ముంబై: ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్లో సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మలు బరిలోకి దిగడం అనుమానంగా మారింది. ప్రస్తుతం వీరిద్దరూ బెంగళూరులో జాతీయ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్నారు. అయితే వీరికి తాజాగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో పూర్తి ఫిట్నెస్ సాధించలేదు. ఐపిఎల్ మధ్యలో రోహిత్ అనారోగ్యం బారిన పడ్డాడు. పలు మ్యాచ్లకు కూడా దూరమయ్యాడు. నాకౌట్కు ముందు మాత్రమే మళ్లీ ముంబై తరుఫున బరిలోకి దిగాడు. ఇదిలావుండగా ఆస్ట్రేలియా సిరీస్కు ఎంపిక చేసిన జట్టులో రోహిత్కు చోటు దక్కలేదు. అయితే కెప్టెన్ విరాట్ కోహ్లి టెస్టు సిరీస్కు దూరకానుండడంతో రోహిత్ను జట్టుకు ఎంపిక చేశారు.
ఇందు కోసం అతన్ని బెంగళూరు జాతీయ క్రికెట్ అకాడమీలో శిక్షణ కోసం పంపించారు. కానీ రోహిత్ ప్రస్తుతం పూర్తి ఫిట్నెస్ను సంతరించుకోలేదు. అతను కోలుకోవడానికి మరి కొన్ని వారాల సమయం పడుతోందని బిసిసిఐ వర్గాలు వెల్లడించాయి. దీంతో రోహిత్ టెస్టు సిరీస్కు అందుబాటులో ఉండే అవకాశాలు దాదాపు లేవనే చెప్పాలి. ఇలాంటి పరిస్థితినే సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మది. ఇషాంత్ కూడా ఇప్పటి వరకు పూర్తి ఫిట్నెస్ అందుకోలేక పోయాడు. దీంతో అతను కూడా టెస్టు సిరీస్లో ఆడడం క్లిష్టంగా మారింది. మరోవైపు బిసిసిఐ మాత్రం దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.