Wednesday, May 15, 2024

జంటనగరాల ప్రజలకు శుభవార్త..

- Advertisement -
- Advertisement -

జంటనగరాల ప్రజలకు శుభవార్త
జీఓ 58,59 కింద ఇళ్ల క్రమబద్ధీకరణకు మరో నెల రోజుల గడువు పొడిగింపు
జంటనగరాల ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు సిఎం కెసిఆర్ నిర్ణయం
ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి: సిఎం కెసిఆర్
హైదరాబాద్: జంటనగరాల ప్రజలకు సిఎం కెసిఆర్ శుభవార్త చెప్పారు. ఇళ్ల క్రమబద్ధీకరణకు మరో నెల రోజుల గడువు పొడిగించాలని ఆయన నిర్ణయించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలోని పేదల ఇళ్ల నిర్మాణానికి ఇబ్బందులు తలెత్తకుండా నిబంధనల మేరకు ఇళ్ల స్థలాలను క్రమబద్ధీకరించి, న్యాయమైన హక్కులను కల్పించనున్నట్లు సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. సోమవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలోని ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలిసి జీఓ 58,59 గడువును పెంచాలని వారు విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు సిఎం సానుకూలంగా స్పందించారు. మరో నెల రోజుల గడువు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు నోటరీ స్థలాలను జీఓ 58,-59 ప్రకారం క్రమబద్ధీకరించుకునేందుకు మరో నెల రోజులు గడువు పొడిగిస్తున్నట్లు ఆయన ప్రకటిం చారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. తక్షణమే తమ నియోజకవర్గాల పరిధిలోని ఎమ్మెల్యేలను కలిసి తమకున్న నోటరీ తదితర ఇళ్ల్ల స్థలాల రెగ్యులేషన్ సమస్యలను తెలుపుకోవాలని ఆయన సూచించారు.

ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహిస్తాం
అన్ని సమస్యలను క్రోడీకరించి, పరిష్కరించి, వారికి న్యాయపరమైన హక్కులతో కూడిన పట్టాలను ప్రభుత్వం అందజేస్తుందని సిఎం తెలిపారు. ఏకకాలంలో ఒకే మొత్తంలో పేదల ఇళ్ల సమస్యలు పరిష్కారం కావాలన్నది ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ఇందుకు సంబంధించిన ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహించనున్నట్లు తెలిపారు. అదే సందర్భంలో వ్యవసాయ భూముల నోటరీ సమస్యలను కూడా పరిష్కరిస్తామని సిఎం హామీ ఇచ్చారు. త్వరలోనే ఇందుకు సంబంధించి కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు సిఎం తెలిపారు. సిఎంను కలిసిన వారిలో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు శేరి సుభాష్ రెడ్డి, నవీన్ కుమార్, బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మాగంటి గోపినాథ్, దానం నాగేందర్, మాధవరం కృష్ణారావు, జాజుల సురేందర్, ఆత్రం సక్కు, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీలు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News