న్కూయార్క్ : తాను భారత్లో తయారు అయిన కొవిషీల్డ్ టీకా రెండు డోసులు తీసుకున్నానని ఐరాస ప్రముఖ నేత అబ్దుల్లా షహీద్ తెలిపారు. ఇటీవల జరిగిన ఐరాస సర్వప్రతినిధి సభ 76వ సెషన్కు అబ్దుల్లానే సభాధ్యక్షులుగా వ్యవహరించి ప్రాముఖ్యత దక్కించుకున్నారు. ప్రపంచంలో అత్యధిక ప్రాంతాల వారు తీసుకున్నట్లే తాను కూడా ఈ కొవిషీల్డ్ను పూర్తి రెండు డోసులు తీసుకున్నానని వివరించారు. బ్రిటిష్ స్వీడిష్ ఔషధ కంపెనీ అస్ట్రా జెనెకా కొవిషీల్డ్ ఫార్మూలాను రూపొందించింది.
అయితే దీనిని భారతదేశంలోని పుణే కేంద్రపు సీరం ఇనిస్టూట్ ఆఫ్ ఇండియా అత్యధిక పరిణామాలలో తక్కువ సమయంలో ఉత్పత్తి చేసి పంపిణీ చేసింది. కొవిడ్ నియంత్రణ టీకాల గురించి తనకు ఎదురైన ప్రశ్న పూర్తిగా టెక్నికల్ అంశం అయి కూర్చుందని అబ్దుల్లా విలేకరుల సమావేశంలో చమత్కరించారు. ప్రపంచంలో ఎన్నిదేశాలు కొవిషీల్డ్ను పొందాయి. ఏ మేరకు ఇది ఆమోదయోగ్యం అయిందనే వివరాలు తనకు తెలియవని, అయితే అత్యధిక ప్రాంతపు జనులు ఈ వ్యాక్సిన్ను పొందారని తాను చెప్పగలనని, తానూ ఈ బాటలోనే వెళ్లానని తెలిపారు. ఈ టీకా తీసుకున్న తానైతే బాగానే ఉన్నానని, దీని పనితీరు ఏమిటనేది చెప్పాల్సింది తాను కాదు వైద్య వృత్తిలో నిష్ణాతులైన వారు చెప్పాల్సిన జవాబు అని నవ్వుతూ చెప్పారు.