రాజీకి వచ్చిన ఇజ్రాయెల్ హమాస్…
కాల్పుల విరమణ అమలుతో సంబరాలు
స్వాగతించిన అమెరికా నేత బైడెన్
జెరూసలెం: ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకారం కుదిరింది. దీనితో ఇరు పక్షాల మధ్య 11 రోజుల భారీ స్థాయి ఘర్షణ, బాంబుల దాడికి ముగింపు దశ ఏర్పడనుంది. 2014 గాజా వార్ తరువాత ఇరుపక్షాల మధ్య అత్యంత భీకర పోరు ఇటీవల జరిగింది. ఇప్పటికే పరస్పర దాడులలో 240 మందికి పైగా దుర్మరణం చెందారు, ఎప్పుడూ ఉద్రిక్తతతో ఉండే ఈ ప్రాంతం ఈ ఘటనలతో మరింత కల్లోలం అయింది. అయితే ఇప్పుడు తిరిగి సాధారణ పరిస్థితి నెలకొనేందుకు వీలుగా ఇజ్రాయెల్ భద్రతా వ్యవహారాల కేబినెట్ ముందుగా కాల్పుల విరమణకు ఆమోదం తెలిపింది. అమెరికా, ఈజిప్టు ఇతర అంతర్జాతీయ సంస్థలు దేశాల నుంచి ఈ ప్రాంతపు పరిస్థితిపై తలెత్తిన ఆందోళన, శాంతియుత పరిస్థితుల గురించి తీసుకువచ్చిన ఒత్తిడితో ఇప్పుడు ఘర్షణ సమసిపోయేందుకు వీలేర్పడింది. కాల్పుల విరమణకు సంబంధించి ఇరుపక్షాల మధ్య అంగీకారం కుదిరిందని ప్రధాని బెంజమిన్ నెతానాహ్యూ కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది.
ఇరుపక్షాలూ పద్థతి ప్రకారం శాంతిని నెలకొల్పేందుకు పాటుపడాల్సిందేనని, హమాస్ సరిగ్గా స్పందించకపోతే సరైన విధంగా ఏర్పాట్లు చేసుకోవల్సి ఉంటుందని ఇజ్రాయెల్ రక్షణ వర్గాలను నెతానాహ్యు ఆదేశించారు. అయితే శుక్రవారం నుంచే కాల్పుల విరమణ అమలులోకి వచ్చిందని వెల్లడైంది. హమాస్తో సంధి కుదిరిన వెంటనే పాలస్తీనియన్లు గాజా వీధులలోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. ఈసారి జరిగిన హింసాత్మక యుద్ధంలో గెలుపు తమదంటే తమదే అని ఇజ్రాయెల్, హమాస్లు పేర్కొన్నాయి. కాల్పుల విరమణ పట్ల అమెరికా అధ్యక్షులు జో బైడెన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో శాంతియుత పరిస్థితితో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొని ప్రజల పురోగతికి వీలేర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.