Saturday, April 27, 2024

గెలుపు మాదే

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ అభ్యర్థులను రెండు నెలల క్రితమే ప్రకటించాం

మన తెలంగాణ/హైదరాబాద్: గత ఎన్నికల్లో వచ్చిన 88 కంటే ఎక్కువ స్థానాలు గెలుస్తామని బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె. టి.రామారావు విశ్వాసం వ్యక్తం చేశారు. అక్కడో.. ఇక్కడో ఎంఎల్‌ఎలపై చిరు కోపం ఉన్నా… సిఎం కెసిఆర్ నాయకత్వంపై ప్రజలకు దృఢమైన విశ్వాసం ఉం దని పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మం త్రి కె.టి.రామారావు శనివారం విలేకరులతో ఇష్టాగోష్టి గా మాట్లాడారు. బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసి 60 రోజులైందని, బి. ఫారాల పంపిణీ 95 శాతం పూర్తవుతుందని తెలిపారు. తాము ప్రచారంలో ముం దున్నామని, ఫలితాల్లో కూడా ముందే ఉంటామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి 40 చోట్ల అభ్యర్థులు లేరని, బిజెపి పార్టీ యుద్ధానికి ముందే చేతులెత్తేసిందని విమర్శించారు. అభ్యర్థులు ఈసారి 110 స్థానాల్లో డిపాజిట్ కోల్పోతారని పేర్కొన్నారు.
ఓటర్లు మారరు
కొంతమంది నాయకులు మారినంత మాత్రాన ఓటర్లు మారరని, ఓటర్లు తమవైపే ఉన్నారని కెటిఆర్ తెలిపారు. బిఆర్‌ఎస్‌కు కాంగ్రెస్ ఏ మాత్రం పోటీ కాదని పేర్కొన్నారు. ఖమ్మంలో తమకు నేతలు నిం డుగా ఉన్నా… ఒక్క సీటు మాత్రమే వచ్చిందన్నా రు. ఈసారి కొందరు నేతలు వెళ్లారు కానీ సీట్లు మా త్రం పెరుగుతాయని చెప్పారు. ఈసారి ఖమ్మంలో గ తంలో కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
మోడీ, రేవంత్ వ్యాఖ్యలు దారుణం
తెలంగాణ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు దారుణమని విచా రం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను అవమానపరించిందని మండిపడ్డారు. సోనియమ్మ తెలంగాణ ఇవ్వకపోతే తాము బిర్లామందిర్ వద్ద అడుక్కునే వాళ్లమని అవమానపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది తెలంగాణ అస్థిత్వం మీద దాడి కాదా..? ప్రశ్నించారు. కాంగ్రెస్, బిజెపి నేతలు ఢిల్లీకి బానిసలని, ఆ పార్టీల బి.ఫామ్‌లు కూడా ఇక్కడ ఇవ్వరని, ఢిల్లీలోనే ఇస్తారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో తమ పార్టీ నుంచి ఒక్కరే ముదిరాజ్ ఎంఎల్‌ఎ ఉండేవారని, ఆయన పార్టీ రాజీనామా చేయడంతో వివిధ సమీకరణల నేపథ్యంలో ముదిరాజ్‌లకు ఈ ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేకపోయామని అన్నారు. ముదిరాజ్ బిడ్డ రాజ్యసభకు పంపింది కెసిఆరే అని, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ పదవి ఇచ్చి గౌరవించామని గుర్తు చేశారు. భవిష్యత్తులో ముదిరాజ్‌లకు మరిన్ని అవకాశాలు కల్పిస్తామని చెప్పారు.
కోదండరాం బలిదేవత,ముద్దపప్పుతోనే ఉంటారేమో
గతంలో వివిధ కారణాల వల్ల బిఆర్‌ఎస్ పార్టీని వీడిన కొంతమంది తెలంగాణ ఉద్యమకారులు మళ్లీ పార్టీలోకి వస్తున్నారని కెటిఆర్ పేర్కొన్నారు. ఇప్పటికే ఉద్యమకారులు ఉన్నారని, ఇంకా వస్తున్నారు చెప్పారు. కోదండ రాం మళ్లీ బిఆర్‌ఎస్‌లోకి వస్తారా..? అని విలేకరులు అడుగగా, ఆయన ఇటీవల రాహుల్‌గాంధీని కలిశారని చెప్పారు. సోనియాగాంధీని బలిదేవత అని, రాహుల్‌గాంధీని ముద్దపప్పు అని రేవంత్ రెడ్డి అన్నారని, అలాంటి వారితోనే కోదండరాం ఉంటారేమో అని పేర్కొన్నారు.
ఈటల 119 స్థానాలలో పోటీ చేస్తారేమో
రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి ఒక్క సీ టు వచ్చేలా ఉంది, అది కూడా డౌటేనని మంత్రి కెటిఆర్ విమర్శించారు. బిజెపి పార్టీకి అభ్యర్థులు లేరని పేర్కొన్నారు. బిజెపిలో చేరికల కమిటీకి చైర్మన్‌గా ఉన్న ఒక్కరే 119 స్థానాలలో పోటీ చేస్తారేమో అని అన్నారు. కాంగ్రెస్‌లో జానారెడ్డిలాగే, బిజెపిలో ఈటల పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌లో బుజ్జగింపుల కమిటీకి జానారెడ్డి చైర్మన్ అయినట్టు..బిజెపిలో ఈటల చేరికల కమిటీ చైర్మన్‌గా ఉన్నారని పేర్కొన్నారు. ఈసారి హుజురాబాద్, గజ్వేల్‌లో ఈటల ఓడిపోతారని జోస్యం చెప్పారు.
కాంగ్రెస్ చోర్ టీం
రాహుల్ గాంధీ వచ్చి తాము బిజెపి బీ టీమ్ అని అంటారని, కానీ కాంగ్రెస్ పార్టీనే సీ టీమ్(ఛోర్ టీం) అని, లు చ్చా టీమ్, ఎ టు జెడ్ కరప్షన్ పార్టీ కాంగ్రెస్ విమర్శించారు. తాము ఎవరికీ బీ టీమ్ కాదని.. తెలంగాణ ప్రజలకు ఎ టీమ్ అని మంత్రి కెటిఆర్ పునరుద్ఘాటించారు. నరేంద్ర మోడీ, రాహుల్‌గాంధీలు ఒకరికొకరు కౌగిలించుకుంటారు, సహకరించుకుంటారని, వారిద్దరు కలిసి మమ్మల్ని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. నిజామాబాద్, కరీంనగర్‌లో బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ఓట్ ట్రాన్స్‌ఫర్ చేసుకోలేదా..? అని నిలదీశారు. బిజెపి, కాంగ్రెస్ పార్టీలు డైరెక్ట్ పార్ట్‌నర్లు అని ఆరోపించారు. రాహుల్ గాంధీ ఇడ్లీలు, దోశలు వేసుకోవాలని విమర్శించారు. ఈ దేశానికి కాంగ్రెస్ చేసిన మంచి పని ఏంటని మంత్రి కెటిఆర్ ప్రశ్నించారు. మణికొండ, మక్తల్‌లో కాంగ్రెస్, బిజె పి పార్టీలు కలిసి పనిచేస్తున్నాయన్నారు. శివసేన పార్టీ హిందూ పార్టీ అని బహిరంగంగా ప్రకటించుకుంటోంద ని, అలాంటి పార్టీతో కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో పొత్తుపెట్టుకుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ వాళ్లు వచ్చి తా ము మతతత్వ పార్టీలతో పొత్తుపెట్టుకుంటున్నామని వి మర్శిస్తుందని మండిపడ్డారు. మజ్లిస్ పార్టీ తమకు ఫ్రెండ్లీ పార్టీ, ఆ పార్టీ ఎక్కడైనా ముస్లిం పార్టీ అని ప్రకటించుకుందా..? అని ప్రశ్నించారు. దేశంలో బిజెపిని బూచిగా చూపించి, మైనార్టీల ఓట్లు వేయించుకుంటోంది కాంగ్రెస్ కాదా…? అని ప్రశ్నించారు. జనగామ, స్టేషన్ ఘన్‌పూర్‌లో అసంతృప్తి సద్దుమణిగిందని చెప్పారు. ఖానాపూర్, బోథ్ ఎంఎల్‌ఎలు తమ పార్టీ నుంచి వెళ్లిపోయారని,ఎన్నికల సమయంలో అది సహజం అని వ్యాఖ్యానించారు. వ్యక్తులు పార్టీతే తమకు వచ్చే నష్టం ఏమీ లేదని, వ్యవస్థ పటిష్టంగా ఉందాలన్నదే సిఎం కెసిఆర్ ఉద్దేశమని, అం దుకే కొన్ని సార్లు కఠిన నిర్ణయాలు తీసుకుంటారన్నారు.
కాంగ్రెస్, బిజెపి నేతలు ఢిల్లీకి బానిసలు
తెలంగాణకు చెందిన కాంగ్రెస్, బిజెపి నేతలు ఢిల్లీకి బానిసలని కెటిఆర్ విమర్శించారు. మైనార్టీ సంక్షేమంలో దే శంలో తెలంగాణ టాప్ అని, తాము బిజెపికి బీ టీం అ యితే మైనార్టీల సంక్షేమం కోసం అన్ని నిధులు ఎందుకు ఖర్చు చేస్తామని ప్రశ్నించారు. అత్యధికంగా మైనార్టీలు ఉన్న ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, మహారాష్ట్రలో కూడా తెలంగాణ మైనార్టీల సంక్షేమం కోసం ఖర్చు నిధులు ఖర్చు చేయడం లేదని పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ ప్రభు త్వం జిల్లాకో వైద్య కళాశాలలు పెట్టిందని గుర్తు చేశారు. విద్య, వైద్యం, తాగునీరు, సాగునీరు.. ఇలా అన్ని రం గాల్లో కాంగ్రెస్ ఏం చేసిందో.. తమ ప్రభుత్వం ఏం చేసిం దో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తమకు ఏ మాత్రం పోటీ కాదని, రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ నేతలు ఏమాత్రం సరితూగరని విమర్శించారు. ఛత్తీస్‌ఘడ్‌లో ఒకే పంటను పరిమితి మేరకు కొనుగోలు చేస్తారని.. వాళ్లు మాకు సుద్దులు చెబుతారా..? అని విమర్శించారు. కర్ణాటకలో ఐదు గంటల కరెంట్ కోత వాస్తవం కాదా…? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ కుంభకోణాల కుంభమేళా
దేశాన్ని 60 ఏళ్లు పాలించి ఎన్నో స్కామ్‌లు చేసిన కాం గ్రెస్ పార్టీ తమను అవినీతి పార్టీ అని విమర్శిస్తుందని కె టిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ కుంభకోణాల కుంభమేళా అని విమర్శించారు. రాహుల్ గాంధీ ఒ క అజ్ఞాని అని, అతనికి ఏమీ తెలియదని పేర్కొన్నారు. తెలంగాణలో ఇసుక మాఫియా అని ఆరోపిస్తాడని, కాం గ్రెస్ హయాంలోనే ఇసుక మాఫియా అన్నది రాహుల్‌కు తెలియదా..? అని నిలదీశారు. కాంగ్రెస్ హయాంలో 2004 నుంచి 2014 వరకు ఇసుకపై ప్రభుత్వానికి 39. 40 కోట్లు వస్తే తడిచిన తొమ్మిదిన్నరేళ్లలో తెలంగాణలో ఇసుకపై 5,800 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందని, కాంగ్రెస్ హయాంలో మిగతా డబ్బు ఎవరి జేబులోకి వెళ్లిందని ప్రశ్నించారు. కింది నుంచి మీదికి సూట్ కేసులు మోసేది కాంగ్రెస్‌లోనే అని, అన్ని మాఫియాలు, స్కామ్‌లు కాంగ్రెస్ హయాంలోనే అని విమర్శించారు. టిపిసిసి పదవి అమ్ముకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని, ఎంఎల్‌ఎ సీట్లను అమ్ముకుంటోంది రేవంత్, కాంగ్రెస్ కా దా..? అని నిలదీశారు. అలాంటి లేకిగాళ్ళు వచ్చి మాకు నీతులు చెప్పడమా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హ యాంలో సాండ్ మాఫియా, ల్యాండ్ మాఫీయా ఎక్కువ గా ఉందని అన్నారు. కులగణన కోసం బిఆర్‌ఎస్ పార్టీ ప్లీ నరీలో, రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేశామని కెటిఆర్ గుర్తు చేశారు. ఈ విషయంలో రాహుల్ గాంధీ ఆలస్యం గా మేల్కొన్నారని, ఇప్పుడు ఆయన కులగణన గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతలు బిఆర్‌ఎస్‌కు ఏ మాత్రం సరితూగరని విమర్శించారు. రాహుల్‌గాంధీ మరోసారి తెలంగాణకు వచ్చినప్పుడు కనీసం తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. కాంగ్రెస్ హయాంలో విద్యుత్ సామర్థం 7, 700 మెగావాట్లు మాత్రమే ఉంటే, అదే తమ హయాం లో ఎవరూ ఊహించనంతగా 26 వేల మెగావాట్లకు పెం చామని చెప్పారు. నల్గొండలో ఫ్లోరోసిస్ పాపం కాంగ్రెస్‌దే అని, దానిని రూపుమాపింది బిఆర్‌ఎస్ అని పేర్కొన్నారు. 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ హయాంలో రాష్ట్రం లో 5 మెడికల్ కాలేజీలు ఉంటే, తమ ప్రభుత్వం 30 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిందని తెలిపారు. విద్య, వైద్యం, సంక్షేమం, సాగునీరు, తాగునీరు రంగాలలోలో బిఆర్‌ఎస్‌కు ఎవరూ పోటీ కాదని పునరుద్ఘాటించారు. తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నెంబర్‌వన్ అని చెప్పారు. రైతు బంధు, దళిత బంధు పథకాలు దేశం లో ఎక్కడైనా ఉన్నాయా…? అని ప్రశ్నించారు. రైతుబం ధు వంటి పథకాలు అమలు చేస్తూ రైతులకు అండగా ఉంటున్న తమకు వ్యవసాయంలో సుద్దులు చెప్తే హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ చేసిన మంచి పని ఏమిటి?
ఎన్నికలు ఉన్నపుడల్లా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారాలకు ముహూర్తాలు పెట్టడం కాంగ్రెస్ పార్టీకి మాములేనని కెటిఆర్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రే ఆ పార్టీకి గుది బండ అని పేర్కొన్నారు. సీ ఓటర్ సర్వే తమకు వ్యరేతికంగా రావడం ఒక శుభసూచకం అని కెటిఆర్ వ్యాఖ్యానించారు. 2018 కూడా సీ ఓటర్ సర్వే వచ్చిందని, అప్పుడు కాంగ్రెస్‌కు 64 సీట్లు అని ఆ సర్వే చెప్పిందని, కానీ అది జరగలేదని చెప్పారు. ఇప్పుడు కూడా సీ ఓటర్ అంచనా తప్పుతుందని, కాబట్టి తాము అధికారంలోకి వస్తామని కెటిఆర్ పేర్కొన్నారు. 2018 లో కూడా సీ ఓటర్ సర్వే చెప్పింది తప్పయ్యిందని, ఈ సారి అదే రిపీట్ అవుతుందని చెప్పారు. తాము చేయించుకున్న సర్వేలో తెలంగాణలో బిఆర్‌ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలువబోతుందని తేలిందని అన్నారు. మంథా ని, రామగుండంలో పోటాపోటీ ఉంటుందని తాము భావించామని, కానీ ఆ స్థానాలలో కూడా తామే గెలువబోతున్నామని సర్వేలో వెల్లడైందని అన్నారు. వరి ధా న్యం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ అయి తే నల్గొండ జిల్లా దేశంలోనే నెంబర్ వన్ అని పేర్కొన్నారు. నల్లొండ జిల్లాలో నల్గొండలో 12కు 12 బిఆర్‌ఎస్ పార్టీ గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం
పదేళ్ల కాంగ్రెస్ 24 వేల ఉద్యోగాలు భర్తీ అయితే…మా హయాంలో 1.34 లక్షల ఉద్యోగాలు భర్తీ అయ్యాయని కెటిఆర్ తెలిపారు. కాంగ్రెస్ పదేళ్ల హయాంలో ఎపిపిఎస్‌సి ద్వారా జరిగిన ఉద్యోగ నియామకాలు 24 వేలు మాత్రమే అని, అందులో తెలంగాణ వాటా 10 వేలు అని వివరించారు. బిఆర్‌ఎస్ సర్కారు హయాంలో తొమ్మిదిన్నరేళ్లలో 1,34,000 ఉద్యోగ నియామకాలు పూర్తి చేశామని,మరో 90 వేల నియామకాలు వివిధ దశల్లో ఉన్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఏడాదికి వెయ్యి ఉద్యోగాలు ఇస్తే.. తాము ఏటా 13 వేలు ఇచ్చామని వెల్లడించారు. రాష్ట్రంలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పరీక్షలకు 12 నుంచి 13 లక్షల మంది పోటీ పడుతున్నారని, గతంలో జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్‌కు మూడు లక్షల మంది హాజరయ్యారని, గ్రూప్ 2కు 3 నుంచి 4 లక్షల మంది హాజరయ్యారని పేర్కొన్నారు. అయితే టిఎస్‌పిఎస్‌లో రిజిష్టర్ చేసుకున్న అభ్యర్థులను చూపిస్తూ రాష్ట్రంలో 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని చెబుతున్నారని తెలిపారు. ఉద్యోగ నియామకాలలో భర్తీ జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుని పకడ్బంధీగా పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేసి, ఏటా రిటైర్ అయ్యే ఉద్యోగులను భర్తీ చేస్తామని కెటిఆర్ ప్రకటంచారు. టిఎస్‌పిఎస్‌సి ద్వారా దేశంలోనే అత్యధిక సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చే శామని వెల్లడించారు.గ్రూప్స్ పరీక్షలు వాయిదా వేయాలని కోర్టులకు వెళ్లింది, పరీక్షలు జరగకుండా అడ్డుకున్నది బండి సంజయ్, రేవంత్ రెడ్డి, ఆర్‌ఎస్ ప్రవీణ్ కు మార్, బల్యూరి వెంకట్ కాదా..? అని నిలదీశారు. ప్రవళిక మరణాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేస్తే… తాము మానవీయ కోణంలో ఆదుకున్నామని కెటిఆర్ వివరించారు. ప్రవళిక సోదరుడికి ప్రభుత్వం ఉద్యోగం ఇస్తానని తాను చెప్పలేదని, కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటానని చెప్పానని చెప్పారు.
పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచేది మోడీ
దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు నరేంద్ర మోడీ పెంచితే తాము ఎలా తగ్గిస్తామని కెటిఆర్ అన్నారు. బిఆర్‌ఎస్ మెనిఫెస్టోలో ప్రకటించిన ప్రకారం తెల్లరేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు రూ.400 గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తామని చెప్పారు.
సీఎం అర్హులు చాలామంది ఉన్నారు
బిఆర్‌ఎస్ పార్టీలో సీఎంలు అయ్యే అర్హత ఉన్న నేతలు చాలామంది ఉన్నారని.. నాకు అలాంటి కోరికలు లేవని కెటిఆర్ వ్యాఖ్యానించారు. సీఎం పదవిపై తనకు ఎటువంటి పిచ్చి ఆలోచనలు లేవని స్పష్టం చేశారు. ముమ్మాటికీ తెలంగాణ సిఎం కెసిఆరే అని పునరుద్ఘాటించారు. కెసిఆరే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు.. అందులో రెండో వాదన లేదని అన్నారు. ప్రతిపక్షాలకు నా మీద ప్రేమ ఎక్కువగా ఉంది… అందుకే తాను సిఎం కావాలని కోరుకుంటున్నారని చమత్కరించారు. అధికారం దక్కించుకోవాలనే తప్ప రాహుల్‌గాంధీకి వేరే ధ్యాస లేదని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News