న్యూఢిల్లీ : దేశంలో హైస్పీడ్ రైళ్లను కేవలం ప్రత్యేక ఎసి కోచ్లతోనే మరింత అప్గ్రేడ్ చేయనున్నారు. ఇటువంటి రైళ్లలో స్లీపర్ కోచ్లు ఉండవని, అయితే మొయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లు ఈ సౌకర్యంతోనే ఇంతకుముందటిలాగానే సాగుతాయని అధికార వర్గాలు తెలిపాయి. సరికొత్త ఎసి కోచ్లు అందుబాటు చార్జీలతో ఉండే ఎకనామిక్ కోచ్లేనని, హమ్సఫర్ ట్రైన్లలోని హేతుబద్థీకరణతో కూడిన చార్జీల మాదిరిగానే వీటిలోనూ ఛార్జీలు ఉంటాయని అధికారులు తెలిపారు. భారతీయ రైల్వేవిభాగం గంటకు 130 కిలోమీటర్ల గరిష్ట వేగం అంతకు మించిన వేగంతో నడిచే రైళ్లన్నింటి సామర్థాన్ని పెంచాలని నిర్ణయించింది. వీటిని పూర్తిస్థాయిలో ప్రత్యేక ఎయిర్కండిషన్డ్ కోచ్లతో అనుసంధానం చేస్తారు. రైల్వేల హై స్పీడ్ నెట్వర్క్ అప్గ్రేడ్ చేయాలనే ప్రయత్నాలలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
హై స్పీడ్ ట్రైన్స్ సామర్థం వాటి నిర్వహణకు పూర్తిస్థాయిలో ఎసికోచ్లుండటం సాంకేతికంగా అత్యవసరం అని, గంటకు 130 కిలోమీటర్ల స్థాయి అంతకు మించి వేగంతో వెళ్లే రైళ్లకు సంబంధించి పలు ప్రత్యేక ఏర్పాట్లు అవసరం అని భావిస్తున్నారు. భారతీయ రైల్వే విభాగం చాలా కాలంగా తమ రైల్వే నెట్వర్క్ను మరింతగా హైస్పీడ్ సామర్థ స్థాయికి తీసుకువెళ్లాలని సంకల్పిస్తోంది. గంటకు 130 నుంచి 160 కిలోమీటర్ల వేగంతో వెళ్లే రైళ్లను తట్టుకుని ఉండే విధంగా ట్రాక్లను తీర్చిదిద్దుతున్నారు. గరిష్టంగా అత్యధిక వేగంతో వెళ్లే రైళ్లలో ఇప్పుడున్న నాన్ ఎసికోచ్లన్నింటిని ఎసికోచ్లతో భర్తీ చేస్తారు. కొన్ని కారిడార్లలో ఇప్పటికే ఈ విధంగా స్పీడ్ సామర్థాన్ని పెంచారు. అత్యధిక వేగంతో వెళ్లే రైళ్లలో గాలి, వాతావరణ అంశాల నేపథ్యంలో కేవలం కొన్ని నిర్థిష్ట కోచ్లే వాటికి అనువుగా ఉంటాయని లేకపోతే రైళ్ల స్పీడ్కు, కోచ్ల పరిస్థితికి సరైన సమన్వయ సమీకరణం పొసగదని రైల్వే మంత్రిత్వశాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు.