మల్టీ క్యాప్ ఫండ్ల నిబంధనల్లో సెబీ మార్పులు
25% చొప్పున మిడ్, స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయాలి
75 శాతానికి ఫండ్ల ఇన్వెస్ట్మెంట్ పరిమితి
న్యూఢిల్లీ : మిడ్, స్మాల్ క్యాప్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టేవారికి శుభవార్త. మార్కెట్ రెగ్యులేటరీ సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) మల్టీక్యాప్ ఫండ్ల నియమాల్లో మార్పులు చేసింది. ఇప్పుడు 75 శాతం నిధులను షేర్లలో పెట్టుబడి పెట్టాలి. మల్టీ-క్యాప్ ఫండ్లకు సెబీ నిబంధనల ప్రకారం, మల్టీక్యాప్ ఫండ్స్ వారి మొత్తం ఆస్తులలో కనీసం 75 శాతం షేర్లలో పెట్టుబడి పెట్టాలి. దీని ప్రకారం, వారు 25 శాతం చొప్పున నిధులను మల్టీ, లార్జ్, స్మాల్ క్యాప్లలో పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. ఇంతకుముందు ఫండ్లో 65 శాతం షేర్లలో పెట్టుబడులు పెట్టడానికి అనుమతించారు. అయితే ఎంత భాగం లార్జ్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయాలనేది ఫండ్ హౌస్లకు సెబీ సూచించలే దు. కొత్త నిబంధనలు జనవరి 2021 నుండి వర్తిస్తాయి.
25 శాతం కేటాయింపు..
మల్టీక్యాప్ ఫండ్స్ విషయానికొస్తే లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ కంపెనీల షేర్లలో, వాటికి సంబంధించిన సెక్యూరిటీలలో కనీసం 25 శాతం చొప్పున పెట్టుబడి పెట్టవలసి ఉంటుందని సెబీ శుక్రవారం విడుదల చేసిన సర్క్యులర్లో పేర్కొంది. లార్జ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీల షేర్ల నుండి రూ.40,000 కోట్లను మిడ్క్యాప్, స్మాల్క్యాప్ కంపెనీలకు మళ్లించనున్నట్లు నిపుణులు అంటున్నారు. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (ఎఎమ్ఎఫ్ఐ) తదుపరి షేర్ల జాబితాను ప్రచురించిన తేదీ నుండి ఒక నెలలోపు అన్ని మల్టీక్యాప్ ఫండ్లు ఈ నిబంధనలను పాటించాల్సి ఉంటుందని సెబీ తెలిపింది. అంటే జనవరి 2021 నాటికి నిబంధనలను అమలు చేయాల్సి ఉంటుంది.
ప్రస్తుతం స్టాక్స్లో 65% ఫండ్..
మల్టీక్యాప్ ఫండ్ల పెట్టుబడులను లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ కంపెనీలకు సమానంగా ఉండాలనే లక్ష్యంతో మల్టీక్యాప్ ఫండ్ పథకంలో కొన్ని సవరణలు చేసినట్లు సెబీ తెలిపింది. ప్రస్తుతం మల్టీక్యాప్ ఫండ్స్ వారి మొత్తం ఆస్తులలో 65 శాతం వాటాలు, సంబంధిత సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టాలి. అయితే ఈ నిధులు లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్లో పెట్టుబడులు పెట్టడానికి ఎటువంటి పరిమితిని విధించలేదు. ఈ కారణంగా ఈ మల్టీక్యాప్ ఫండ్లు లార్జ్క్యాప్లో అధిక కేటాయింపులు చేస్తున్నాయి. పెద్ద స్టాక్స్లో పెట్టుబడి చేయగా మిగిలిన నిధులను మీడియం, స్మాల్ మార్కెట్ క్యాప్ స్టాక్స్లో పెట్టుబడి చేస్తున్నట్టు నిపుణులు పేర్కొంటున్నారు.
స్మాల్ క్యాప్లో పెట్టుబడులు పెరుగుతాయి : నిపుణులు..
సెబీ నుంచి వచ్చిన అతి పెద్ద నిర్ణయం ఇది, దీంతో స్మాల్ క్యాప్ కంపెనీలలో పెట్టుబడులు పెరుగుతాయని పాంటోమత్ ఎఎమ్సి కోఫౌండర్ వరీందర్ బన్సాల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. నిబంధనల మేరకు ఇప్పుడు పెద్ద మ్యూచువల్ ఫండ్ హౌస్లు స్మాల్ క్యాప్ స్టాక్లలో పెట్టాల్సి ఉంటుంది. గత రెండేళ్ళలో లార్జ్ క్యాప్లలో గరిష్ట పెట్టుబడి ఉంది. ఇప్పుడు ఎంఎఫ్ హౌస్లు స్మాల్ అండ్ మిడ్ క్యాప్లో పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎయుఎం రూ.1 లక్ష 40 వేల కోట్లు. ఇప్పుడు సెబీ నిర్ణయం తర్వాత 25% శాతం అంటే 20 నుండి 25 వేల కోట్ల రూపాయలు మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లోకి వస్తాయి. ప్రస్తుతం 5 శాతం మాత్రమే స్మాల్ క్యాప్లో పెట్టుబడి ఉంది. సెబీ చర్యతో రూ.30,000 నుండి రూ.40,000 కోట్లు లార్జ్ మార్కెట్ మూలధనం ఉన్న కంపెనీల స్టాక్ల నుండి మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కంపెనీలకు వెళ్తాయని పరిశ్రమ నిపుణులు అంటున్నారు. మల్టీక్యాప్ ఫండ్ల పెట్టుబడులను లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ కంపెనీలు అన్నింటికి విస్తరించే లక్ష్యంతో కొన్ని సవరణలు చేసినట్లు సెబీ తెలిపింది.