మన తెలంగాణ/హైదరాబాద్: దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ధర్నా, ప్రదర్శనలకు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు హైదరాబాద్లోని ఆర్టీసి క్రాస్ రోడ్ వద్ద నిరసన ప్రదర్శన మంగళవారం జరిగింది. అజయ్ మిశ్రాను వెంటనే కేంద్ర మంత్రి పదవి నుండి తొలగించాలని, లఖింపూర్ ఘటనపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో విచారణ చేయాలని, రైతు ఉద్యమం డిమాండ్లను వెంటనే మోడీ ప్రభుత్వం ఆమోదించిన 3 చట్టాలను రద్దు చేసి, కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టం తేవాలని, అప్పటివరకు ఉద్యమం మరింత ఉధృతం అవుతుందని ఈ సందర్భంగా ఏఐకెఎస్సిసి రాష్ట్ర కన్వీనర్ పశ్యపద్మ, టి సాగర్, జె.వి.చలపతిరావు పాలకులకు హెచ్చరించారు. రైతులను హత్య చేయించిన ఆశిష్ మిశ్రాకు డెంగ్యూ వచ్చిందని హాస్పిటల్లో చేర్పించి కాపాడుతున్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర పాలకులు హత్యకు గురైన రైతు కుటుంబాలను ఇప్పటికీ పరామర్శించనే లేదన్నారు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమంలో తెలంగాణ ప్రభుత్వం కూడా కలిసి రావాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏఐకె జాతీయ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి, ప్రజా సంఘాల నాయకులు, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం నుండి రాజారామ్, కొండారెడ్డి, అరుణ హరీష్, తెలంగాణ రైతు సంఘం మూడ్ శోభన, వ్యవసాయ కార్మిక సంగం వెంకట్ రాములు, బోప్పని పద్మ, సిఐటియూ జే వెంకటేశ్వర్లు, యువజన విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.