న్యూఢిల్లీ: దేశానికి సంబంధించిన విషయాలపై స్పందించేందుకు ఎప్పుడూ ముందుంటాడు టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్. పలుసార్లు దేశం పట్ల తనకున్న ప్రేమను చాటుకున్నాడు గంభీర్. ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని గజగజ వణికిస్తున్న కరోనాపై దేశంలోని అన్ని రాష్ట్రాలు యుద్ధం చేస్తున్నాయి. కరోనా వ్యాప్తిని నివారించేందుకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు సినీ, క్రీడా, వ్యాపార ప్రముఖులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తమ వంతుగా సహాయాన్ని అందిస్తూ అండగా నిలుస్తున్నారు. తాజాగా గంభీర్ కూడా కరోనాపై పోరాటానికి తన వంతుగా భారీ విరాళం ప్రకటించాడు. తన రెండు సంవత్సరాల జీతాన్ని ప్రధాన మంత్రి సహాయ నిధికి విరాళంగా ఇవ్వనున్నట్లు ట్వీట్టర్ ద్వారా తెలిపాడు. కాగా, ఇప్పటికే పలువురు క్రికెటర్లతోపాటు బిసిసిఐ కూడా భారీ విరాళాన్ని ప్రకటించింది.
Gambhir donates 2 Years Salary For Fight Against Covid19