Monday, April 29, 2024

లాక్‌డౌన్‌తో కరోనా కొంత తగ్గుముఖం పడుతుంది

- Advertisement -
- Advertisement -

Ask KTR on Twitter Over Telangana Govt's Covid Initiatives

రెమ్‌డెసివిర్ మందుల వినియోగంలో
ప్రభుత్వం ఆడిట్ నిర్వహిస్తూ పర్యవేక్షిస్తుంది
కొవిడ్ రోగులు మానసికంగా బలంగా ఉండాలి
వ్యాక్సిన్లు సరఫరా కేంద్ర చేతుల్లో ఉన్నది
రాష్ట్ర అవసరాల మేరకు వ్యాక్సిన్లు అందడం లేదు
ప్రభుత్వంపై కొంతమంది చేస్తున్న
అసత్య ప్రచారాలకు అయోమయానికి గురికావద్దు
ఇవన్నీ రాజకీయ దురుద్దేశాలతో కూడినవే
నాలుగు రాష్ట్రాల రోగులకు చికిత్స అందిస్తున్న
హైదరాబాద్‌కు కేంద్రం అందిస్తున్న
ఆక్సిజన్,మందుల కోటాను మరింత పెంచాలి
కొవిడ్ నియంత్రణ కోసం పనిచేస్తున్న
పౌరులు, సంస్థల సేవలను అభినందనీయం
కొవిడ్ ద్వారా తమ తల్లిదండ్రులను కోల్పోయిన
పిల్లల కోసం ప్రత్యేక హెల్ప్ డెస్క్
ఆస్క్ కెటిఆర్‌లో మంత్రి కె.టి.రామారావు
కొవిడ్ నియంత్రణ అంశాలపైన ప్రజలతో కెటిఆర్ సంభాషణ
ట్విట్టర్ వేదికగా నిర్వహించిన ఆస్క్ కెటిఆర్ కార్యక్రమంలో
ప్రజల ప్రశ్నలకు మంత్రి కెటిఆర్ సమాధానాలు
కరోనా రికవరీకి టిప్స్ చెప్పిన మంత్రి

హైదరాబాద్ : ప్రస్తుతం తెలంగాణ లాక్ డౌన్ సమర్థవంతంగా కొనసాగుతున్నదని, ప్రజల అత్యవసరాల కోసం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు వెసులుబాటు ఉందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె.టి.రామారావు తెలిపారు. కొంతమంది సంపూర్ణ లాక్‌డౌన్ విధించాలని తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నా… ప్రజల సౌకర్యార్థం ఈ నాలుగు గంటలపాటు వెసులుబాటు ఇస్తున్నామని అన్నారు. దీంతోపాటు ఈ-కామర్స్ ద్వారా ప్రజల అవసరాలు తీరేలా పూర్తి వెసులుబాటు కల్పించామని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన చర్యలతో పాటు లాక్‌డౌన్ వలన కరోనా కొంత తగ్గుముఖం పడుతుందని మంత్రి కెటిఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రి కె.టి.రామారావు గురువారం కొవిడ్ నియంత్రణ సంబంధిత అంశాలపైన ప్రజలతో ఆస్క్ కెటిఆర్ పేరిట ట్విట్టర్ వేదికగా సంభాషించారు. ఈ సంభాషణలో భాగంగా మంత్రి కెటిఆర్ పలువురు కొవిడ్ అంశానికి సంబంధించి అడిగిన పలు ప్రశ్నలకు పైన సమాధానాలిచ్చారు. ఆస్క్ కెటిర్ పేరిట జరిగిన ఈ సంభాషణ జాతీయస్థాయిలో ట్విట్టర్ ట్రెండింగ్‌లో నంబర్ వన్‌గా నిలిచింది.

ఆక్సిజన్ సరఫరా కేంద్ర పరిధిలోని అంశం

ఆక్సిజన్ సిలిండర్లు, రెమ్‌డెసివిర్ వంటి మందుల సరఫరాను ప్రభుత్వమే ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రజలకు అందజేయాలన్న సూచనకు మంత్రి కెటిఆర్ స్పందించారు. ఆక్సిజన్ సరఫరా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉందని, ఆక్సిజన్ సరఫరా విషయంలో దేశం సవాళ్లను ఎదుర్కొంటున్నదని అన్నారు. మరోవైపు రెమ్‌డెసివిర్ మందుల వినియోగంలో ప్రభుత్వం ఆడిట్ నిర్వహిస్తూ, పర్యవేక్షిస్తుందని, అయితే కొవిడ్ సోకిన రోగులకు కుటుంబాల నుంచి ఈ మందు వినియోగానికి తమ పైన తీవ్రమైన ఒత్తిడి ఉన్నదని వైద్య వర్గాలు తెలిపిన విషయాన్ని కెటిఆర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. మరోవైపు ఆక్సిజన్, రెమ్‌డెసివిర్ మందులను బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్న అనేక మందిని ఇప్పటికే అరెస్టు చేసిన విషయాన్ని కెటిఆర్ తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రులు కొవిడ్ రోగులను దోచుకుంటున్నాయని, ఇందుకు సంబంధించి చికిత్స ఖర్చు విషయంలో జాతీయ స్థాయిలో ఏకీకృత విధానం రూపొందించాలని, చేసిన సూచనకు స్పందించిన కెటిఆర్, ఈ అంశం పైన దృష్టి సారిస్తున్నామని అన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తున్నదని ఇందుకోసం ఇప్పటికే 28 వేల బృందాలను ఏర్పాటు చేసి 60 లక్షల ఇళ్లను తమ వైద్య యంత్రాంగం సందర్శించినదని తెలిపారు. ఈ భారీ ప్రయత్నానికి సంబంధించిన సానుకూల ఫలితాలు త్వరలో వస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. తమ మంత్రులంతా కూడా జిల్లా స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కలెక్టర్ మరియు డీఎంహెచ్‌ఓ స్థానిక ఆసుపత్రుల అధికారులతో ఎప్పటికప్పుడు నియంత్రణ చర్యలను పర్యవేక్షిస్తున్నారని మంత్రి కెటిఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.ఈ ప్రయత్నంలో నియోజకవర్గ స్థాయిలో ఎంఎల్‌లను కూడా భాగస్వాములు అవుతారని అన్నారు.

సొంత వైద్యం పనికిరాదు… కరోనా టిప్స్ చెప్పిన మంత్రి

కొవిడ్ వచ్చిన వారికి మీరిచ్చే టిప్స్ ఏమిటని ఒకరు అడిగిన ప్రశ్నకు మంత్రి కెటిఆర్ సమాధానమిస్తూ…. సొంత వైద్యం పనికిరాదని, కేవలం వైద్యులు సూచించిన ప్రామాణిక పద్ధతుల్లోనే వైద్యం తీసుకోవాలని సూచించారు. మానసికంగా బలంగా ఉండాలని, కొవిడ్ రికవరీ తర్వాత ఎలా ఉండాలో ముందే ప్లాన్ చేసుకోవాలని సూచించారు. అసత్యాలను, అర్ధ సత్యాలను ప్రచారం చేసే సోషల్ మీడియా, టివి ఛానల్స్ వంటివాటికి దూరంగా ఉండాలని, ముఖ్యంగా వాట్సాప్ నిపుణుల సూచనలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోద్దని అన్నారు. వీలుంటే వ్యాయామం చేస్తే మంచిదని తెలిపారు. కో వ్యాక్సిన్ ఫార్ములాను భారత్ బయోటెక్ ఇతర కంపెనీలతో పంచుకొని వ్యాక్సిన్ అందరికీ అందేలా చూడాలని సూచన ఈ విషయంలో కేంద్రమే ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

వ్యాక్సినేషన్‌లో జాతీయ సగటు కన్నా ముందున్నాం

వ్యాక్సినేషన్ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం జాతీయ సగటు కన్నా తెలంగాణ ముందువరసలో ఉన్నదని మంత్రి కెటిఆర్ వెల్లడించారు. ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు సైతం తెలంగాణ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ముందు వరుసలో ఉన్నదని, దీన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు వ్యాక్సిన్ సరఫరానే అతి పెద్ద అడ్డంకి అని కెటిఆర్ పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణలో 45 ఏళ్లకు పైబడి సుమారు 92 లక్షల జనాభా ఉంటే అందులో 45 లక్షలకు పైగా ప్రజలకు మొదటి డోస్ వ్యాక్సిన్ అందిందని, మరో పది లక్షల మందికి పైగా రెండవ డోసు కూడా పూర్తయినదని తెలిపారు. ఇప్పటికే మొదటి డోసు తీసుకున్న 45 లక్షల మందికి అందరికి రెండవ డోసు అందించడమే ప్రస్తుతం తమ ప్రథమ ప్రాధాన్యతగా ఉందని అన్నారు. అయితే వ్యాక్సిన్లు సరఫరా కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్నందున, రాష్ట్రానికి కావలసిన మేరకు వ్యాక్సిన్లు అందడం లేదని కెటిఆర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి రోజుకి 9 లక్షల మందికి వ్యాక్సినేషన్ చేసే యంత్రాంగం ఉన్నదని, అయితే వ్యాక్సిన్ సరఫరానే అతి పెద్ద సవాలుగా నిలుస్తుందని చెప్పారు.

దీంతోపాటు వ్యాక్సిన్ తయారీదారులతోను రాష్ట్ర ప్రభుత్వం సమావేశం అవుతుందని తెలిపారు. ఇప్పటికే వ్యాక్సిన్ తయారు చేస్తున్న భారత్ బయోటెక్, సీరం ఇన్‌స్టిట్యూట్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌లతో మాట్లాడుతున్నామని కెటిఆర్ పేర్కొన్నారు. రానున్న జూలై ఆగస్టు తొలి అర్థం నాటికి వ్యాక్సిన్లు సరఫరా తగినంత ఉండే అవకాశం ఉందని, అప్పటివరకు వాక్సినేషన్ కార్యక్రమం కొంత సవాళ్లతో కూడుకున్నది అన్నారు. దేశంలో తయారవుతున్న వాక్సిన్‌లలో 85 శాతం పూర్తిగా కేంద్రం పరిధిలో ఉందని మిగిలిన 15 శాతం నుంచే రాష్ట్రాలు, ఇతర ప్రైవేటు సంస్థలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని తెలిపారు. కొన్ని వందల మంది ఉద్యోగులుగా ఉన్న కంపెనీలకు వ్యాక్సిన్ పొందడం సులభమని, తగినంత వ్యాక్సిన్లు సరఫరా కానప్పుడు మూడున్నర కోట్లకుపైగా జనాభా ఉన్న తెలంగాణ లాంటి రాష్ట్రానికి భారీ ఎత్తున వ్యాక్సిన్లను అందుబాటులోకి రావడం సవాలే అని పేర్కొన్నారు.

గ్లోబల్ టెండర్లలో మూడు వ్యాక్సిన్ కంపెనీలు పాల్గొనే అవకాశం

తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన గ్లోబల్ టెండర్లను కేంద్ర ప్రభుత్వం అనుమతించిన మూడు వ్యాక్సిన్ తయారీదారులు పాల్గొనే అవకాశం ఉందని అన్నారు. అయితే త్వరలోనే ఫైజర్, మోడర్నా కంపెనీల వ్యాక్సిన్‌లకు సైతం అనుమతి లభిస్తుందని తెలిపారు. ఆగస్టు నెలాఖరుకు దేశీయంగా బయోలాజికల్-ఈ తయారుచేస్తున్న వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వస్తుందన్న మంత్రి కెటిఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్ నియంత్రణ కోసం చేస్తున్న ప్రయత్నాలను కొంతమంది దుష్ప్రచారం, అసత్యాలతో బద్నాం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలతో అయోమయానికి గురి కావద్దని, ఇవన్నీ రాజకీయ దురుద్దేశాలతో కూడినవే అని కెటిఆర్ పేర్కొనారు. ప్రస్తుతం ఉన్న కొవిడ్ సంక్షోభం మన రాష్ట్రంలో ఉన్న ఫార్మా ఇండస్ట్రీ జాతీయ ప్రాధాన్యతను తెలిపిందని అందరూ అనుకున్నారని, ప్రస్తుత పరిస్థితుల్లో ఫార్మాసిటీ ప్రాజెక్టు అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టుగా మారబోతుంది అని కెటిఆర్ అన్నారు. కొవిడ్ సంక్షోభం ఉన్నంత కాలం తెలంగాణకి ఇతర దేశాల నుంచి విమానాలు రాకుండా అడ్డుకునే విషయంలో కేంద్రమే తీసుకోవాలని అన్నారు.

అది రాష్ట్ర సబ్జెక్ట్ కాదని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కేవలం తెలంగాణ వారికి మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, చత్తీస్ఘడ్ నుంచి వస్తున్న రోగులకు సైతం చికిత్స అందిస్తుందని మంత్రి కెటిఆర్ తెలిపారు. ఈ అద్భుతమైన ప్రయత్నంలో భాగస్వాములుగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సిబ్బందికి మంత్రి కెటిఆర్ ధన్యవాదాలు తెలిపారు. 4 రాష్ట్రాలకు కేంద్రంగా రోగులకు చికిత్స అందిస్తున్న హైదరాబాద్ నగరానికి కేంద్రం అందిస్తున్న ఆక్సిజన్,మందుల కోటాను మరింత పెంచాల్సిన అవసరం ఉందన్నారు.

ఆక్సిజన్ బెడ్లను 9,213 నుంచి 20,739కు పెంచాం

ప్రస్తుతం ఉన్న సంక్షోభ కాలంలో కొవిడ్ నియంత్రణ కోసం పనిచేస్తున్న పౌరులు, సంస్థల సేవలను మంత్రి కెటిఆర్ ఈ సందర్భంగా కొనియాడారు. వారందరికీ మంత్రి కెటిఆర్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచం ఎప్పుడూ ఎదుర్కొని పరిస్థితుల్లో ఉన్నామని, ఇలాంటి సందర్భంలో కనీసం ఆన్‌లైన్ ద్వారానైనా చదువుకునే లేదా కోచింగ్ తీసుకునే విద్యార్థులు పరిస్థితులను అర్థం చేసుకోవాలని అన్నారు. కొవిడ్ ద్వారా తమ తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ తెలిపారు. ఐసిఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం ఎవరికైనా కొవిడ్ లక్షణాలు ఉంటే వెంటనే మల్టీ విటమిన్లు, ఇతర ప్రాథమిక మందులను తీసుకోవడం ప్రారంభించాలని, టెస్ట్ రిజల్ట్ కోసం వేచి ఉండవద్దని సూచించారు. మొదటి దశ కొవిడ్ సంక్షోభం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏమి నేర్చుకుందని ప్రశ్నిస్తున్న పలువురికి సమాధానంగా మంత్రి ఈ సందర్భంగా కొన్ని గణాంకాలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ముఖ్యంగా సెప్టెంబర్ నాటికి ఆక్సిజన్ బెడ్లు రాష్ట్రంలో 9,213 ఉంటే ప్రస్తుతం అవి 20,739గా ఉన్న అంశాన్ని ప్రస్తావించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News