మన తెలంగాణ/హైదరాబాద్: భారత ప్రాచీన వైద్య విధానానికి ప్రోత్సాహం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. కేంద్ర సహయ మంత్రి శ్రీపాద నాయక్ గురువారం నిర్వహించిన వీడియా కాన్ఫరెన్స్లో ఆయన ఆయుష్ డిపార్ట్మెంట్ అధికారులతో కలిసి సచివాలయంలో పాల్గొన్నారు. ఈసందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా సమయంలో చాలా మంది నివారణ చర్యల్లో భాగంగా ఆయుర్వేద, హోమియో మందులను విరివిగా వినియోగిస్తున్నారని తెలిపారు. ఏ జబ్బునైనా నివారించడానికి, నిరోధక శక్తిని పెంచడానికి ప్రాచీన వైద్య విధానం ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈక్రమంలో కేంద్రం ఎక్కువ బడ్జెట్ కేటాయించి ఆయుర్వేద డిపార్ట్మెంట్ను శక్తివంతంగా తయారు చేయాలని చెప్పారు. ఆయుర్వేద, యూనాని, హోమియోపతి మందులు తయారు చేయడానికి ఫార్మలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఈటల కేంద్ర మంత్రిని కోరారు.
అంతేగాక హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ కూడా బాగా పనిచేస్తున్నాయని, వాటిల్లో కూడా సదుపాయాలు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఈటల విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం తెలంగాణలో 4 ఆయుర్వేద హాస్పిటల్స్, 2 కాలేజీలు, 343 డిస్పెన్సరీలు పనిచేస్తుండగా, 3 యూనాని హాస్పిటల్స్, ఒక కాలేజీ, 184 డిస్పెన్సరీలు అద్బుతంగా నడుస్తున్నాయని మంత్రి ఈటల వివరించారు. దీంతో పాటు 3 హోమియో హాస్పిటల్స్, కాలేజీ, 199 డిస్పెన్సరీలతో పాటు ఒక నాచురోపతి హాస్పిటల్, కాలేజీ, 28 డిస్పెన్సరీలు మెరుగ్గా నడుస్తున్నాయని మంత్రి తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో వీటికి ప్రజల ఆధరణ కూడా పెరిగిందని, ఈ క్రమంలో ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర సహయ మంత్రిని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కోరారు. ఈ కార్యక్రమంలో వైద్యశాఖ అధికారులతో పాటు ఆయుష్డిపార్ట్మెంట్ అధికారులు, సిబ్బందిలు పాల్గొన్నారు.
TS Govt support to ancient Indian medical practice: Etela