అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ ఎంఎల్ఎ అచ్చెన్నాయుడిని ఎసిబి అధికారులు శుక్రవారం ఉదయం అరెస్టు చేశారు. అచ్చెన్నాయుడు హయంలోనే ఇఎస్ఐ కుంభకోణం జరిగినట్టు అధికారులు గుర్తించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో భారీ బందోబస్తుతో పోలీసులు అచ్చెన్నాయుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆయనను విశాఖలోని కోర్టుకు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇఎస్ఐ ఆసుపత్రిలో మందులు, ఇతర పరికరాల కొనుగోళ్లలో అవినీతి జరిగినట్టు మాజీ మంత్రిపై అభియోగాలు ఉన్నాయి. ఇప్పటికే విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో దర్యాప్తు కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు.
నకిలీ కొటేషన్లతో ఆర్డర్లు ఇచ్చినట్లు అచ్చెన్నాయుడిపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఈ కుంభకోణంలో మరో మాజీ మంత్రిని కూడా ఎసిబి అధికారులు అరెస్టు చేసే అవకాశముంది. ఎపి ఇఎస్ఐలో రూ. 150కోట్ల స్కామ్ జరిగినట్టు ఎసిబి గుర్తించింది. రూ. 988 కోట్ల ఇఎస్ఐ పరికరాల కొనుగోళ్లలో రూ.151 కోట్ల అవినీతి జరిగినట్టు అధికారులు తెలిపారు. ఎలాంటి టెండర్లు లేకుండా శస్త్రచికిత్స పరికరాలు కొన్నట్లు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే ఎనిమిది మంది అధికారుల వాంగ్మూలాన్ని విజిలెన్స్ అధికారులు రికార్డు చేశారు. మొత్తం ఈ స్కామ్ లో 40మంది అధికారులు ఉన్నట్టు సమాచారం. ఇఎస్ఐ డైరెక్టర్ రమేష్ కుమార్ ను ఎసిబి తిరుపతిలో అరెస్టు చేసింది.