మనతెలంగాణ/హైదరాబాద్: జమున హాచరీస్ భూముల్లో సర్వే నిలిపివేతకు హైకోర్టు నిరాకరించింది. మాసాయిపేట భూముల సర్వేకు నోటీసు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ మాజీ మంత్రి ఈటల రాజేందర్ భార్య జమున గురువారం హైకోర్టును ఆశ్రయించింది. సర్వే నోటీసులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన న్యాయస్థానం జూన్ 2 లేదా మూడో వారంలో సర్వే చేయాలని తహసీల్దార్ను ఆదేశించింది. కాగా, భూములు సర్వే చేసేందుకు తూప్రాన్ డివిజన్ డిప్యూటీ సర్వే ఇన్ స్పెక్టర్ ఈనెల 6న నోటీసులు ఇచ్చారు. నోటీసులను సవాల్ చేస్తూ జమున దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు వేసవి ప్రత్యేక కోర్టులో న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టారు.
అత్యవసరంగా సర్వే చేయాల్సిన అవసరం ఏమిటని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అసైన్ మెంట్ భూములను తేల్చడానికి సర్వే చేసేందుకే జమున హాచరీస్తో పాటు గ్రామంలోని భూయజమానులందరికీ నోటీసులు ఇచ్చినట్లు అడ్వొకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ తెలిపారు. సర్వే కోసం ముందస్తు నోటీసు ఇస్తే తప్పేంటని పిటిషనర్ ను హైకోర్టు ప్రశ్నించింది. నిబంధనల ప్రకారం వ్యక్తిగతంగా ఎవరైనా కోరితేనే సర్వే కోసం నోటీసులు ఇవ్వాలని సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాష్ రెడ్డి వాదించారు. సరైన కారణాలు వివరించకుండా నోటీసులు ఇవ్వడం చట్టవిరుద్ధమన్నారు. ఇరు వైపులా వాదనలు విన్న న్యాయస్థానం జమున హాచరీస్ భూముల్లో సర్వే నిలిపివేతకు హైకోర్టు నిరాకరించింది. జూన్ 2 లేదా మూడో వారంలో సర్వే చేయాలని తహసీల్దార్కు ఆదేశించింది.
TS HC not stay on Yamuna Hatcheries Survey