Monday, April 29, 2024

నక్సల్స్‌పై నాలుగు అస్త్రాలు

- Advertisement -
- Advertisement -

 

Amit Shah meets with six CMs

శాంతిభద్రతల కోణంలో మావోయిస్టులను కట్టడి చేయడం నిధులు అందకుండా చూడడం అనుబంధ సంఘాలకు కళ్లెం వేయడం మారుమూల ప్రాంతాలను ప్రధాన రహదారులతో అనుసంధానం చేయడం

కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయం పెంపు,
టెలికమ్యూనికేషన్స్ బలోపేతం, గ్రామీణ
ప్రాంతాలలో ఏకలవ్య పాఠశాలలు, పోస్ట్
ఆఫీసులు మరింతగా నెలకొల్పడం, మొబైల్
టవర్స్ పటిష్ఠం తదితర విషయాలపై ఢిల్లీలో
రాష్ట్రాల ముఖ్యమంత్రులతో , ప్రతినిధులతో
చర్చించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా ,
పాల్గొన్న ముఖ్యమంత్రి కెసిఆర్, హాజరైన ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు

న్యూఢిల్లీ : దేశంలో నక్సల్స్ కట్టడి మరింత తీవ్రతరం, వారికి నిధుల చేరికకు కళ్లెం ..ఈ రెండు కీలక అంశాలే ప్రధానంగా రాజధాని ఢిల్లీలో ఆదివారం అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీకి తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సహా ఆరు రాష్ట్రాల సిఎంలు హాజరయ్యారు. మరో నాలుగు రాష్ట్రాల ఉన్నతాధికారులు ఇక్కడి విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన భేటీకి వచ్చారు. వామపక్ష తీవ్రవాద ప్రాబల్యాన్ని అరికట్టేందుకు తీసుకుంటున్న పలు రకాల చర్యలను మరింత విస్తృతం చేసేందుకు కేంద్రం సంకల్పించిందని హోం మంత్రి అమిత్ షా ఈ సందర్భంగా తెలిపారు. నక్సల్స్‌కు వివిధ రూపాలలో అందే నిధులను రాకుండా చేయాలి. మావోయిస్టులకు క్షేత్రస్థాయిలో ఊతం అందించే అనుబంధ సంస్థల పనిపట్టాల్సి ఉందని షా తెలిపారు. ఇప్పటి భేటీలో తెలంగాణ సిఎంతో పాటు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, బీహార్ సిఎం నితీశ్‌కుమార్, మధ్యప్రదేశ్ సిఎం శివరాజ్ సింగ్ చౌహాన్, మహారాష్ట్ర , జార్ఖండ్ సిఎంలు ఉద్ధవ్ థాకరే, హేమంత్ సోరెన్‌లు పాల్గొన్నారు.

పలు కారణాలతో ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ సిఎం జగన్‌మోహన్ రెడ్డి, పశ్చిమ బెంగాల్ సిఎం మమత బెనర్జీ, కేరళ సిఎం పినరయి విజయన్ రాలేదు. వీరి బదులుగా సీనియర్ అధికారులు వచ్చారు. వైఎస్ జగన్ అస్వస్థతతో సమావేశానికి రాలేదు. ఎపి తరఫున హోం మంత్రి మేకపాటి సుచరిత ప్రాతినిధ్యం వహించారు. నక్సల్స్ చర్యలను అదుపులో పెట్టేందుకు ముందుగా భద్రతా లోపాలను సరిదిద్దుకోవాల్సి ఉంటుంది. మౌలిక స్థాయిలో భద్రతా బలగాలలో ఉండే ఖాళీలను భర్తీ చేయడం తద్వారా ఎక్కడా భద్రతా శూన్యత తలెత్తకుండా చూసుకోవడం కీలకమని అమిత్ షా అభిప్రాయపడ్డారు. అజ్ఞాత మార్గాల ద్వారా మావోయిస్టులకు వివిధ స్థాయిలు, పలు మార్గాల ద్వారా అందే నిధులు ఇతర సాధనాసంపత్తిని గుర్తించి ఇవి చేరకుండా నిరోధించడం ద్వారా నక్సల్ సమస్యకు పరిష్కారం దిశలో అడుగులు వేగం అవుతాయని తెలిపారు. తీవ్రవాద శక్తులకు అందే నిధుల స్వరూపం గురించి పసికట్డటంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి), జాతీయ దర్యాప్తు సంస్థ (నియా) , రాష్ట్రాల పోలీసు యంత్రాంగాల సమన్వయం వంటి అంశాలు సిఎంలతో చర్చల దశలో కేంద్రం ప్రస్తావించింది.

మావోయిస్టుల క్షేత్రస్థాయి సంస్థల వ్యక్తులపై కేసుల విచారణ దర్యాప్తులను వేగవంతం చేయాల్సి ఉంటుంది. రాష్ట్రాల స్థాయిల్లో ఇంటలిజెన్స్ వర్గాల సామర్థం పెంపొందాల్సి ఉంది, ప్రత్యేక బలగాలకు తగు వనరులు సమకూర్చాలి. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాలలో దుర్భేధ్యపు పోలీసు ఠాణాలను ఏర్పాటు చేయడం వంటి పలు అంశాలు చర్చకు వచ్చాయని అధికార వర్గాలు తెలిపాయి. నక్సల్స్ సమస్య ఉన్న ప్రాంతాలలో ఇప్పుడు చేపట్టిన వివిధ ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాల పనితీరును కూడా ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారులతో జరిపిన సమీక్షా సమావేశంలో హోం మంత్రి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా, ఇంటలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ అర్విందకుమార్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, గిరిరాజ్‌సింగ్, అర్జున్ ముండా , నిత్యానంద రాయ్ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.

నక్సల్స్ ప్రాంతాలలో వేగపర్చే ప్రగతి పనులు

నక్సల్స్‌ను భద్రతాకోణంలో అణచివేయడంఓ కోణం అయితే అంతకు మించిన పని నక్సల్స్ ప్రాబల్య ప్రాంతాలలో ప్రగతి పనులను వేగిరపర్చడం కీలకం. తద్వారా ప్రజలను ప్రభుత్వ అధికారిక వ్యవస్థ ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడం ముఖ్యమైనది. మారుమూల ప్రాంతాలకు రహదారుల అనుసంధానం, దీర్ఘకాలిక జాప్యపు రోడ్ల నిర్మాణం, టెలికమ్యూనికేషన్స్ వ్యవస్థ బలోపేతం, గ్రామీణ ప్రాంతాలలో నెట్‌వర్క్ సక్రమానికి ఇప్పుడున్న మొబైల్ టవర్స్‌ను అప్‌గ్రేడ్ చేయడం వంటి అంశాలు కీలకం.

పలు ప్రాంతాల్లో ఇప్పటికీ సరైన సెల్‌ఫోన్లు, సమాచార వ్యవస్థ లేకపోవడం భద్రతా వ్యవస్థకు ఇబ్బందిగా మారుతున్న విషయాన్ని రాష్ట్రాలతో కేంద్రం జరిపిన ఇప్పటి చర్చలలో ప్రస్తావనకు వచ్చాయి. గ్రామీణ ప్రాంతాలలో ఏకలవ్య విద్యాలయాలు, పోస్టు ఆఫీసులు ఏర్పాటు చేయడం గురించి దృష్టి సారిస్తారు. ప్రజలను ప్రభుత్వ కార్యక్రమాల పట్ల మరింత భాగస్వామ్యం చేయడం కీలకమని అభిప్రాయపడ్డారు. ఇటీవలి సంవత్సరాల్లో దేశంలో మావోయిస్టు హింసకాండ తగ్గిందని హోం మంత్రిత్వశాఖ డాటాతో వెల్లడించారు. అయితే ఇప్పటికి దేశవ్యాప్తంగా మొత్తం 90 జిల్లాల్లో నక్సల్స్ సంబంధిత ఘటనలు జరుగుతున్నాయి. వీటిని భద్రతా సంబంధించిన వ్యయం (ఎస్‌ఆర్‌ఇ) పథకం పరిధిలోకి తీసుకువచ్చారు.

Amit Shah meets with six CMs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News