వరంగల్: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేసిన సేవలు గొప్పవి అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ పొగిడారు. ఎవివి కాలేజీలో ప్లాటినమ్ జూబ్లీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడారు. ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా ఎవివి విద్యా సంస్థల ప్లాటినం జూబ్లీ వేడుకలు జరుపుకోవడం సంతోషకరమైన విషయమని చెప్పారు. విద్యా ప్రదాత చందా కాంతయ్య సేవలు మరువలేనివని, సికెఎం ఆస్పత్రి, ఎంజిఎం ఆస్పత్రి, మెడికల్ కాలేజీలతో పాటు ఎవివి విద్యాసంస్థలను చందా కాంతయ్య స్థాపించారని ఎర్రబెల్లి ప్రశంసించారు. వరంగల్ జిల్లాకు చందా కాంతయ్య అందించిన సేవలను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు దృష్టికి తీసుకెళ్లానన్నారు. ఈ వేడుకలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మంత్రులు మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎంపిలు బండ ప్రకాశ్, కెప్టెన్ లక్ష్మీ కాంతారావు, పసునూరి దయాకర్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎంఎల్ఎ నన్నపనేని నరేందర్ పాల్గొన్నారు.