ఇళ్లనుంచి బయటకు రావద్దని ప్రజలకు హెచ్చరిక
లండన్ : బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మళ్లీ ఫిబ్రవరి మధ్య కాలం వరకు లాక్డౌన్ విధించారు. కొత్త కరోనా స్ట్రెయిన్ తీవ్రంగా వ్యాపిస్తుండడంతో నియంత్రించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన టెలివిజన్ ద్వారా సోమవారం రాత్రి ప్రజలకు వెల్లడించారు. జాతీయ స్థాయిలో మరోసారి కఠినమైన ఆంక్షలతో లాక్డౌన్ విధిస్తున్నట్టు చెప్పారు. ప్రజలంతా మరోసారి బయటకు రాకుండా ఇళ్ల వద్దనే ఉండాలని ప్రభుత్వం ఆదేశిస్తోందని తెలిపారు. అత్యవసరమైన షాపింగ్, రోజువారీ వ్యాయామం, లేదా వైద్య కారణాలకు తప్ప మరిదేని కోసం బయటకు రావద్దని హెచ్చరించారు. స్కూళ్లు, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, జిమ్లు పూర్తిగా మూసివేయనున్నారు. బుధవారం నుంచి ఈ ఆంక్షలు అమలు లోకి రానున్నాయి. సోమవారం నాటికి 27 వేల మంది కొవిడ్తో ఆస్పత్రుల్లో చేరినట్టు జాన్సన్ వెల్లడించారు. గత ఏప్రిల్ నాటి తొలివిడత కరోనా కేసుల కన్నా ఇప్పుడు 40 శాతం అధికంగా కేసులు వెలుగు లోకి వచ్చాయి. గత మంగళవారం ఒక్క రోజే ఏకంగా 80 వేల పాజిటివ్ కేసులు వెలుగు లోకి వచ్చాయి. ఇదిలా ఉండగా మరో ఆరు వారాల్లో కొవిడ్ ముప్పు ఎక్కువగా ఉన్న వారందరికీ టీకా ఇవ్వడం పూర్తవుతుందని జాన్సన్ వివరించారు.
UK prime minister orders new virus lockdown