Monday, April 29, 2024

పార్లమెంట్ భద్రతకు 140 మంది సిఐఎస్‌ఎఫ్ సిబ్బంది

- Advertisement -
- Advertisement -

సందర్శకుల తనిఖీకి కొత్త ఏర్పాటు
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నుంచి సిఐఎస్‌ఎఫ్ సేవలు
31 నుంచి బడ్జెట్ సెషన్

న్యూఢిల్లీ : నూట నలభై మంది సిఐఎస్‌ఎఫ్ సిబ్బందితో ఒక బృందాన్ని పార్లమెంట్ సముదాయం వద్ద నియమించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సమయంలో సందర్శకులను, వారి బ్యాగేజీని తనిఖీ చేయడానికి చేస్తున్న కొత్త ఏర్పాటు ఇది అని అధికార వర్గాలు వెల్లడించాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31న మొదలు కానున్నాయి. పార్లమెంట్ కొత్త భవన సముదాయం వద్ద కొద్ది మంది వ్యక్తులు భద్రతను ఉల్లంఘించిన నేపథ్యంలో భద్రత ఏర్పాట్లను సమగ్రంగా సమీక్షించిన అనంతరం కేంద్ర హోమ మంత్రిత్వశాఖ ఆ సిబ్బందిని మంజూరు చేసింది.

నిరుడు డిసెంబర్ 13న ఎంపిలతో నిండిపోయిన పార్లమెంట్ హాల్‌లోకి కొంత మంది వ్యక్తులు ప్రవేశించి, రంగు డబ్బాల నుంచి ఒక వాయువును వెదజల్లిన విషయం విదితమే. కేంద్ర పారిశ్రామిక భద్రత దళం (సిఐఎస్‌ఎఫ్) సిబ్బంది 140 మంది సోమవారం పార్లమెంట్ సముదాయం వద్ద భద్రత బాధ్యత స్వీకరించారు. వారు సందర్శకులను, వారి వస్తువులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తారని, భవనానికి అగ్నిమాపక రక్షణ కూడా కల్పిస్తారని అధికార వర్గాలు తెలియజేశాయి. సిఐఎస్‌ఎఫ్ అసిస్టెంట కమాండెంట్ (ఎసి) హోధా అధికారి సిఐఎస్‌ఎఫ్ యూనిట్‌కు సారథ్యం వహిస్తారని, ఆ యూనిట్‌లో అగ్నిమాపక విభాగం నుంచి 36 మంది సిబ్బంది ఉంటారని ఆ వర్గాలు తెలిపాయి.

ఆ బృందం ఇప్పటికే పార్లమెంట్ సముదాయం వద్ద ఉన్న ఇతర భద్రత సంస్థల సిబ్బందితో కలసి తమ విధుల నిర్వహణ గురించి తెలుసుకుంటున్నారని, దాని వల్ల 31న బడ్జెట్ సమావేశాలు మొదలైనప్పుడు వారు తమ విధుల నిర్వహణకు మరింత సిద్ధంగా ఉంటారని ఆ వర్గాలు వివరించాయి. విమానాశ్రయం భద్రత తరహాలో పార్లమెంట్ కొత్త భవన వద్ద సిఐఎస్‌ఎఫ్ తమ బాధ్యతలు చేపడతాయి. విమానాశ్రయంలో ప్రయాణికులను, వారి వస్తువులను ఎక్స్‌రే యంత్రాల ద్వారా, చేతితో పట్టుకునే డిటెక్టర్లద్వారా క్షుణ్ణంగా తనిఖీ చేస్తుంటారని, అంతే కాకుంగా పాదరక్షలు, హెవీ జాకెట్లు, బెల్ట్‌లను ఒక ట్రేలో ఉంచి ఎక్స్‌రే స్కానర్ ద్వారా తనిఖీ చేస్తుంటారని ఆ వర్గాలు వివరించాయి.

పార్లమెంట్ భద్రత కోసం ఆ 140 మంది సిబ్బందిని శాశ్వత ప్రాతిపదికపై మంజూరు చేయాలని కూడా సిఐఎస్‌ఎఫ్ హోమ్ మంత్రిత్వశాఖకు లేఖ రాసింది. ‘పార్లమెంట్ వద్ద మోహరించిన ప్రస్తుత యూనిట్‌ను సిఐఎప్‌ఎఫ్‌లోని ప్రభుత్వ భవన భద్రత (జిబిఎస్) కింద క్రమబద్ధం చేయనున్నారు. వివిధ ప్రభుత్వ మంత్రిత్వశాఖలు, సిబిఐ, ఇడి వంటి దర్యాప్తు సంస్థల ప్రధాన కార్యాలయాల వద్ద భద్రత బాధ్యతను సిఐఎస్‌ఎఫ్ నిర్వరిస్తుంటుంది’ అని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

పార్లమెంట్ లోపల ఫోటోలు తీయరాదని ఆదేశం
ఇది ఇలా ఉండగా, పార్లమెంట్ భవనం సముదాయం లోపల ఫోటోలు, వీడియోలు తీయరాదని పార్లమెంట్ సిబ్బందిని ఆదేశించడమైంది. భద్రత ప్రోటోకాల్ కింద అటువంటి కార్యకలాపాలు నిషిద్ధం. ‘భారత్‌లో అత్యంత బెదరింపులకు గురయ్యే ప్రదేశం పార్లమెంట్ సముదాయం. వ్యూహాత్మ క భద్రత ఏర్పాట్లలో భాగంగా పార్లమెంట్ భవనం సముదాయంలో ఫోటోలు తీయడం/ వీడియో షూటింగ్‌పై నిషేధం వ్యూహంలో భాగం’ అని ఈ నెల 19న జారీ అయిన ఉత్తర్వు తెలియజేసింది.

కెమెరాలు, స్పై కెమెరాలు, స్మార్ట్‌ఫోన్‌లు సముదాయం రక్షణ, భద్రతకు ప్రత్యక్షంగా ముప్పు అని పేర్కొంటూ లోక్‌సభ, రాజ్యసభ సెక్రటేరియట్‌లు, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖ, పార్లమెంట్ భవనం ఎస్టేట్‌లో పని చేసే ఇతర అనుబంధ సంస్థల అధికారులకు, సిబ్బందికి పార్లమెంట్ భవనం సముదాయంలో ఏ విధమైన ఫోటోగ్రఫీనీ కచ్చితంగా నిషేధించినట్లు ఆదేశాలు జారీ అయ్యాయి. ‘మొబైల్ ఫోన్లు/ స్మార్ట్ ఫోన్లు అనుమతి ఉన్న అధికారులు/ సందర్శకులు పార్లమెంట్ భవన సముదాయంలో ఏవిధమైన ఫోటోలూ తీయరాదని కచ్చితంగా నిషేధించడమైంది’ అని ఆ ఉత్తర్వు స్పఫ్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News