12,13,20,27 తేదీల్లో శాసనసభకు సెలవులు
నేడు క్వశ్చన్ అవర్, జీరో అవర్ ఉండదు
ప్రశ్నోత్తరాల సమయంలో ఆరు ప్రశ్నలకే అనుమతి
నేడు పివి శతజయంతిపై చర్చ, భారతరత్నకు తీర్మానం
బిఎసి సమావేశంలో నిర్ణయాలు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 28వ తేదీ వరకు కొనసాగనున్నాయి. సోమవారం శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అధ్యక్షతన జరిగిన బిజినెస్ అడ్వజరీ కమిటీ(బిఎసి) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో సభ నిర్వహణ, అజెండా తయారీపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, విపక్ష సభ్యులు అక్బరుద్దీన్ ఒవైసి, భట్టి విక్రమార్క, శాసనసభ కార్యదర్శి నర్సింహ్మాచార్యులు హాజరయ్యారు. మొత్తం 17 రోజుల పాటు శాసనసభ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ నెల 12,13,20,27వ తేదీల్లో అసెంబ్లీకి సెలవులు ప్రకటించారు. ఈ నెల 10, 11 తేదీల్లో అసెంబ్లీలో కీలకమైన రెవెన్యూ చట్టంపై చర్చచేపట్టనున్నారు.
అలాగే, భారత మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావుకు భారతరత్న అవార్డు ఇవ్వాలని అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టనుంది. సమావేశాలు సజావుగా సాగేందుకు అందరూ సహకరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు విపక్ష సభ్యులను కోరారు. మీడియా పాయింట్ ఎత్తివేయడంపై భట్టి విక్రమార్క అభ్యంతరం వ్యక్తం చేయగా, కోవిడ్ నేపథ్యంలోనే మీడియా పాయింట్ అనుమతించలేదని సిఎం కెసిఆర్ వివరించారు.
TS Assembly session 2020 to continue till Sept 28