మన తెలంగాణ/హైదరాబాద్ : లాక్డౌన్లో చేసిన సడలింపులతో తిరుమల తిరుపతి దేవస్థానం(టిటిడి) తిరిగి స్వామివారి దర్శనం మొదలైంది. రెండు నెలలుగా సందర్శకులు లేక తిరుమల దేవస్థానం బోసిపోగా ఇప్పుడు భక్తుల రాకతో మళ్లీ కళకళలాడుతోంది. అయితే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. పైపెచ్చు రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో భక్తుల మధ్య భౌతిక దూరాన్ని పెంచడానికి టిటిడి అధికారులు ప్రత్యేక చర్యలను చేపడుతున్నారు. దీనికోసం ఓ నయా సాఫ్ట్వేర్ను రూపొందిస్తున్నారు.
తిరుమల వ్యాప్తంగా ఉన్న కెమెరాలతో భక్తుల కదలికలను అనునిత్యం పర్యవేక్షిస్తుంటారు. ఇప్పుడీ సీసీ కెమెరాల ద్వారా భక్తులు పరస్పరం ఎంత దూరంలో ఉన్నారనేది కంప్యూటర్లో నిక్షిప్తం చేసిన నయా సాఫ్ట్వేర్ గుర్తిస్తుంది. రూల్స్ పాటిస్తూ స్క్రీన్పై భౌతిక దూరం పాటిస్తూ కనిపించే వ్యక్తులపై పచ్చరంగు, భౌతిక దూరం పాటించకుండా ఉన్న వ్యక్తులపై ఎరుపు రంగు కనిపిస్తుంది. ఎరుపు రంగు కనిపించిన వెంటనే వారికి హెచ్చరికలు జారీ చేస్తుంది. ప్రస్తుతం ఈ సాఫ్ట్వేర్ అభివృద్ధి దశలో ఉందని సమాచారం.