ముంబై: దీపావళి సందర్భంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి చేసిన ఓ ట్వీట్పై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి దీపావళి పర్వదినం సందర్భంగా ఎవరూ కూడా టపాసులు కాల్చకూడదని కోహ్లి తన ట్వీట్లో విజ్ఞప్తి చేశారు. అయితే దీనిపై దేశ వ్యాప్తంగా పలువురు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత ప్రజలు ప్రతి ఏడాది ఎంంతో సంబురంగా జరుపుకునే దీపావళి పండుగలో టపాసులు కాల్చకూడదని కోహ్లి చెప్పడాన్ని వారు తప్పుపడుతున్నారు. ఇటీవలే దుబాయిలో విరాట్ కోహ్లి జన్మదిన వేడుకలు జరిగాయి. ఇందులో అతను ప్రాతినిథ్యం వహించే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం, సహచర క్రికెటర్లు పెద్ద ఎత్తున బాణసంచాను కాల్చారు. దీనికి సంబంధించిన వీడియోలను అప్పట్లో కోహ్లి సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఇలాంటి పరిస్థితిలో కోహ్లి తాజాగా చేసిన ట్వీట్పై దుమారం నెలకొంది. పుట్టిన రోజు వేడుకలో టపాసులు కాల్చితే పర్యావరణానికి ఎలాంటి ముప్పు ఉండదని, కానీ దీపావళి పండగ సందర్భంగా బాణసంచా కాల్చితే ఇబ్బందులు ఉంటాయని కోహ్లి పేర్కొనడం విడ్డూరంగా ఉందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.