ఓటు భయంతో సాగు సంస్కరణలు గట్టునపెట్టారు
ప్రతిపక్షాలపై ప్రధాని మోడీ ఆగ్రహం
ఏడు నెలల తరువాత తొలి బహిరంగ సభ
లేబర్ మార్పులు కూడా మంచికేనని సమర్థన
సోలాంగ్ వ్యాలీ: దేశంలోని గత ప్రభుత్వాలకు వ్యవసాయ సంస్కరణలను తీసుకువచ్చే ధైర్యం లేకుండాపోయిందని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. ఎప్పుడూ ఎన్నికలు ఓట్లువేటతో ఉండే ఆ పార్టీలు ఫలితాలపై భయపడే సంస్కరణలను అటకెక్కించాయని విమర్శించారు. హిమాచల్ ప్రదేశ్లోని రొహతంగ్లో అత్యంత సుదూర అటల్ చటన్నెల్ ప్రారంభోత్సవం తరువాత జరిగిన రెండవ బహిరంగ సభలో శనివారం ప్రధాని మోడీ మాట్లాడారు. కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై సాగుతున్న నిరసనలపై ప్రధాని తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ఇవి పూర్తిస్థాయిలోనే వ్యవసాయ సంస్కరణల్లో భాగంగా తీసుకువచ్చిన చట్టాలని, గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు కూడాఈ దిశలో ఆలోచించాయి. ఇటువంటి చట్టాలను తీసుకురావాలని సంకల్పించాయి. అయితే వారికి దేశం సంస్కరణల కన్నా వారి ఓట్ల ప్రయోజనాలు మిన్న, అందుకే ఇవి సరైన వ్యవసాయ సంస్కరణలు అని భావించినా వీటిని తీసి పక్కనపెట్టారని, ఈ విధంగా ఓట్ల వేటలో వీరుఅస్త్ర సన్యాసం చేశారని వ్యాఖ్యానించారు. ఇప్పుడేమో తమ ప్రభుత్వం ఈ చట్టాలను ధైర్యంగా వ్యవసాయ సంస్కరణల్లో భాగంగా తీసుకువస్తే ప్రభుత్వంపై అస్త్రాలు సంధిస్తున్నారని విమర్శించారు. వ్యవసాయ సంస్కరణలు అత్యవసరం అని వారు భావించినప్పుడు వాటిని అమలు చసే ధైర్యం వారికి ఎందుకు లేదని నిలదీశారు.
పరిస్థితి ఎటు నుంచి ఎటుపోతుందో? ఎటువంటి ఓటు బ్యాంకులు దెబ్బతింటాయో అనే భయాలు పట్టుకుని అప్పడు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఈ బిల్లులను తీసుకువచ్చినట్లే తీసుకువచ్చి వెనకకు నెట్టిందని విమర్శించారు. ఇప్పుడు రైతులను రెచ్చగొడుతున్న పార్టీలకు రైతాంగం ఓ శతాబ్ధం వెనకకు పోవాలని, వారు ఎప్పుడూ అవకాశాలు లేని స్థితిలో కొట్టుమిట్టాడాలనే ఆలోచనలతోనే ఉంటారని అన్నారు. పరోక్షంగా కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాలపై విమర్శలు ధట్టించారు. వ్యవసాయ రంగంలో దళారుల బెడదలేకుండా చేసేందుకు, రైతులు తమ పంటను తమకు అనువైన చోట, సరైన ధరలకు విక్రయించుకునేందుకు, పంటల పరిరక్షణ, ప్రాసిసింగ్ ఇతర సంవిధానాలకు ఈ చట్టాలతో వీలేర్పడుతుందని, మరి వీటిని వ్యతిరేకిస్తున్న పార్టీలను ఏమనుకోవాలి? అని ప్రశ్నించారు. తాము తీసుకువచ్చిన చట్టాలనే ఇంతకు ముందు లోక్సభ ఎన్నికల దశలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో పొందుపర్చిందని పేర్కొంటూ బిజెపి ఇటీవలే అప్పటి మేనిఫెస్టోను ప్రస్తావించింది. ప్రభుత్వ అధీనంలోని మండీలకు వెలుపల కూడా రైతులు తమ పంటలను అమ్ముకోవచ్చునని కొత్త చట్టంలో తెలిపారు.
అయితే, మండీల వ్యవస్థ ఉంటుందని, ఇదే క్రమంలో ఇతరత్రా ఏర్పాట్లు కూడా ఉంటాయని మోడీ తెలిపారు. వ్యవసాయ సంస్కరణలలో భాగంగానే కొత్త చట్టం తెచ్చినట్లు తెలిపారు. ఇక ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ చట్టాలతో పలు ప్రయోజనాలు ఉంటాయని ప్రధాని సమర్థించారు. గడిచిన శతాబ్దాపు కట్టుబాట్లు నియంత్రణలు నూతన శతాబ్ధంలో చెల్లనేరవు అని తెలిపారు. తమ ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్లక్షాన్ని పెట్టుకుందని, దీని సాకారానికి అన్ని విధాలుగా ముందుకు వెళ్లుతామని ప్రధాని స్పష్టం చేశారు. హిమాచల్ ప్రదేశ్ వేదిక నుంచి ప్రధాని మోడీ ప్రతిపక్షాలను లక్షంగా చేసుకుని దాడికి దిగారు. వ్యవసాయ చట్టాలను, కార్మిక కోడ్లను సమర్థిస్తూ తొలిసారి బహిరంగంగా వాదన విన్పించారు. కరోనావైరస్ ధాటి తరువాత బహిరంగ సభలలో ప్రధాని పాల్గొనడం ఆరు నెలల తరువాత ఇదే తొలిసారి. ఇంతకాలం ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ల ద్వారానే పలు కార్యక్రమాలలో మాట్లాడటం జరుగుతోంది. ఇక్కడ జరిగిన పలు సభలలో ప్రధానితో పాటు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ ఇతరులు కూడా పాల్గొన్నారు.
PM Modi Slams Opposition at Rohtang Sabha