Wednesday, May 1, 2024

పేషెంట్ జీరోను కనుక్కోలేం

- Advertisement -
- Advertisement -

World may never find coronavirus 'patient zero':WHO

 

ప్రపంచ ఆరోగ్య సంస్థ అశక్తత
కరోనా వైరస్ మూలాల శోధన
చైనాలోని వూహాన్‌లో సంస్థ బృందం

వూహాన్ : ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఒ)కు చెందిన ఓ ఉన్నతస్థాయి నిపుణుల బృందం శనివారం చైనాలోని వూహాన్‌కు చేరుకుంది. వూహాన్‌లో కరోనా వైరస్ తొలుత తలెత్తింది. తరువాతి క్రమంలో ప్రపంచవ్యాప్తంగా విస్తరించి, ఏడాది పాటు తన ఉధృతిని చాటింది. వైరస్ మూలాలను అన్వేషించేందుకు ఈ నిపుణుల బృందం ఇక్కడికి వచ్చింది. అయితే ప్రపంచంలో కరోనా వైరస్ సోకిన తొలి వ్యక్తిని అంటే పెషెంట్ జీరోను కనుక్కోవడం ఇప్పుడు అసాధ్యమే అవుతుందని ఈ నిపుణుల బృందం పేర్కొంది. ఈ పేషెంట్ జీరోను ప్రపంచం ఎప్పటికీ కనుక్కోకపోవచ్చునని, ఈ వ్యక్తి ఓ మిస్టరీగానే మారుతారని పేర్కొంది. డబ్లుహెచ్‌ఒకు చెందిన వ్యాధుల విభాగంలోని సాంకేతిక విషయాల అధిపతి మారయో వ్యాన్ కోర్కోవ్ పేషేంట్ జీరో గురించి తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. చైనా నుంచి పలు సార్లు అభ్యంతరాలు మధ్య ఎట్టకేలకు కరోనా వైరస్ మూలాల శోధనకు నిపుణుల బృందం చైనాకు చేరుకుంది.

ప్రస్తుతం ఈ బృందం క్వారంటైన్‌లో

ఇక్కడికి చేరిన ఈ నిపుణుల బృందం ప్రస్తుతానికి క్వారంటైన్‌లో ఉంది. త్వరలోనే ఇక్కడి ఉన్నతాధికారులు, తమకు ఆతిధ్యం ఇచ్చే వారితో వైరస్ మూలాలను కనుగొనే విషయంపై చర్చిస్తుంది. ఇక్కడికి బయలుదేరిన బృందంలో ఓ ఇద్దరికి కరోనా పాజిటివ్ నిర్థారణ కావడంతో వారిని చైనాలోకి అనుమతించలేదు. గత ఏడాది డిసెంబర్‌లో వూహాన్‌లో వైరస్ ఉనికిలోకి వచ్చింది. అయితే ఈ వైరస్ వూహాన్‌లోని ప్రధాన వైరాలజీ ఇనిస్టూట్‌లో నుంచి బయటకు వెలువడిందా? లేక సమీపంలోని హూయనాన్ సీఫుడ్ మార్కెట్ ద్వారా సంక్రమించిందా? అనేది అంతుబట్టని చిక్కుముడి అయింది.

వైరాలజిస్టుకు చైనా సన్మానం

ఓ వైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం వూహాన్‌కు వచ్చినప్పుడే చైనా తమ దేశానికి చెందిన వైరాలజిస్టును సన్మానించింది. ఈ వైరాలజిస్టు బయోలాబ్‌లో పరిశోధకులుగా ఉన్నారు. ఈ ల్యాబ్ కొవిడ్ 19 ఉత్పత్తి కేంద్రం అయిందనే వివాదాలు ఉన్నాయి. ఇక్కడ పనిచేసే నిపుణుడికే చైనా అధికారికంగా సన్మానం చేయడం మరింత వివాదాస్పదం అయింది.

ఇప్పుడొచ్చి ఏం సాధిస్తారు?

అత్యంత కీలకమైన వైద్య సవాలును రేకెత్తించిన అంశంపై ఇంతకాలం తరువాత చైనాలోని వూహాన్‌కు ఈ పది మంది సభ్యుల బృందం రావడం గురించి ప్రపంచ వ్యాప్తంగా అసంతృప్తి వ్యక్తం అయింది. ఇంతకాలానికి వచ్చి వీరు ఏం సాధిస్తారని అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు వ్యక్తం అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు కొత్తరకం కరోనా వైరస్‌లు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని దేశాలూ కొత్త స్ట్రెయిన్‌ల గురించి అప్రమత్తంగా ఉండాలని సంస్థ హెచ్చరించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News