తిరుపతి రుయా ఆసుపత్రిలో ఘోరం
ఆక్సిజన్ సరఫరాలో లోపంతో విషాదం, ఐసియులో 140మంది కరోనా రోగులు, మరో 13 మంది పరిస్థితి విషమం
ఆసుపత్రిలో రోగుల బంధువుల ఆర్తనాదాలు, సిబ్బందితో గొడవ
20 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన ట్యాంకర్
ఘటనపై ముఖ్యమంత్రి జగన్ ఆరా
మనతెలంగాణ/హైదరాబాద్/తిరుమల: ఎపిలోని తిరుపతి రుయా ఆస్పత్రిలోని కొవిడ్ ఆత్యవసర విభాగంలో ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం కలగడంతో ఆక్సిజన్ అందక 11 మంది కరోనా రోగులు మృతి చెందినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా మరో 13 మంది పరిస్థితి విషమంగా ఉందని వివరించారు. ఈ క్రమంలో రుయా ఆస్పత్రిలోని ఎం.ఎం.1,2,3 వార్డులో ఆరుగురు, ఐసియు ముగ్గురు, ఎం.ఎం.4,5,6లో ఒకరు మృతి చెందినట్లు సమాచారం.
కాగా సోమవారం రాత్రి 7.30 గంటల సమయంలో దాదాపు 20 నిమిషాల పాటు ఆక్సిజన్ నిలిచిపోయింది. దీంతో ఆక్సిజన్ ఫిల్లింగ్ చేసేపుడు కంప్రజర్ తగ్గటంతో సరఫరాకు దాదాపు 25 నిమిషాల పాటు అంతరాయం ఏర్పడింది. ఆక్సిజన్ సరఫరా ప్రారంభించినా పరిస్థితి కుదుటపడలేదని రోగుల బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్టారు. ఐసియూలోని వస్తువులను పగులగొట్టారు. ఈ ఉద్రిక్తతతో ఉయా ఆస్పత్రిలోని నర్సులు బయటకు పరుగులు తీశారు. కాగా రోగుల బంధువుల దాడితో ఆసుపత్రి ఎండి అక్కడి నుంచి పరారయ్యారు. అలాగే ఆసుపత్రి సిబ్బంది సైతం అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఘటనపై సిఎం ఆరా..!
ఎపిలోని చిత్తూరు జిల్లా తిరుపతిలో ఉన్న రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ సరఫరాలో అంతరాయంతో 11మంది మృతి చెందిన ఘటనపై ఎపి సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరా తీశారు. వెంటనే నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. రోగుల కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు.
ఆక్సిజన్ ట్యాంకర్ ఆలస్యం వల్లే
తమిళనాడు నుంచి రావాల్సిన ఆక్సిజన్ ట్యాంకర్ ఆలస్యం కావడంతో సమస్య ఏర్పడిందని అధికారులు సిఎం జగన్కు తెలిపారు. ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత ఏర్పడిందనే వార్తతో తిరుపతిలో ఒక్కసారిగా పరిస్థితి ఆందోళనకరంగా ఏర్పడింది. సమాచారం అందుకున్న వెంటనే రుయా ఆస్పత్రి అధికారులు, కలెక్టర్, వైద్య శాఖ అధికారులు ఆస్పత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఆక్సిజన్ కొరతతో చికిత్స పొందుతున్న బాధితుల్లో కొందరు అస్వస్థతకు గురయ్యారు. వారికి వెంటనే వైద్య సేవలు పునరుద్ధరించారు.
10 Corona Patients died in Ruia Hospital