హైదరాబాద్: వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాది పార్టీతో అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎఐఎంఐఎం పొత్తు పెట్టుకోబోతున్నట్లు వస్తున్న వార్తలను మజ్లిస్ పార్టీ తోసిపుచ్చింది. యూపీలో ఎస్పీ అధికారంలోకి వస్తే ముస్లిం నేతను డిప్యూటీ సిఎం చేస్తామని హామీ ఇస్తే ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటామని తాము అన్నట్లు వస్తున్న వార్తలు అవాస్తమని, తామెప్పుడు అలా చెప్పలేదని యూపి ఏఐఎంఐఎం ఉత్తరప్రదేశ్ ప్రెసిడెంట్ షౌకత్ అలీ తెలిపారు. తాను కానీ, తమ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కానీ ఇలా ఎప్పుడూ అనలేదన్నారు. సమాజ్వాది పార్టీ గతంలో 20 శాతం ముస్లిం ఓట్లతో గెలిచి అధికారంలోకి వచ్చినప్పటికీ ఏ ముస్లిం నేతను డిప్యూటీ సిఎం చేయలేదనే తాము అన్నట్లు షౌకత్ అలీ తెలిపారు.
అయితే ఎవరైనా ముస్లిం ఎంఎల్ఎను ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సిఎం చేయడానికి అఖిలేష్ యాదవ్ ఒప్పుకుంటే ఎస్పీతో పొత్తుకి సిద్ధమేనని శనివారం అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చిన సంగతి విదితమే. రాబోయే యూపి అసెంబ్లీలో సత్తా చాటాలని భావిస్తోన్న అసదుద్దీన్ ఒవైసీ ఇప్పటికే భాగీదారి సంకల్ప్ మోర్చా (బిఎస్ఎం) అనే కూటమి ద్వారా 9 స్థానిక పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. యూపిలో మొత్తం 404 సీట్లుండగా, 110 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లు 30 నుంచి 39 శాతం దాకా ఉన్నారు. 44 అసెంబ్లీ సెగ్మెంట్లలో ముస్లింలు 40 నుంచి 49 శాతంగా, అదే 11 స్థానాల్లో 50 నుంచి 65 శాతంగా ముస్లిం ఓటర్లు ఉన్నారు. బిఎస్ఎం కూటమితో పొత్తులో భాగంగా మజ్లిస్ పార్టీ ఈ సారి 100 సీట్లలో పోటీకి దిగుతున్నది.