పాట్నా: అసదుద్దీన్ ఒవైసి నేతృత్వంలోని ఎఐఎంఐఎం బీహార్లో ఐదు అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకొని రికార్డు సృష్టించింది. సీమాంచల్ ప్రాంతంలో 24 స్థానాలుండగా, 14 స్థానాల్లో పోటీ చేసి ఐదు స్థానాల్లో గెలుపొందింది. మిగతా స్థానాలను తన భాగస్వామ్య పక్షాలైన ఆర్ఎల్ఎస్పి, బిఎస్పికి వదిలేసింది. 2019లో జరిగిన ఉప ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని కిషన్గంజ్ స్థానంలో ఎంఐఎం గెలుపొందడం ద్వారా అందరి దృష్టినీ ఆకర్షించింది. ముస్లింల ఓట్లు అధికంగా ఉన్న సీమాంచల్లో ఎంఐఎం తన అభ్యర్థులను నిలబెట్టడంపై కాంగ్రెస్ ఘాటుగా విమర్శిస్తోంది. ఎంఐఎంను బిజెపికి బి టీంగా కాంగ్రెస్ నేత అధీర్రంజన్ చౌదరి ఆరోపించారు. 2015 ఎన్నికల్లోనూ సీమాంచల్లో ఎంఐఎం ఆరు సీట్లకు పోటీ చేయగా, ఐదింటిలో డిపాజిట్ కోల్పోయింది. ఒక్క కొచ్చాధామన్లోనే రెండో స్థానంలో నిలిచింది. ఈ ఎన్నికల్లో ఈ స్థానంతోపాటు అమౌర్, జోకీహత్, బైసీ, బహదూర్గంజ్ స్థానాల్లో ఎంఐఎం గెలుపొందింది.