Monday, May 6, 2024

ఖర్చు లేకుండా ఖరీదైన పరీక్షలు

- Advertisement -
- Advertisement -

19 జిల్లా కేంద్రాల్లో డయాగ్నస్టిక్ సెంటర్లు

కరోనాతో సహా 57రకాల టెస్టులు ఫ్రీ
తక్షణమే రిపోర్టులు, ఫోన్లకు మెసేజ్‌లు
7న ప్రధాన ప్రభుత్వ దవాఖానాల్లో ఉచిత వైద్య పరీక్షలు ప్రారంభం
తెలంగాణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించడమే లక్ష్యం
ఆగమైన వైద్యరంగానికి అనతికాలంలోనే పునరుజ్జీవం
డయాగ్నస్టిక్ కేంద్రాల ఏర్పాటు వైద్యచరిత్రలో గొప్ప ముందడుగు
ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటన
కరోనా తీవ్రత, వైద్యసేవలపై అధికారులను ఆరా తీసిన సిఎం

మన తెలంగాణ/హైదరాబాద్: సామాన్యులకు వైద్యాన్ని మరింతగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 19 జిల్లా కేంద్రాలలోని ప్రధాన ప్రభుత్వ దవాఖానాల్లో 19 వైద్య పరీక్ష (డయాగ్నోసిస్) కేంద్రాలను ఈ నెల 7న ప్రా రంభించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. మహబూబ్ నగర్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, జనగాం, ములుగు, మహబూబాబాద్, కొత్తగూడెం, జగిత్యాల, సిద్దిపేట, నల్గొండ, ఖమ్మం, సిరిసిల్ల, వికారాబాద్, నిర్మల్, కరీం నగర్, అదిలాబాద్, గద్వాల, అసిఫాబాద్ తదితర జిల్లాల్లోని ప్రధాన వైద్య కేంద్రాలలో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేసుకున్న డయాగ్నోసిస్ కేంద్రాలను ప్రారంభించాలని తలపెట్టారు. ఈమేరకు వైద్య అధికారులకు సిఎం కెసిఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వైద్య సేవల్లో అత్యంత కీలకమైన రోగ నిర్ధారణ పరీక్షా (డయాగ్నోసిస్) కేంద్రాలను రాష్ట్రంలోని జిల్లా ప్రధాన కేంద్రాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించడం రాష్ట్ర వైద్య చరిత్రలో గొప్ప సందర్భంగా అభివర్ణించారు.శనివారం వైద్యారోగ్యశాఖ అధికారులతో మాట్లాడిన సిఎం రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అలాగే రోగులకు అందుతున్న వైద్య సేవలతో పాటు పలు అంశాలపై కూడా చర్చించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్యం అందిచేందుకు అన్నిరకాల వైద్యసేవలను మరింతగా అందుబాటులోకి తేవడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కరోనా వంటి వ్యాధుల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సహా పలు ఇతర ప్రభుత్వ దవాఖానాల్లో మౌలిక వసతులను మెరుగుపరిచామన్నారు. ప్రజలకు ఉచిత వైద్యకోసం ఇప్పటికే పలు పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నదన్నారు. గత పాలనలో ఆగమైన వైద్య రంగాన్ని అనతికాలంలోనే ప్రభుత్వం పునరుజ్జీవింప చేసిందన్నారు. ప్రజలకు వైద్యం రాను రాను అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిందని సిఎం కెసిఆర్ వ్యాఖ్యానించారు. పేదలకు జబ్బు చేస్తే నయం చేసుకుందానికి ఆస్తులను అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొన్నదన్నారు. రోగం కంటే రోగ పరీక్షల ఖరీదు మరీ ఎక్కువయిందన్నారు.

రోగ నిర్ధారణ జరగాలంటే రక్తం మూత్రం వంటి పరీక్షలు జరపాల్సిందే….ఈ నడుమ ప్రతి మనిషికి బిపిలు, షుగర్లు ఎక్కువ అయ్యాయన్నారు. వాటి పరీక్ష చేయించుకోవడంతో పాటు గుండె, కిడ్నీ, లివర్, ఊపిరితిత్తులు, క్యాన్సరు, థైరాయిడ్ తదితర జబ్బులకు సంబంధించిన పరీక్షలు నిత్యం సామాన్యులకూ పేదలకు అవసరంగా మారాయన్నారు. ఈ మధ్యకాలంలో కరోనా వ్యాధి ఒకటి కొత్తగా జబ్బుల లిస్టులో వచ్చి చేరిందన్నారు. దానికీ పలు రకాల పరీక్షలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ దవాఖానాల్లో డాక్టర్ పరీక్ష చేసి మందులు రాస్తడు కానీ పరీక్ష కోసం ఎక్కడికో ప్రయివేట్ సెంటర్లకు పోయి వేలకు వేలు ఖర్చు చేసి పరీక్షలు చేయించుకోవాల్సి వస్తున్నదన్నారు. దీనివల్ల పేదలకు విపరీతమైన ఆర్ధిక భారం పడుతున్నదని, ఈ నేపథ్యంలో కరోనా నిర్ధారణ పరీక్షలు… చికిత్స కోసం అవసరమైన ఇతర పరీక్షల కోసం కూడా పేదలు నానా అవస్థలు పడుతున్నారు.ఈ నేపథ్యంలో వైద్యాన్ని అందిచడమంటే కేవలం డాక్టర్లు మందులు సూదులు మాత్రమే కాదన్నారు. రోగ పరీక్షలు కూడా అత్యంత ప్రధాన్యత అంశంగా ప్రభుత్వం భావించిందన్నారు. ఈ మేరకు తక్షణం 19 జిల్లాల్లో డయాగ్నసిస్ కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయించిందన్నారు. ఇంకా అవసరమైన చోట్ల దశల వారీగా డయాగ్నోసిస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని అని సిఎం తెలిపారు.

ప్రభుత్వ రంగంలో విప్లవాత్మకం
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లు వైద్య రంగంలో విప్లవాత్మకమైనదని సిఎం కెసిఆర్ అన్నారు. పేదల ఆరోగ్యం కోసం ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తున్నదనేదానికి ఇదే నిదర్శనమన్నారు. ఇందుకు సంబంధించి మంత్రులు, శాసనసభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు వైద్యశాఖ అధికారులతో సమన్వయం చేసుకుని వారి వారి నియోజకవర్గాల్లోని ప్రజలకు మెరుగైన వైద్యం అందే విధంగా వ్యవహరించాలని సిఎం తెలిపారు. కరోనా వంటి ఆపత్కాలంలో ప్రభుత్వం వినియోగంలోకి తెస్తున్న డయాగ్నోసిస్ సేవలు ప్రజలకెంతో మేలు చేస్తాయన్నారు. ఈ పథకానికి త్వరలోనే మంచి పేరును పెడుతామని సిఎం తెలిపారు. ప్రభుత్వం ప్రారంభించబోతున్న డయాగ్నోసిస్ కేంద్రాల్లో మొత్తం 57 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారని సిఎం తెలిపారు. అందులో కరోనా పరీక్షలతో పాటు రక్త పరీక్ష, మూత్ర పరీక్ష సహా బిపి, షూగర్, గుండె జబ్బులు, ఎముకల జబ్బులు, లివర్, కిడ్నీ, థైరాయిడ్ వంటి వాటికి సంబంధించిన ఎక్స్ రే బయోకెమిస్ట్రీ పాథాలజీ కి సంబంధించిన పలు పరీక్షలు ఉంటాయన్నారు. సాధారణ పరీక్షలే కాకుండా, అత్యంత అరుదుగా చేసే ఖరీదుతో కూడుకున్న ప్రత్యేక పరీక్షలను కూడా పూర్తిగా ఉచితంగా చేసి తక్షణమే రిపోర్టులిస్తారని సిఎం తెలిపారు. నిర్దారించిన రిపోర్టులను ఆయా రోగుల సెల్ ఫోన్లకు మెసీజీల రూపంలో పంపించే ఏర్పాట్లను కూడా ప్రభుత్వం చేసిందన్నారు.

అత్యంత అధునాతన రోగ నిర్ధారణ యంత్రాలు
పరీక్షల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న రోగ నిర్ధారణ యంత్రాలన్నీ అత్యంత అధునిక సాంకేతికత, స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ, అత్యంత ఖరీదైన యంత్రాలని సిఎం అన్నారు. ఇటువంటి పరీక్షా యంత్రాలు పెద్ద పెద్ద కార్పోరేట్ దవాఖానాలతో పాటు గాంధీ, ఉస్మానియా, నిమ్స్ వంటి ప్రతిష్టాత్మక ప్రభుత్వ దవాఖానాలల్లో మాత్రమే అందుబాటులో ఉంటాయన్నారు. రాష్ట్రంలోని పేదలకు ఉచితంగా వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఖర్చుకు వెనకాడకుండా వీటిని ఏర్పాటు చేసిందని సిఎం స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన డయాగ్నసిస్ కేంద్రాల్లో.. పూర్తిగా ఆటోమేటిక్ క్లినికల్ కెమిస్ట్రీ అనలైజర్, ఆటోమేటిక్ ఇమ్యునోస్సే అనలైజర్, ఫైవ్ పార్ట్ సెల్ కౌంటర్, ఆటోమేటిక్ యూరిన్ అనలైజర్‌వంటి అత్యాధునిక సాంకేతిక తో కూడిన రోగ నిర్ధారణ పరీక్షా యంత్రాలున్నాయని వివరించారు. వీటితో పాటుగా ఇసిజి, టుడిఇకో, అల్ట్రాసౌండ్, డిజిటల్ ఎక్స్ రే వంటి ఇమేజింగ్ పరీక్షా యంత్రాలను కూడా ఏర్పాటు చేసామన్నారు. ఇవి అత్యంత సామర్ధ్యంతో కూడుకుని అత్యంత వేగంగా రిపోర్టులందిస్తాయన్నరు. పైన తెలిపిన పరీక్షల తీరును అనుసరించి ఒక్కో యంత్రం గంటకు 400 నుంచి 800 రిపోర్టులను అత్యంత ఖచ్చితత్వంతో అందచేస్తాయన్నారు. కోట్లాది రూపాయల ఖర్చు తో ఏర్పాటు చేసిన అత్యాధునిక యంత్రాల ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ మంది పేదలకు రోగ నిర్ధారణలు చేసి వైద్య సేవలను అందించగలుగుతామని సిఎం తెలిపారు. వీటితో పాటు అందుబాటులో లేని చోట్ల సిటిస్కానింగ్ యంత్రాలను కూడా దశల వారీగా ఏర్పాటు చేస్తామన్నారు. ఈ పరీక్షా కేంద్రాల్లో అవసరమైన మేరకు పాథాలజిస్టులు, మైక్రోబయాలజిస్టులు, రేడియాలజిస్టులు, సహా పరీక్షలను నిర్వహించేందుకు అర్హులైన ఇతర సాంకేతిక సిబ్బందిని కూడా ప్రభుత్వం అందుబాటులో ఉంచిందన్నారు.

వైద్య సేవలన్నీ ఉచితమే
వైద్య అవసరాల కోసం నాలుగు రకాల ఖర్చులుంటాయని, దవాఖానకు పోవడానికి రవాణా ఖర్చు , పోయినంక డాక్టర్ ఫీజు, మందులు, పరీక్షల ఖర్చులు ఉంటాన్నారు. ఇక ఇన్ పేషెంట్ గా చేరాలంటే ట్రీట్‌మెంట్ ఖర్చు, రోగం నయమయినంక తిరిగి ఇంటికి పోవాలంటే మల్లా రవాణా ఖర్చు, ఒక వేల చనిపోతే వారి పార్థివ దేహాన్ని తరలించడానికి అదో ఖర్చు ఇన్ని తీర్ల ఖర్చులుంటాని సిఎం అన్నారు. ఈ ఖర్చులన్నీ ప్రభుత్వం భరిస్తూ ప్రభుత్వ దవాఖానాలలో పూర్తి ఉచితంగా సామాన్యులకు వైద్య సేవలందిస్తున్నదని సిఎం తెలిపారు. ఎమర్జెన్సీ సమయాల్లో దవాఖానకు తీసుకుపోవడానికి (108 నెంబర్ అంబులెన్సులు) 428 వాహనాలను నిరంతరం నడుపుతున్నదని తెలిపారు. బాలింతలు తల్లీ బిడ్డల రక్షణ రవాణా కోసం అమ్మఒడి పథకం ద్వారా ఇప్పటికే 300 వాహనాలను ఏర్పాటు చేసి వైద్యాన్ని అందిస్తున్నదని అన్నారు. బాలింతలను దవాఖానాలో చేర్చడం నుంచి తిరిగి ప్రసవానంతరం తల్లీ బిడ్డలను ఇంటివద్దకు సురక్షితంగా చేర్చే వరకు అమ్మఒడి’ వాహనాలు అందుబాటులో ఉంటున్నాయన్నారు. మండల కేంద్రాల్లోని ప్రభుత్వ ప్రాథమిక వైద్య కేంద్రాల్లో చికిత్స చేయించుకున్న రోగికి స్వయంగా ఈ డయాగ్నోసిస్ కేంద్రాలకు వెల్లలేని పరిస్థితులుంటాయన్నారు. ఇటువంటి సందర్భంలో సంబంధిత వైద్యుని సిఫారసు మేరకు, రోగ నిర్ధారణ పరీక్షల కోసం పరీక్షా సాంపిల్ ను ప్రభుత్వమే దగ్గరలో వున్న కేంద్రానికి పంపి పరీక్షలు నిర్వహించి సత్వరమే రిపోర్టులు ఇచ్చే విధంగా ఈ డయాగ్నోసిస్ కేంద్రాల్లో ప్రభుత్వం తగు ఏర్పాట్లు చేసిందని సిఎం పేర్కొన్నారు.

TS Govt to begin Diagnostic centres in 19 district

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News