న్యూఢిల్లీ : శ్రీలంక లోని 2400 మంది భారతీయులు గత రెండు నెలలుగా భారత్కు తరలించే విమానం కోసం నిరీక్షిస్తున్నారు. కొలంబో లోని హైకమిషన్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు రెట్టింపు కావడం, ఇంటికి వెళ్లాలని మానసిక వేదన, ఎప్పుడు తమ కుటుంబాలతో స్వదేశానికి చేరుకుంటామో తెలియని అనిశ్చితి వీరిని పట్టి పీడిస్తోంది. వివిధ దేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకు రాడానికి భారత ప్రభుత్వం ఈ నెల 7న వందేభారత్ మిషన్ను ప్రారంభించింది. అయితే ఆ దేశాల జాబితాలో శ్రీలంకను ప్రభుత్వం ఇంతవరకు ప్రకటించ లేదు. వందే భారత్ మిషన్ మొదటి దశలో గల్ఫ్ రీజియన్తోపాటు అమెరికా, బ్రిటన్, ఫిలిప్పైన్స్, బంగ్లాదేశ్, మలేసియా,మాల్దీవుల నుంచి 6527 మంది భారతీయులను విమానాల ద్వారా తీసుకువచ్చింది.
రెండో దశలో కెనడా, ఒమన్, కజకిస్థాన్, ఉక్రెయిన్, ఫ్రాన్సు, తజికిస్థాన్, సింగపూర్, అమెరికా, సౌదీ అరేబియా, ఇండోనేసియా, కతార్, రష్యా, కిర్గిజిస్థాన్, జపాన్, కువాయిట్, ఇటలీ దేశాల నుంచి భారతీయులను తీసుకు రావలసి ఉంది. నేపాల్, నైజీరియా, బెలారస్, అర్మేనియా, థాయ్లాండ్, ఐర్లాండ్, జర్మనీ, జార్జియా, బ్రిటన్ దేశాల నుంచి కూడా భారతీయులను తీసుకు వస్తామని భారత ప్రభుత్వం ప్రకటించినా శ్రీలంక ప్రస్తావన లేకపోవడం గమనార్హం. ఈ సందర్భంగా చెన్నై నివాసి రామక్రిష్ణన్ శ్రీనివాసన్ తమ సమస్య గురించి వివరిస్తూ శ్రీలంక లోని భారత్ హైకమిషన్తో సంప్రదించామని, వారు తమను స్వదేశానికి పంపడానికి ప్రయత్నిస్తున్నారని, కానీ భారత్ నుంచి తగిన సమాధానం రావడం లేదని చెప్పారు.