దుబాయి: ఉత్తర ప్రదేశ్లోని హాథ్రస్ జిల్లాలో దళిత యువతిపై జరిగిన దారుణ అత్యాచార ఘటనపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి స్పందించాడు. దీన్ని అమానవీయ, క్రూరత్వానికి మించిన ఘటనగా అభివర్ణించాడు. సమాజంలో ఇటువంటి దుశ్చర్యాలకు తావులేకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నాడు. ఈ ఘటన తనను ఎంతో కలచి వేసిందన్నాడు. ఈ క్రూరత్వానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తేనే బాధితురాలి ఆత్మకు శాంతి చేకూరుతుందన్నాడు. ఇలాంటి అమానవీయ ఘటనలను సమాజం సహించకూడదన్నాడు. దీనికి బాధ్యులైన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందనే నమ్మకాన్ని కోహ్లి వ్యక్తం చేశాడు. ప్రతి రోజు దేశంలోని ఏదో ఒక ప్రదేశంలో మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయని, వీటిని కఠినంగా అణచి వేసేందుకు పాలకులు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైన ఉందన్నాడు. ఇక మహిళలపై జరుగుతున్న వరుస ఘటనలు తనను ఎంతో బాధకు గురి చేస్తున్నాయని కోహ్లి పేర్కొన్నాడు. మరోవైపు రోహిత్ శర్మ, గౌతం గంభీర్, సెహ్వాగ్, కుంబ్లే, రైనా తదితరులు కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Virat Kohli Condemns on UP Gang Rape