మంగళూరు: తాము ఏర్పాటు చేస్తున్న విష్ణుగుప్త విశ్వవిద్యాపీఠం భారతీయ విజ్ఞానాన్ని అందచేయడంలో మరో తక్షశిల లేదా నూతన నలంద విశ్వవిద్యాలయాన్ని అధిగమిస్తుందని శ్రీ రామచంద్రాపుర మఠం పీఠాధిపతి రాఘవేశ్వర భారతి స్వామి పేర్కొన్నారు. ఆదివారం గోకర్ణలోని అశోక వనలో ప్రతిపాదిత విష్ణుగుప్త విశ్వవిద్యాపీఠంపై జరిగిన అవగాహనా కార్యక్రమంలో స్వామీజీ మాట్లాడుతూ భారతదేశంలో విద్యకు సంబంధించి భిన్న పాఠ్యాంశాలు ఉన్నప్పటికీ భారతీయ విలువలు, సాంప్రదాయాలను తెలియచేసే పాఠ్యాంశాలు మాత్రమే లేవని అభిప్రాయపడ్డారు. భారతీయ పురాతన విజ్ఙానాన్ని తిరిగి వెలుగులోకి తీసుకురావలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆయన అన్నారు. ప్రాచీన భారతీయ విజ్ఞానంలోని చాలా అంశాలు గత కొన్ని శతాబ్దాలుగా క్రమేణా కనుమరుగైపోయాయని ఆయన చెప్పారు. ఉదాహరణకు సామవేదంలో వెయ్యి విభాగాలు ఉండేవని పూర్వీకులు చెప్పేవారని, కాని ఇప్పుడు మూడు మాత్రమే అందుబాటులో ఉన్నాయని ఆయన అన్నారు.
భవిష్యత్ తరాల కోసం భద్రపరిచేందుకు ప్రాచీన విజ్ఙానాన్ని తిరిగి శోధించాల్సిన అవసరం ఉందని స్వామీజీ చెప్పారు. తాము ఏర్పాటు చేయతలపెట్టిన విష్ణుగుప్త విశ్వవిద్యాపీఠంలో వేదాలు, ఆరు వేదాంగాలు, పురాణాలతోపాటు మీమాంశ, వేదాంత, న్యాయ, వైశేషిక, సాంఖ్య, యోగతో కూడిన శద్దర్శన పాఠ్యాంశాలుగా ఉంటాయని, అదే విధంగా 64 ప్రాచీన కళలు, కంప్యూటర్ సైన్స్, లౌకిక ప్రపంచానికి సంబంధించిన అంశాలు బోధనాంశాలలో ఉంటాయని స్వామీజీ వెల్లడించారు. ఒక్కో విద్యార్థిని ఒక్కో అంశంలో నిష్ణాతునిగా తీర్చిదిద్దడంతోపాటు అన్ని అంశాలలో తగిన జ్ఙానాన్ని పొందేవిధంగా తయారు చేయడమే తమ విశ్వవిద్యాపీఠం లక్షమని ఆయన తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు ప్రవేశాలు ప్రారంభమవుతాయని, ఈ ఏడాది ఏప్రిల్ 26న అక్షయ తృతీయ పర్వదినం నాడు అడ్మిషన్లు ముగుస్తాయని ఆయన వివరించారు. కులము, వయసు, స్త్రీ పురుష వ్యత్యాసం లేకుండా ఎవరైనా కోర్సులలో ప్రవేశం పొందవచ్చని స్వామీజీ వివరించారు.