ఆసీస్ వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ
ముంబయి: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తరహాలోనే అత్యుత్తమ ఫినిషర్ అవ్వాలని అనుకుంటున్నానని ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాట్స్మన్ అలెక్స్ క్యారీ అన్నాడు. ‘ నా ఆటలో కొన్ని బలహీనతలను అధిగమించాల్సిన అవసరం ఉంది. మిడిలార్డర్, లేదా లోయర్ ఆరర్లో బ్యాటింగ్కు దిగి జట్టును విజయ తీరాలకు చేర్చాల్సిన బాధ్యత నాపై ఉంటుంది. ఈ విషయంలో ప్రపంచంలోనే ధోనీ అత్యుత్తమం. అతడినుంచి వీలయినంత నేర్చుకోవాలి. టీమిండియా కోసం అతడు ఆఖరువరకు పోరాడిన తీరులోనే నేను నా దేశంకోసం పోరాడాలని అనుకుంటున్నా. భారత్లో భారత్ను ఎదుర్కోవడం కష్టతరం. స్పిన్తో పాటుగా ప్రపంచ స్థాయి బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీని ఎదుర్కోవడం సవాలే’ అని క్యారీ అన్నాడు.
‘మరికొన్ని రోజుల్లో హోరాహోరీ వన్డేమ్యాచ్లు (భారత్తో వన్డే సిరీస్) ప్రారంభం కానున్నాయి. వికెట్ కీపింగ్తో పాటుగా మిడిల్ లేదా లోయర్ ఆర్డర్లో రాణించడమే నా బాధ్యత. జట్టు అవసరాలను బట్టి 5,6,7 స్థానాల్లో బ్యాటింగ్కు రావాలి. మా జట్టులో ఫించ్, వార్నర్, స్మిత్, లబుషేన్ వంటి కీలక బ్యాట్స్మెన్ ఉన్నారు. భారత్కు మేము గట్టిపోటీ ఇస్తాం’ అని క్యారీ పేర్కొన్నాడు. టీమిండియాతో ఆస్ట్రేలియా మూడు వన్డేలు ఆడనుంది. ముంబయి వేదికగా మంగళవారం తొలి మ్యాచ్, జనవరి 17న రాజ్కోట్లో రెండో మ్యాచ్, జనవరి 19న బెంగళూరులో ఆఖరి మ్యాచ్ జరగనున్నాయి.