మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి సంస్థ (టిఎస్ఐడిసి)ఛైర్మన్గా ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణను నియమించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నిర్ణయించారు. వెంటనే నియామక ఉత్తర్వులు జారీ చేయాలని శనివారం సిఎం అధికారులను ఆదేశించారు. 20 సంవత్సరాలుగా రాజకీయ అనుభవం కలిగిన అమరవాది గతంలో ఐఎస్ సదన్ డివిజన్ నుంచి కార్పోరేటర్గా ఎన్నికల బరిలో నిలిచారు. నిత్యం ప్రజలకు ఉంటూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల అభిమానం చూరగొనడంలో అమరవాది తనదైన శైలిలో వ్యవహరించారు. అంచెలంచెలుగా రాజకీయంలో ఎదుగుతూ ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవితోపాటు తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
అలాగే ఎపిఎస్ఆర్టిసి ఆఫీసర్స్ కాలనీ అధ్యక్షుడిగా సేవలందిస్తున్నారు. 1958 నవంబర్ 10వ తేదీన వెంకయ్య, సరస్వతి దంపతులకు జన్మించిన అమరవాది విద్యాభ్యాసం చేస్తూనే మరోవైపు వ్యాపారం చేస్తూ తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా నిలిచారు. కాలక్రమంలో టిఆర్ఎస్ పార్టీ ఆశయాలకు ఆకర్షితుడై అటు ఉద్యమాలలో ఇటు రాజకీయాలలో తనదైన ముద్ర ప్రదర్శించాడు. సేవా కార్యక్రమాలలో ఆయన సతీమణి పద్మావతి, కుమారుడు ఎ.సుమన్కుమార్, కుమార్తె జి.సుచిత్ర, అల్లుడు డాక్టర్ వంశీలను సైతం భాగస్వామ్యం చేశారు.