ప్రథమ మహిళ మెలనియాకు వైట్హౌస్లోనే చికిత్స
నేను బాగానే ఉన్నా : ట్రంప్
18 సెకన్ల వీడియో విడుదల
వైట్హౌస్లో మరికొందరికి పాజిటివ్
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఎన్నికల చిత్రం అనేక మార్పులు సంతరించుకుంటోంది. ముఖ్యంగా అధ్యక్షుడు ట్రంప్కు కరోనా పాజిటివ్ లక్షణాలు కనిపించడం, వెంటనే ఆయనను వాల్టర్ రీడ్ ఆస్పత్రిలో చేర్చడంతో ఆయన ప్రచార కార్యక్రమాలన్నిటికీ అవరోధం ఏర్పడినట్టయింది. కరోనా తీవ్రతను నివారించడానికి వైద్యనిపుణుల సిఫార్సు ప్రకారం తక్షణం ఆయనకు రెమెడెసివిర్ చికిత్స ప్రారంభించారు. మొదటి డోసు కూడా ఇచ్చినట్టు వైట్ హౌస్ డాక్టర్ ప్రకటించారు. ముఖ్యంగా ఆయనకు బదులుగా ఉపాధ్యక్షుడు మైక్పెన్స్ షెడ్యూల్ ప్రకారం ప్రచారాన్ని కొనసాగిస్తారని కేంపైన్ మేనేజర్ ప్రకటించినా మైక్పెన్స్కు, కేంపైన్ మేనేజర్కు కూడా కరోనా సోకడంతో ఇద్దరూ స్వీయ క్వారంటైన్లో కనీసం పది రోజుల వరకు గడపవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇక వైట్హౌస్ జర్నలిస్టుల్లో ముగ్గురికి కరోనా లక్షణాలు కనిపించడం తో వారు కూడా సెల్ఫ్ క్వారంటైన్లో గడుపుతున్నారు.
మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శుక్రవారం సాయంత్రం వీడియోను ట్వీట్ చేస్తూ తాను, ప్రథమ మహిళ మెలనియా ఆరోగ్యం గానే ఉన్నట్టు తెలియచేశారు. బెథెస్డాలోని వాల్టర్ రీడ్ మిలిటరీ ఆస్పత్రికి చేరుకున్న తరువాత 18 సెకన్ల వీడియాలో ఆయన తన యోగక్షేమాలు ప్రస్తావించారు. నాకు మద్దతుగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నాకు తెలిసి నేను బాగానే ఉన్నాను. అన్నీ సవ్యంగా ఉండాలనే ఆస్పత్రికి చేరుకుంటున్నాం. అందరికీ ధన్యవాదాలు. నేనిది ఎప్పటికీ మర్చిపోలేను అని వీడియోలో సందేశం వినిపించారు. ట్రంప్ మరికొన్ని రోజులు వాల్టెర్ రీడ్ మిలిటరీ ఆస్పత్రి అధ్యక్ష కార్యాలయం నుంచే విధులు నిర్వహిస్తారని శ్వేతసౌధం అధికార యంత్రాంగం వివరించింది. కరోనా తేలిక పాటి లక్షణాలు ఉన్నప్పటికీ ట్రంప్ బాగా పనిచేయాలనే ఉత్సాహంతో ఉన్నారని, రోజంతా పనిచేస్తున్నారని వైట్హౌస్ సెక్రటరీ కే లే మెకననీ చెప్పారు. వైద్యులు హెచ్చరించి సిఫార్సు చేయడంతో ఆయన మరికొన్ని రోజులు ఆస్పత్రి నుంచే విధులు నిర్వర్తిస్తుంటారని ఆమె పేర్కొన్నారు.
‘అధ్యక్షునికి వైరస్ సోకినట్టు నిర్ధారణ అయిన తరువాత ముందు జాగ్రత్తగా రెజెనెరాన్స్కు చెందిన 8 గ్రాముల డోస్ పాలీక్లోనల్ యాంటీబాడీ కాక్టెయిల్ తీసుకున్నారు’ అని ట్రంప్ వ్యక్తిగత వైద్యుడు సీన్ కావ్లే వెల్లడించారు. దీంతోపాటు జింక్ విటమిన్డి, ఫామోటిడైన్, మెలటోనిన్, ఆస్పిరిన్ తీసుకుంటున్నారని వివరించారు. శుక్రవారం మధ్యాహ్నం కాస్త అలసినట్టు కనిపించినా ట్రంప్ ఆరోగ్యం గానే ఉన్నారని వెల్లడించారు. ప్రథమ మహిళ మెలనియా కు స్వల్పంగా దగ్గు, తలనొప్పి తప్ప మరే పెద్ద లక్షణాలు లేవని తెలిపారు. మిగతా కుటుంబ సభ్యులందరికీ నెగిటివ్ వచ్చినట్టు వెల్లడించారు. మెలనియా కూడా తనకు అందరూ మద్దతు పలకడాన్ని అభినందించారు. వేగంగా కోలుకుంటామని ఆమె శుక్రవారం ట్వీట్ చేశారు. ఇప్పటికిప్పుడు ఎక్స్రే వంటి పరీక్షలు చేయవలసిన పనిలేదని, తరచుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైనా,దగ్గు లేదా ఇతర లక్షణాలు కనిపించినా డాక్టర్లు వెంటనే పరీక్షలు ముమ్మరంగా చేయవలసి వస్తుందని డాక్టర్ డేవిడ్ బనాక్ పేర్కొన్నారు.
ట్రంప్కు రెమ్డెసివిర్ చికిత్స
మిలిటరీ ఆస్పత్రిలో వైద్యచికిత్స పొందుతున్న అధ్యక్షుడు ట్రంప్ ప్రస్తుతం బాగానే ఉన్నారని ఆయనకు రెమడెసివిర్ వైద్యచికిత్స అందిస్తున్నట్టు వైట్హౌస్ డాక్టర్ సీన్ కాన్లీ ప్రకటించారు. ట్రంప్కు రెమ్డెసివిర్ అందించి చికిత్స చేయాల్సిందిగా వైద్య నిపుణులు సిఫార్సు చేశారని చెప్పారు. ఆయనకు అదనంగా ఆక్సిజన్ సరఫరా చేయాల్సిన అవసరం లేదని, రెమెడెసివిర్ మొదటి డోస్ ఇవ్వడమైందని ప్రస్తుతం ఆయన క్షేమంగా విశ్రాంతి తీసుకొంటున్నారని తెలిపారు. ట్రంప్, మెలనియా శుక్రవారం పరీక్షల్లో పాజిటివ్ వచ్చిందని తేలినప్పటికీ ఒక్క అధ్యక్షుడు ట్రంప్ను మాత్రమే మిలిటరీ ఆస్పత్రికి తరలించారు. మెలనియా వైట్హౌస్ లోనే ఉంటున్నారు.
ప్రస్తుతం ట్రంప్ ప్రచారంలో పాల్గొనరు
ట్రంప్కు సంబంధించిన ప్రచార కార్యక్రమాలన్నీ వాయిదా పడ్డాయని ట్రంప్ ప్రచార కార్యక్రమాల మేనేజర్ బిల్ స్టెపిన్ ప్రకటించారు. తదుపరి నోటీస్ వచ్చిన వరకూ ట్రంప్ కానీ, కుటుంబసభ్యుల వర్చువల్ ఈవెంట్స్ ఎందులోనూ పాల్గొనబోరని తెలిపారు. అయితే ఉపాధ్యక్షుడు మైక్పెన్స్ మాత్రం ఈ ప్రచార కార్యక్రమాలను అనుకున్న షెడ్యూలు ప్రకారం కొనసాగిస్తారని పేర్కొన్నారు. అధ్యక్షుడు ట్రంప్ ఉన్నత స్థాయి సలహాదారుల్లో ఒకరైన హోప్హిక్స్కు గురువారం కరోనా పాజిటివ్ సోకింది. మిగతా ఇద్దరు ఉటా సేన్, మైకె లీ, యూనివర్శిటీ ఆఫ్ నోట్రె డేమ్ అధ్యక్షుడు రెవరెండ్ జాన్ జెంకిన్స్ కు కూడా పాజిటివ్ అని తేలింది.
ఉపాధ్యక్షుడు మైక్పెన్స్కు నెగెటివ్
శనివారం ఉదయం అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్కు పరీక్షలో నెగిటివ్ వచ్చిందని ఆయన వ్యక్తిగత వైద్యులు జెస్సె స్కోనోయు చెప్పారు. సిడిసి మార్గదర్శకాల ప్రకారం ఆయన అధ్యక్షుడు ట్రంప్తో సహా కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తులు ఎవరితోనూ సన్నిహితంగా లేరని, అందువల్ల ఆయన క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం లేదన్నారు.