Monday, May 6, 2024

మేడిగడ్డపై విజిలెన్స్ విచారణ

- Advertisement -
- Advertisement -

యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి 12 ప్రత్యేక బృందాలు

నీటి శాఖ కార్యాలయాలపై ఆకస్మిక దాడులు
కీలక పత్రాలు, రికార్డులు స్వాధీనం
ప్రాజెక్టు నష్టాలకు కారణాలపై ఆరా

మన తెలంగాణ/మహాదేవ్ పూర్/జ్యోతినగర్ /హైదరాబాద్:  కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ బ్యారేజి కుంగుబాట ఘ టనపై రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశాలిచ్చింది. ఆదేశాలు వచ్చిన తక్షణం యుద్ద ప్రాతిపదికన విజిలెన్స్ ఎన్‌ఫోర్సుమెంట్ అధికారులు రంగంలోకి దిగారు. మంగళవారం 12 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నీటి రుదల శాఖకు చెందిన పలు కార్యాలయాల్లో సోదాలు చేపట్టారు. కాళేశ్వర సాగునీటి ఎత్తిపోతల పథకానికి చెందిన పలు కీలక డ్యాక్యమెంట్లు, రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ జలసౌధలో ఉన్న తెలంగాణ రాష్ట్ర నీటి శాఖ ప్రధాన కార్యాలయంలోనూ ఆకస్మికంగా సోదా లు నిర్వహించారు. ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ కార్యాలయాలన్ని విజిలెన్స్ అధికారులు జల్లెడ పట్టారు. తొలుత విజిలెన్స్ ఎన్‌ఫోర్సుమెంట్ అధికారుల బృందం జలసౌధలోకి ప్రవేశించి నీటిపారుదల శా ఖ ప్రధాన కార్యాలయంలో పనిచేసే సిబ్బంది అందరికీ హెచ్చరిక చేశారు . అందరు వరుసగా ఒక చోటికి చేరాలని చేసిన హెచ్చరిక మేరకు తమ స్థానాలనుంచి అంతా ఒక చోటికి చేరి వరుసగా నిలుచున్నారు. ప్రధాన కార్యాలయం ముఖద్వారం వద్ద లోపలినుంచి ఎవరూ బయటకు వెళ్లకుండా, బయటివారు లోపలికి వెళ్లకుండా జలసౌధను విజిలెన్స్ అధికారులు తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. ఆ తర్వాత కార్యాలయంలో కీలక పత్రాలు తనిఖీ చేశారు. కొన్నింటిని స్వాధీనం చేసుకున్నారు. ఇఎన్‌సి కార్యాలయంలో ఉన్న కీలక ప్రత్రాలను పరిశీలించి అవసరమైన వాటిని సీజ్ చేశారు. కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలపై కూడా దృష్టి సారించారు. సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్, క్వాలిటీ కం ట్రోల్ విభాలకు చెందిన కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. పలు కీలకమైన రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా , వరంగల్ జిల్లాల్లో నీటి పారుదల శాఖ ముఖ్యకార్యాలయాల్లోనూ సోదాలు నిర్వహించారు. మేడిగడ్డ , అన్నారం సుందిళ్ల బ్యారేజిలు ,కన్నెపల్లి , సిరిపురం ,గోలిబాడ పంపుహౌస్‌లకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. రామగుండం మహదేవ్‌పూర్ లోయర్‌మానేరు ప్రాజెక్టులకు చెందిన ప్రత్యేక కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్‌టిపిసి కృష్ణానగర్ కాలనీలోని ఇంజినీర్ ఇన్ చీఫ్ కార్యాలయం , మేడిపల్లిలోని సూపర్నెంట్ ఇంజనీర్ కార్యాలయం , ఎఫ్‌సిఐ క్రాస్ రోడ్డులో ఉన్న క్వాలిటీ కంట్రోల్ సర్కిల్ కార్యాలయాల్లోనూ సోదాలు జరిపారు. కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లు తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించారు. కొన్ని కీలక ఫైళ్లను స్వాధీనం చేసుకున్నట్టు విజిలెన్స్ అదనపు ఎస్‌పి బాలకోటయ్య వెల్లడించారు. మేడిగడ్డ బ్యారేజి ,కన్నెపల్లి పంప్‌హౌస్‌లకు సంబంధించిన కార్యాలయాల్లో విజిలెన్స్ బృందాలు రికార్డులను జల్లెడ పట్టాయి. మహదేవ్‌పూర్ సాగునీటి శాఖ డివిజన్ కార్యాలయం, కన్నెపల్లి పంప్‌హౌస్ కార్యాలయాల్లో అత్యంత కీలకమైన రికార్డులు పరిశీలన చేసి వాటిలో కొన్నింటిని సీజ్ చేశారు.
ఇఎన్‌సి మురళీధర్ ఆగ్రహం
జలసౌధలోని నీటి శాఖ ప్రధాన కార్యలయం వద్ద నీటి పారుదల శాఖ అధిపతిగా ఉన్న ఇఎన్‌సి మురళీధర్ భద్రతా సిబ్బందిపై ఆగ్రహం వెలిబుచ్చారు. కార్యాలయంలోకి అనుమతి లేకుండా ఎవరిని పడితే వారిని ఎలా లోపలికి రానిస్తారని నిప్పులు చెరిగారు. సందర్భంగా మురళీధర్ మీడియాతో మాట్లాడుతూ విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు కొన్ని డ్యాక్యుమెంట్ల కోసం కార్యాలయానికి వచ్చారని తెలిపారు. వారి పని వారు చేసుకుంటున్నారని , చేసుకోనివ్వండని అన్నారు. విజిలెన్స్ అధికారులు ఏ రికార్డుల పరిశీలించారు. వేటిని స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో ఏమి జరిగింది అన్నవివరాలను మీడియాకు చెప్పజాలమని ఇఎన్‌సి మురళీధర్ పేర్కొన్నారు.
మేడిగడ్డపై ప్రభుత్వానికి విజిలెన్స్ నివేదిక: మంత్రి ఉత్తమ్ కుమార్
కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి పధకంలో భాగంగా గోదావరి నదిపై నిర్మించిన మేడిగడ్డ బ్యారేజి కుంగుబాటుపై విచారణకు ఆదేశాలు ఇచ్చామని మంగళవారం నీ టి శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు చెందిన 10కార్యాలయాల్లో అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నట్టు తెలిపారు. విజిలెన్స్ తనిఖీలు ముగిశాక ప్రభుత్వానికి సమగ్రమైన నివేదిక అం దించనున్నట్టు తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ల కుంగుబాటుపై న్యాయవిచారణ జరిపించాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిందన్నారు. మంత్రివర్గ సమావేశంలోనూ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. న్యాయ విచారణ కోసం రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసినట్టు మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News