మన తెలంగాణ/హైదరాబాద్: ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలో మరో లక్ష మెట్రిక్ టన్నుల కందులను కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం మంగళవారం అనుమతించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తొలివిడతలో 47,500 మెట్రిక్ టన్నుల కందుల కొనుగోళ్లకు కేంద్రం అనుమతించింది. ఆ తరువాత మరో 4,500 టన్నుల కొనుగోళ్లకు అనుమతించింది. దీంతో కేంద్రం మొత్తంగా రాష్ట్రం నుంచి 1.52 లక్షల మెట్రిక్ టన్నుల కందులను కొనుగోలు చేయనుంది. సాగునీటి వసతి పెరగడంతో భారీగా 2 లక్షల మెట్రిక్ టన్నుల కందుల ఉత్పత్తి వస్తుందని,- కొనుగోళ్ల పరిమితి పెంచాలని మంత్రి నిరంజన్ రెడ్డి ఇటీవల కేంద్రానికి లేఖ రాశారు రాశారు. అయినా అనుమతి రాలేదు. రైతుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మరోమారు సిఎం కెసిఆర్ స్వయంగా కేంద్రానికి లేఖ రాశారు. ఇటీవల ఐకార్ సమావేశానికి హాజరైన మంత్రి నిరంజన్ రెడ్డి సిఎం లేఖ సారాంశాన్ని, క్షేత్ర పరిస్థితులను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి వివరించారు.
సానుకూలంగా స్పందించిన కేంద్రం తాజాగా గత కోటాకు అదనంగా మరో లక్ష టన్నుల కొనుగోలు చేసేందుకు అనుమతించింది. దీంతో మొత్తం 1.52 లక్షల మెట్రిక్ టన్నులు కేంద్రం తరపున కొనుగోలు చేయనున్నారు. కందుల కొనుగోలుకు ముందుచూపుతో కేంద్రానికి లేఖ రాసి అనుమతి వచ్చేలా చేసిన ముఖ్యమంత్రి కెసిఆర్కు మంత్రి రాష్ట్ర రైతాంగం తరపున కృతజ్ఞతలు చెప్పారు. – తెలంగాణ విజ్ఞప్తిని మన్నించిన కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి నరేంద్రసింగ్ తోమర్ కూడా ధన్యవాదాలు తెలిపారు. వాస్తవానికి కేంద్రం వెంటనే అనుమతి ఇవ్వకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం తరపున కొనుగోళ్లు మొదలుపెట్టారు.