Saturday, April 27, 2024

మళ్లీ విఆర్వో, విఆర్‌ఎ వ్యవస్థ!

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని రెవెన్యూ ఉద్యోగులు, అధికారులకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వానికి, గ్రామాలకు మ ధ్య వారధిగా పనిచేస్తూ వచ్చిన గ్రామ రెవెన్యూ వ్యవస్థ మళ్లీ పునరుద్ధ్దరించేందుకు, విఆర్వో,-వి ఆర్‌ఏ వ్యవస్థలకు మళ్లీ జీవం పోసేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ కసరత్తులు చేస్తోంది. గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థను గతంలో కంటే మరింత పటిష్టంగా తయారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ రెవె న్యూ మంత్రిత్వశాఖ నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు రానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గ్రామ రెవెన్యూ వ్యవస్థలో పునరుద్ధరణకు సం బంధించిన బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలున్నాయని, ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గానీ, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిగానీ అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయని కొందరు సీనియర్ అధికారులు వివరించారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి స్థాయిలో విధానపరమైన నిర్ణయం తీసుకొన్న తర్వాత రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణ కార్యక్రమాలు మొ దలవుతాయని, అయితే గ్రామాల్లో తిష్ఠవేసిన ఎన్నో సమస్యలను ప్రభుత్వం గుర్తించిందని, దాదాపు 20రకాల సమస్యలు, విఆర్వో, నిర్వర్తించే డ్యూటీలు, బాధ్యతలు అన్నీ పెండింగ్ సమస్యలుగా మిగిలిపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనే విషయాలను ఉన్నతాధికారులే కాకుం డా రెవెన్యూ శాఖ మంత్రి, చివరకు ముఖ్యమం త్రి కూడా గుర్తించారని, అదీగాక ఎన్నికల సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి ఎన్నో సమస్యలు వచ్చాయని, వాటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణ జరిగి తీరాలని సిఎం చాలా స్పష్టంగా ఆదేశించారని ఆ అధికారులు వివరించారు.

అయితే మొన్నటి వరకూ మనుగడలో ఉన్న విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ (విఆర్వో), విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ (విఆర్‌ఎ) పోస్టులను యథావిధిగా ప్రవేశపెడతారా? లేక ఆ రెండు రకాల పోస్టులను కలిపి ఒకే పో స్టుగా సర్దుబాటు చేసి విలేజ్ రెవెన్యూ సెక్రటరీ (విఆర్‌ఎస్) అనే పోస్టును సృష్టించి నియామకాలు చేస్తారా? అనే అంశాలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, ముఖ్యమంత్రి స్థాయిలో సమీక్ష జరిగిన తర్వాత విధానపరమైన ఆదేశాలు వచ్చి న తర్వాత తుది నిర్ణయం తీసుకొంటామని ఆ అధికారులు వివరించారు. అంతేగాక ఇప్పటికే విఆర్వో డిజిగ్నేషన్‌తో పనిచేసిన 5,500 మంది ఉద్యోగులను ఇతర ప్రభుత్వ శాఖలకు బదిలీ చేశారని, అంతేగాక సుమారు 22,500 మంది విఆర్‌ఏలను కూడా ఇతర విభాగాలకు బదిలీ చేశారని, ఇందులో మెజారిటీ ఉద్యోగులను జూనియర్ అసిస్టెంట్‌లుగా చేసి రెగ్యులర్ జీతం స్కేలు ఇస్తున్నారని, వారందర్నీ వెనక్కు పిలుస్తారా? లేక ఆప్షన్ అడిగిన తర్వాతనే వారి ఇష్టానుసారంగా పాత పోస్టులో నియమిస్తారా? అనే అంశాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే విషయంపై ప్రభుత్వంలో చర్చలు జరుగుతున్నాయని వివరించారు.

సాధ్యమైనంత తొందరగా గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించడమే కాకుండా ఆ వ్యవస్థను మరింతగా బలోపేతం చేయడమే కాకుండా ప్రభుత్వానికి రెండు కళ్లుగా గ్రామాల్లోని రెవెన్యూ ఉద్యోగులు విధులు నిర్వర్తించే విధంగా చేస్తామని, అందుకు తగినట్లుగా ఏర్పాట్లు జరుగుతున్నాయని వివరించారు. లేకుంటే గ్రామాల్లో 20 రకాల డ్యూటీలన్నీ పడకేశాయని, అంతేగాక గ్రామాలకు మంతులు వచ్చినా, చివరకు కలెక్టర్ వచ్చినా ప్రోటోకాల్ విధులు నిర్వర్తించేవారు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామనే అంశాన్ని ప్రభుత్వం గుర్తించిందని చెప్పారు. గ్రామాల్లో భూముల సమస్యల పరిష్కారాలు, శాంతి-భద్రతల సమస్యలు, ప్రకృతి వైపరీత్యాలు, ధాన్యం కొనుగోళ్లు సంక్షేమ పథకాల చెక్కుల పంపిణీ, సంక్షేమ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేసే కార్యక్రమాలు, ఎలక్షన్ డ్యూటీలు, ప్రభుత్వ భూముల పరిరక్షణ, కుల ధ్రువీకరణ పత్రాలు, ఇన్‌కం సర్టిఫికెట్లు, బర్త్ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్లు, ఇసుక మాఫియా ఆగడాలు, మట్టి తవ్వకాలను అరికట్టడం, యాక్సిడెంట్లుగా జరిగినా ఇప్పుడు పక్కా సమాచారం ఇచ్చే నాధుడు లేడని, వ్యవసాయ ఆదాయ పత్రాలు జారీ చేయడం, ఓటర్ల జాబితా తయారీ, సివిల్ సప్లయీస్ డ్యూటీలు, రేషన్ షాపుల సమాచారం, ప్రకృతి వైపరీత్యాలు, కరువు, కాటకాలు, పంటల నష్టాల అంచనాలు వేసేటప్పుడు కీలకమైన పాత్రను పోషించాల్సిన ఉద్యోగులు ఇప్పుడు గ్రామాల్లో ఎవ్వరూలేరని, ఆ బాధ్యతలన్నింటినీ నిర్వర్తించే విఆర్వో, విఆర్‌ఎలు లేకపోవడం మూలంగా అవన్నీ పెండింగ్ సమస్యల జాబితాలోకి చేరిపోయాయనే అంశాలను ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గుర్తించిందని, అందుకే మళ్లీ గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకొన్నట్లుగా వివరించారు.

కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేయడం దగ్గర్నుంచి వారికి చెక్కులను పంపిణీ చేసే వరకూ సంబంధిత గ్రామాల్లో ప్రజలతో కలిసిపోయి ప్రభుత్వానికి, తహసీల్దార్ల దగ్గర్నుంచి ఆర్‌డిఒ, కలెక్టర్ల వరకూ మార్గదర్శకులుగా బాద్యతలు నిర్వర్తించేదే విఆర్వో, విఆర్‌ఎలని, అలాంటి ఉద్యోగులు లేకపోతే ప్రభుత్వానికి, గ్రామాలకు మధ్య లింకు తెగిపోయినట్లేనని, అందుచేతనే ఆ వ్యవస్థను పునరుద్ధ్దరించకపోతే ప్రజలకు-ప్రభుత్వానికి మధ్య గ్యాప్ కూడా పెరిగిపోతుందనే అంశాలను ప్రభుత్వ పెద్దలు గుర్తించారని వివరించారు. ఇలా సమాజంలో అత్యంత కీలకమైన పాత్రను పోషించే రెవెన్యూ ఉద్యోగులు లేకపోతే ఎన్ని అనర్థాలు జరుగుతాయనడానికి గత మూడేళ్లల్లో గ్రామాల్లో పేరుకుపోయిన లక్షలాది సమస్యలే ప్రత్యక్ష సాక్షమని ఆ అధికారులు వివరించారు. అందుకే ప్రజలకు అత్యంత చేరుగా ఉంటూ, ప్రజలకు చేదోడు, వాదోడుగా, ప్రజలకు ప్రభుత్వమే తమ కళ్లముందు ఉంది అన్నట్లుగా విధులు నిర్వర్తించే గ్రామ రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించడమే న్యాయమైన చర్యని తమ ప్రభుత్వం భావిస్తోందని వివరించారు. అందుకే యుద్ధ్దప్రాతిపదికన గ్రామ రెవెన్యూ వ్యవస్థ మరింత పటిష్టంగా సేవలందించేందుకు రాబోతోందని వివరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News