ్రామిక ప్రగతి ధ్యేయంగా పాలన చేస్తూ దేశాన్ని అజేయం గా నిలిపారు. వేలాది సంస్థానాలను భారత్‌లో విలీనం చేసి సువిశాల, సమైక్య భారత్‌ను స్థాపించారు. నిజమైన లౌకికవాదిగా పాలన సాగించారు. నెహ్రూ తర్వాతి కాలంలో కాంగ్రెస్, సెమీ హిందుత్వ, సెమీ లౌకికవాదాన్ని చేపట్టింది. నెహ్రూ మార్గం నుండి క్రమక్రమంగా దూరమై గాంధీ సెమీ హిందుత్వవాదాన్ని చేపట్టింది.

గరీబీ హటావో, వైజ్ఞానికాభివృద్ధి, అంశాలను పరిగణనలోనికి తీసుకున్నా సెమీ హిందుత్వ, మనువాద విధానాలు పూర్తి మనువాద, హిందుత్వ పార్టీ అయిన జనసంఘ్ క్రమాభివృద్ధి చెందడానికి తోడ్పడ్డాయి. దేశంలో రెండవ స్థానంలో ఉన్న కమ్యూనిస్టు పార్టీ లు కూడా తమ సోషలిస్టు, లౌకిక, కుల నిర్మూలన పంథాకు దూరం జరిగి పాలక పార్టీల్లాగే ప్రవర్తించడం వల్ల క్రమక్రమంగా బలహీనపడుతూ వచ్చాయి. జనతా ప్రయోగం జనసంఘ్‌కు, ఆ తర్వాత గాంధీయన్ సోషలిజం పేరుతోనూ, భారతీయ జనతా పార్టీగానూ ఆవిర్భవించడానికి తోడ్పడింది. అటు కాంగ్రెస్, ఇటు కమ్యూనిస్టులు అనుసరించిన సెమీమనువాద విధానాలు, అటూఇటూ కానీ పద్ధతులు, తమ మౌలిక స్వభావాన్ని కోల్పోవడం వల్ల పూర్తి మనువాద, మతవాద పార్టీ అయిన బి.జె.పి. బలోపేతం కావడానికి తోడ్పడినాయి. బాబ్రీ విధ్వంసాన్ని ఉపయోగించు కొని హిందుత్వాన్ని రెచ్చగొట్టి వాజ్‌పేయ్ భారత ప్రధాని కాగలిగారు.ఈ మూడు జాతీయ పార్టీలు దేశానికి ఒరగబెట్టిందేం లేదు.

దేశమౌలిక సమస్యలను పరిష్కరించలేదు. ఆర్ధిక, సామాజిక అంతరాలను తగ్గించే ప్రయత్నం చేయలేదు. ఈ దేశంలోని అణగారిన జాతుల, బహుజనుల సమస్యలను దూరం చేసే ప్రయత్నమూ చేయలేదు. మొదటి నుంచీ వస్తున్న ఉత్తరాది ఆధిపత్యాన్ని, దక్షిణాదిని నిర్లక్ష్యం చేయడాన్ని అలాగే కొనసాగించాయి. ఇలాంటి అనేక వివక్షల నుండే సామాజిక పార్టీలు, ద్రవిడ పార్టీలు, అస్థిత్వోద్యమ పార్టీలు, ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష గల పార్టీలు పుట్టుకొచ్చాయి. ఈ పార్టీలుపై మూడు జాతీయ పార్టీల కంటే మెరుగైన పాలన నందించాయి, అందిస్తున్నాయి. ఇదే సమయంలో అంబేడ్కర్‌వాద బహుజన దృక్పధంలో బహుజన సమాజ్ పార్టీ ఆవిర్భవించింది. దేశ వ్యాప్తంగా బహుజనులను ఆకర్షించింది. కాని అనేక కారణాల వల్ల ఉత్తరప్రదేశ్‌కే పరిమితమై దేశ వ్యాప్తం కాలేదు. ఇలా నాలుగు జాతీయ పార్టీలూ దేశ మౌలిక సమస్యలను పరీక్షరించలేకపోయాయి. అద్వానీ నాయకత్వంలో జరిగిన బాబ్రీ విధ్వంసంతో హిందుత్వ శక్తుల అధికారం వాజేపేయ్ తో ప్రారంభమై లోకికత్వాన్ని అపహాస్యం పాలుచేసింది. రాజ్యాంగ సమీక్ష అంశాన్ని ముందుకు తెచ్చింది. అంబేడ్కరిజాన్ని దూరం కొట్టింది.

CM KCR fires on BJP

క్రమక్రమంగా కాంగ్రెస్, వామపక్షాలు బలహీనపడటం, బి.యస్.పి ఒక్క రాష్ట్రానికే పరిమితం కావడంతో సంప్రదాయ మతతత్వ శక్తులు బలపడటం పెరిగింది. వాజేపేయ్ హిడెన్ ఎజెండాతో అధికారంలోకి వస్తే మోడీ ప్రభ్వత్వం ఓపెన్‌గా హిందుత్వ ఎజెండా, అంబేడ్కర్ రాజ్యాంగాన్ని మార్చి మనువాద రాజ్యాంగాన్ని ముందుకు తెచ్చే ఎజెండాతో అధికారంలోకి వచ్చింది. గత ఎనిమిదేండ్లుగా ప్రతిపక్ష ప్రభుత్వాలను కూల్చ డం, బి.జె.పి అధికారంలోలేని రాష్ట్రాలపై వివక్ష, బిజెపియేతర బలమైన నాయకులను వేధించడం లాంటివెన్నో చేస్తుంది. మతతత్వ, ద్వేషపూరిత రాజకీయాలను పెంచి పోషిస్తూ, కక్ష సాధింపు చర్యలు చేపడుతుంది. ప్రజాస్వామ్యాన్ని, లౌకికత్వాన్ని, రాజ్యాంగ విలువలను అపహాస్యం పాలు చేస్తూ సామాజిక, ఆర్థిక అంతరాలను పెంచుతుంది. ప్రభుత్వరంగ సంస్థలను మూసివేస్తూ, నిరుద్యోగాన్ని పెంచుతూ దేశసంపదనంతా 20 మంది కార్పొరేట్ శక్తుల చేతుల్లోకిపోయేట్టు చేసున్నది.

దళితులు, బహుజన వర్గాలు, మైనారిటీలపై దాడులు, వివక్షతో మత సామరస్యానికి భంగం కలిగిస్తున్నది. దేశాన్ని అప్పుల ఊబిలో ముంచడమే కాకుండా, అన్ని వస్తువుల ధరలు విపరీతంగా పెంచి, జిఎస్‌టి పేరు మీద వృత్తి ఆధారిత ఉత్పత్తులపై కూడా పన్నుల భారం పెంచి మధ్య తరగతి, సామాన్య మానవుడిని తీవ్ర సంక్షోభంలోకి నెడుతుంది.
ఇలా జాతీయ రాజకీయాల్లో పూడ్చలేనంత ఖాళీ ఏర్పడిన సమయంలో తిరుగులేని జాతీయ ఎజెండాతో కెసిఆర్ నాయకత్వంలో ‘భారత రాష్ట్ర సమితి’ ఆవిర్భవించింది. ఈ పార్టీ ఏర్పాటు నేటి చారిత్రక, రాజకీయ, దేశీయావసరం. It is Today’s need of hour. ఎందుకంటే భారతదేశ రాజకీయాలను దేశీయత వైపు, భారతీయత వైపు, సామాన్య మానవుడి సమస్యలను పరిష్కరించే దిశగా మలుపు తిప్పగల సామర్థ్యం కెసిఆర్‌కు ఉందని గత ఎనిమిదేళ్ళ పాలన రుజువు చేస్తుంది. తెలంగాణను దేశానికే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దడంలో, దేశమంతా తెలంగాణను అనుసరించేట్టు చేయడంలో కెసిఆర్. సఫలమయ్యారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండి గుజరాత్ మోడల్ అభివృద్ధి అంటూ ప్రధానమంత్రి అయిన మోడీది కార్పొరేట్ శక్తులను లక్షల కోట్లాధికారులను చేసే మోడల్ తప్ప ప్రజలను ఉద్ధరించే మోడల్ కాదు. దీంతోదేశంలో పేదరికం, నిరుద్యోగం అసహనం, ద్వేషం పెరుగుతున్నాయే తప్ప ప్రజలకు ఒరుగుతున్నదేం లేదు.

కెసిఆర్ అభివృద్ధి నమూనా, సంక్షేమ పథకాలు జాతీయ స్వభావం కలిగి దేశమంతటికీ వర్తించేవి. కేంద్రం నిర్లక్ష్యం చేసిన వ్యవసాయాన్ని పండుగ చేయడం, కాళేశ్వరం లాంటి భారీ నీటి ప్రాజెక్టులను నిర్మాణం చేయడం, సాగునీటి, తాగునీటి కొరత తీర్చడం, వ్యవసాయానికి, ఇతర వృత్తిపనులకు ఉచిత కరెంటు నివ్వడం, రైతును హృదయానికి హత్తుకోవడం లాంటి పనుల వల్ల వ్యవసాయక ప్రధాన దేశమైన భారత దేశ సమస్యలను చాలా వరకు తీరే అవకాశముంది. రైతు బంధు, దళిత బంధు పేదలకు ఇళ్ళ నిర్మాణం, ఉచిత ఇంగ్లీషు మాధ్యమం, సాంఘిక సంక్షేమ పాఠశాలల ద్వారా నాణ్యమైన విద్య లాంటివి దేశమంతటా విస్తరించడం ద్వారా ఈ దేశంలోని చాలా సమస్యలు తీరే అవకాశముంది. కాలుష్య నివారణ, ఆకుపచ్చ విశ్వం తయారు చేయడం నేటి ప్రాపంచికావసరం.

CM KCR Announces rs 100 crore for Kondagattu Anjanna

ప్రపంచాన్ని మానవ జాతిని ప్రమాదపుటంచుకు నెట్టి వేసే అంశాలలో వాతావరణ కాలుష్యం ఒకటి. హరితహారం ద్వారా కోట్లాది చెట్లను పెంచి కాలుష్య రహిత తెలంగాణగా మార్చిన కెసిఆర్ మోడల్ దేశానికే కాదు.. ప్రపంచానికే ఉదాహరణ ప్రాయం. అలాగే మత సామరస్యం కూడా నేటి ప్రాపంచికావసరమే. కొన్ని దేశాలు తమ దేశాలను మత దేశాలుగా మారుస్తాననడం, తీవ్రవాదం, మానవ జాతి మనుగడకు ప్రమాదకారిగా పరిణమించింది. వివిధ మతాలు, విభిన్న సంస్కృతులు, భాషలు జాతులు నివాసముంటున్న హైదరాబాద్‌లో గత ఎనిమిదేళ్లుగా ఒక్క మతకలహమూ జరగకుండా శాంతి భద్రతలను కాపాడిన ఘనత కెసిఆర్‌దే.

హైదరాబాద్‌ను ప్రపంచంలోనే కాలుష్యరహిత మహా నగరంగా, బెస్ట్ లివింగ్ ప్లేస్‌గా మార్చడం ఈ ఎనిమిదేళ్ళలోనే జరిగింది. వృద్ధులను, వికలాంగులను ఆదుకోవడంలోనూ, సబ్బండ కులాల వృత్తిపర ఆదాయ మార్గాలను పెంచడంలోనూ, ఐటిని రాష్ట్రమంతటా విస్తరించడంలోనూ ఫార్మాహబ్‌గా తెలంగాణను మార్చడంలోనూ, లక్షలాది ఉద్యోగాల నివ్వడంలోనూ తెలంగాణ దేశానికే ఆదర్శంగా ఉంది. భారత రాష్ట్ర సమితి ద్వారా తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి నమూనాను దేశమంతటికీ విస్తరిస్తే దశాబ్దాలుగా దేశంలో అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలు పరిష్కారమవుతాయన్నది వాస్తవం. తెలంగాణ రాష్ట్ర సమితి ద్వారా తెలంగాణను సాధించిన అనతి కాలంలోనే తెలంగాణను దేశానికే ఆదర్శంగా, రోల్‌మోడల్‌గా నిలిపారు కెసిఆర్.

అలాగే భారత రాష్ట్ర సమితి ద్వారా భారతదేశ అభివృద్ధి నమూనాను ప్రపంచ దేశాలకే రోల్ మోడల్ గా తీర్చిదిద్దే సామర్ధ్యం, వ్యూహ రచన కెసిఆర్‌కుంది. అందుకే బిఆర్‌ఎస్‌ను చూసి బిజెపి భయపడుతుంది. తప్పుడు కేసుల్లో ఇరికించాలని చూస్తుంది. కెసిఆర్‌ది కుల, మత, ప్రాంతాలకతీతమైన మానవీయ అభివృద్ధి నమూనా. జాతీయం, దేశీయం అయిన ఈ తెలంగాణ మోడల్‌తో పాటు మరికొన్నింటిని చేర్చి భారత రాష్ట్ర సమితి ద్వారా అమలు చేయడం ద్వారా చాలా దేశ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అందుకే భారత రాష్ట్ర సమితి Today’s need of Hour. బిఎస్‌ఆర్‌ద్వారా కెసిఆర్ భారత దేశ రాజకీయాలను మత, కార్పొరేట్, హింసాయుత రాజకీయాల నుండి ‘మనిషి’ మానవీయ రాజకీయాల వైపు మలుపు తిప్పుతారనడంలో సందేహం లేదు. బిఆర్‌ఎస్ భారత రాజకీయాల్లో ఓ ప్రభంజనం Trendsetter.

డా॥కాలువ మల్లయ్య
9182918567

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News