Monday, April 29, 2024

ఎగవేత.. మోడీ పాలన ఘనత!

- Advertisement -
- Advertisement -

తొమ్మిదేళ్ళ నరేంద్ర మోడీ పాలనలో దేశంలో ఉన్న బ్యాంకులు 12 లక్షల, 50 వేల, 553 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూశాయని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్కలు వెల్లడిస్తున్నాయి. దేశ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో నష్టం జరగడం కనీవినీ ఎరుగం. రాజ్యసభలో దీనిపై నేను వేసిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం చెపుతూ బ్యాంకుల నష్టం గురించిన సమాచారాన్ని ప్రభుత్వం ఆపడం లేదని, ఈ మొత్తం సమాచారం పబ్లిక్ డొమైన్‌లో ఉందని నిరాశగా సమాధానమిచ్చారు. నిరర్ధక ఆస్తుల వివరాలు, నష్టాలు, రుణాల రద్దు వంటి సమాచారం కోసం 20 నెలలుగా ప్రయత్నిస్తుంటే, ఏదో ఇచ్చామంటే ఇచ్చామన్నట్టుగా విసిరేశారు.

మోడీ అధికారంలోకొచ్చిన తొలి ఎనిమిది సంవత్సరాల తొమ్మిది నెలల్లో 12 కోట్ల, 9 లక్షల, 606 కోట్ల రూపాయల నష్టం వాటిల్లగా, మొత్తం ఈ తొమ్మిదేళ్లలో 12 లక్షల, 50 వేల, 553 కోట్ల రూపాయల నష్టాన్ని బ్యాంకులు చవిచూచాయి. భారత దేశ చరిత్రలో బ్యాంకులను ఎవరూ, ఎప్పుడూ ఇలా దెబ్బ తీయలేదు. ఎలాంటి కుంభకోణం లేకుండా, పరిణామాలు జరగకుండా, ప్రజల్లో చర్చ జరగకుండా గతంలో ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడూ ఇలా బ్యాంకులను తుడిచివేయలేదు. ప్రభుత్వరంగ బ్యాంకులు ఎక్కువగా దెబ్బతింటే, ప్రైవేటు బ్యాంకులకు కూడా ఈ వైరస్ సోకింది. దీనికి ప్రతిగా ప్రైవేటు బ్యాంకులు వెంటనే మేల్కొన్నాయి. యస్ బ్యాంక్‌లో రాణా కపూర్, ఐసిఐసిఐ బ్యాకులో చందాకొచ్చర్ వంటి వారు దానికి మూల్యం చెల్లించారు. బ్యాంకుల్లో దాచుకున్న డబ్బును ఉద్దేశపూర్వకంగా రుణాలుగా తీసుకుని, ఎగవేసి, ఆస్తులు లాక్కునే వారికి, రాజకీయ ఆశీస్సులున్న వారికి కట్టబెడుతున్నారు.

తరువాత వీరిలో చాలా మంది నరేంద్ర మోడీతో సన్నిహితులవుతూ బ్యాంకుల నుంచి లక్షల కోట్ల రూపాయలను దోచేసి, విదేశాలకు ఎగిరిపోయి, ముందుగానే అక్కడ ఏర్పాటు చేసుకున్న పెద్ద పెద్ద బంగ్లాల్లో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఈ ఎగవేతదారుల్లో ఏ ఒక్కరిని కూడా విదేశాల నుంచి భారత్‌కు రప్పించి, విచారణ జరిపించి శిక్షలు విధింప చేసిన దాఖలాలు మోడీ పాలనలో లేనేలేవు. మన్మోమోహన్ ప్రధానిగా వున్న రోజుల్లో సత్యం కంపూటర్స్‌లో అవినీతి జరిగితే సత్యం రామలింగరాజును జైలుకు పంపించారు. మన్మోమోహన్ పాలనా కాలంలో కుంభకోణాలపైన, కుంభకోణాలు జరిగాయని కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ నివేదికలను తీసుకుని టివి చానెళ్ళు మాత్రం తెగ అరిచిగీపెట్టాయి. ఆ తరువాత ఆ ఛానెళ్ళలో చాలా మటుకు తమని తాము మోడీకి అమ్మేసుకున్నాయి. మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ మోడీ నుంచి రివార్డులు అందుకున్నారు. దీనిపై నేను వేసిన ప్రశ్నకు నిర్మలా సీతారామన్ సమాధానం చెపుతూ ‘ఇరవై మంది ఎగవేతదారుల నుంచి డబ్బును తిరిగి వసూలు చేయడానికి చర్యలు చేపట్టాం’ అన్నారు.

‘మోసం జరిగినట్టు లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల ద్వారా వెంటనే గుర్తించాలి, బ్యాంకులు ఫిర్యాదులు చేయాలి’ అని అసహనంగా చెప్పారు. ఇలా చేయాలనేది చిన్న పిల్లలకు కూడా తెలుసు. కానీ, ఆ ఇరవై మంది ఎగవేతదారులంతా ప్రధాని మోడీకి బాగా తెలిసినవారు. రుణాలు మంజూరు చేసేటప్పుడు వీరంతా ప్రధాని మోడీ తమకు తెలుసునని, ఆయనతో తీయించుకున్న ఫోటోలను మాకు చూపించారని బ్యాంకర్లు చెప్పారు. తన పదవి ప్రమాదంలో పడిపోతోందని భావించిన ఆర్థిక శాఖ మంత్రి నా ప్రశ్నలకు సమాధానాలు దాటవేశారు. అదే రోజున ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానం చెపుతూ ‘పరారీలోఉన్న ఆర్థిక నేరాల నియంత్రణ చట్టం కింద 15 వేల113 కోట్ల రూపాయలను తిరిగి రాబట్టాం’ అని వివరించారు. ఈ ఎగవేతదారులు 40 వేల కోట్ల రూపాయలకు పైగా చెల్లించాల్సి ఉండగా, తమ బకాయిల్లో మూడింట రెండు వంతులు కట్టకుండా చేశారు.

ఈ ఏడాది 5వ తేదీన ఆర్థిక శాఖ మరో సహాయ మంత్రి భగవత్ కరద్ సమాధానమిస్తూ ‘సెంట్రల్ రెపోజిటరి ఆప్ ఇన్‌ఫర్‌మేషన్ ఆన్ లార్జ్ క్రెడిట్స్ (సిఆర్‌ఐఎల్‌సీ) లెక్కల ప్రకారం వాణిజ్య బ్యాంకుల ద్వారా పది మంది తీసుకున్న రుణం మొత్తం 12 లక్షల 71 వేల, 604 కోట్ల రూపాయలని వెల్లడించారు. బ్యాంకుల నుంచి కేవలం పది మంది ఎంత పెద్ద మొత్తంలో డబ్బును తీసుకున్నారో స్పష్టమవుతోంది. ఇలా వంద మంది తీసుకున్న మొత్తం దీనికి అయిదు రెట్లు ఉండవచ్చని మా అంచనా. బహుశా వీరికి వారితో సరైన సంబంధాలుంటే ఇందులో చాలా భాగం బ్యాంకులుకు తిరిగి రాదు. మోడీ పాలనా కాలంలో 69 లక్షల కోట్ల రూపాయలు ఇలా నిరర్ధక ఆస్తులుగా తయారయ్యాయి. బ్యాంకు రుణాలు ఇవ్వడం గణనీయంగా పెరిగింది. మొత్తం రుణాలలో ఎగవేత ఎంత శాతం ఉన్నదో అదే వీటి గురించి సరిగ్గా చెపుతాయి. ఈ ఎగవేత రుణాల శాతం నిరర్ధక అస్తుల శాతంతో పోల్చుకుంటే బ్యాంకుల స్థితిగతులను బహిర్గతం చేస్తాయి. దీంతో భారత దేశంలో ఏం జరుగుతోంది, చాలా దేశాల కంటే దారుణంగా ఎందుకు ఉన్నామనేది స్పష్టమవుతుంది.మొత్తం రుణాలలో నిరర్ధక ఆస్తుల శాతం ఎంతనేది అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) వెబ్‌సైట్‌లో ఉన్నాయి. అభివృద్ధి చెందిన దేశాలలో అవి 0.4 నుంచి 1.4 శాతం ఉన్నాయి. అక్కడ మంచితనం ఎక్కువ, ఆశ్రయించే వారికి పనులు జరగడం తక్కువ, అవినీతి వ్యతిరేకత ఎక్కువ. ఇటలీ, స్పెయిన్, పోర్చుగల్ వంటి దేశాల్లో స్నేహతత్వం ఎక్కువ వల్ల అక్కడి రుణాలు ఒక శాతం నుంచి ఒకటిన్నర శాతం ప్రమాదంలో పడిపోయాయి. టర్కీ, థాయ్‌లాండ్, బ్రూనేలలో రుణాలలో నిరర్ధక ఆస్తులు 3 శాతం ఉన్నాయి.

ఆర్థికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పిన దాని ప్రకారం భారతదేశంలో మోడీ పాలనా కాలంలో సహజంగా రుణాలలో నిరర్ధక ఆస్తుల విలువ 7 నుంచి 8 శాతంగా ఉంటుండగా, 2018 మార్చి 31 నాటికి అది 11.46 శాతానికి చేరాయి. గడిచిన ఏడేళ్ళలో నిరర్ధక ఆస్తులు 12.17 శాతానికి పెరిగాయని ఆర్థిక శాఖ సహాయ మంత్రి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ప్రమాదంలోపడిన రుణాలు రెండు శాతం ఉండగా, మన దేశంలో ఇది చాలా ఎక్కువగా ఉంది. ఇదంతా కుమ్మక్కవడం వల్ల, మోసం చేయడం వల్ల, బ్యాంకు రుణాలను దుర్వినియోగపరచడం వల్ల జరుగుతుంది. మోడీ పాలనా కాలంలో రుణాలలో నిరర్ధక ఆస్తులు 11.46 శాతానికి చేరుకోగా, 9.46 శాతం కొందరి జేబుల్లోకే వెళ్ళడం అనేది మన బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న లోపాల వల్ల జరిగినదే. రాజకీయ ఒత్తిడి లేకుండా, అవినీతి లేకుండా పెద్ద రుణాలు ఏవీ మంజూరు కావన్నది జగమెరిగిన సత్యం. అంతర్జాతీయ ప్రమాణాలననుసరించి భారత దేశంలో రెండు శాతం రుణాలు పక్కదారి పడతాయని కొందరు వాదిస్తున్నారు. బ్యాంకింగ్ విధానంలో ఉన్న లొసుగుల వల్ల ప్రపంచంలోని అన్ని దేశాల్లో 2 శాతం, అంతకంటే తక్కువగా మాత్రమే నిరర్ధక ఆస్తుల శాతం ఉంటే, మన దేశంలో అలా ఎందుకు లేదు? దీన్ని అర్థం చేసుకోవడానికి, మోడీ పాలనా కాలంలో తెలిసిన ఆశ్రితుల కోసం, ఇతర నేరస్థుల కోసం ఎంత లాగేశారో అర్థం చేసుకోవచ్చు. నిరర్ధక ఆస్తులు, అడ్వాన్సులు అన్నీ కలిపి 2022 డిసెంబర్ చివరి నాటికి 4.4 శాతానికి తగ్గాయని ప్రభుత్వం చెపుతోంది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రం 2023 సెప్టెంబర్ నాటికి స్థూల నిరర్ధక ఆస్తులు 9.4 శాతం పెరిగాయని చెపుతోంది. యుపిఎ ప్రభుత్వం కూడా చివరికి కొన్ని నిర్లక్ష్యంగా రుణాలిచ్చి ఉండవచ్చు కానీ, మోడీ తొమ్మిదేళ్ళ కాలంలో వాటిని పరిశీలించి, తప్పుడు రుణాలను వదిలించుకుని, స్థిరత్వాన్ని తీసుకుని వచ్చి ఉండవచ్చు. మోడీకి చెందిన వ్యాపారుల ద్వారా ఎగవేత రుణాలు రెట్టింపు, మూడు రెట్లు అయిపోయాయి. డబ్బు అదృశ్యం కాదు. కాకపోతే ఒకరి జేబులోంచి మరొకరి జేబులోకి ప్రవహిస్తుంది. ఎగవేసే ఈ వ్యాపారులు రుణాల రద్దు ద్వారా లాభపడతారు. రాజకీయ పార్టీలకు ఆర్థికంగా సహాయపడే పెద్ద పెద్ద సొర చేపలు ‘కార్పొరేట్ సంస్థల’ ద్వారా తమ వ్యవహారాలను చక్కబెట్టుకుంటారు. బ్యాంకర్లు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సిబిఐ, రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టర్, ఇతర కార్పొరేట్, ఆర్థిక పాలనా వ్యవస్థకు చెందినవారు నిజంగా దీన్ని తీవ్రం గా పరిగణించినట్టయితే దీన్ని అడ్డుకోవచ్చు. నిరర్ధక ఆస్తులు, రద్దు చేసిన రుణాల గురించి పార్లమెంటులో అడిగితే డిప్యూటీ కార్యదర్శి తయారు చేసిన కొన్ని పేజీలను నిర్మలా సీతారామన్ సమర్పించారు.

అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల అసోసియేషన్ ఇచ్చిన వివరాలను కాస్త అటు ఇటుగా 2022 ఆగస్టు 18న ఆర్థిక శాఖ మంత్రి నిర్ధారించారు. బ్యాంకులు మంజూరు చేసే 4.47 లక్షల కోట్ల రూపాయలకు గాను మూడింట రెండు వంతులు ఈ 13 నిరర్ధక ఆస్తులు (నష్టపరిచేవి) ఉన్నాయి. ఈ మోసగాళ్ళకు రాజకీయ నాయకులు ఆశ్రయం కల్పించడం ద్వారా సంపదను ఆర్థిక శాఖ ఇలా పక్కదారి పట్టిస్తోంది. ప్రధాన మంత్రి కుప్పతెప్పలుగా చట్టాలను చేస్తుంటారే కానీ, మోసగాళ్ళకు మేలు చేయడానికి ప్రస్తుతమున్న ఆర్థిక చట్టాలను మాత్రం మార్చరు. వీడియో కాన్ ఉదాహరణగా తీసుకుంటే అది తీసుకున్న అప్పు 46 వేల కోట్ల రూపాయలు. కేవలం 6 శాతం లబ్ధితో మోడీ సహచరుడికి చెందిన వేదాంత కంపెనీకి దీన్ని అమ్మేశారు. 22 వేల, 800 కోట్ల రూపాయల అప్పు తీసుకున్న ఎబిజి షిప్‌యార్డ్‌ను దాని విలువలో కేవలం 5 శాతంతో దాన్ని పరిసమాప్తం చేశారు. ఎందుకంటే రాజకీయ పలుకుబడి గల దాని యజమానికి నష్టాలను పూడ్చుకోడానికి తాజాగా మళ్ళీ రుణాలను మంజూరు చేశారు. బ్యాంకుల్లో ఉన్న ప్రజల సొమ్మును కొల్లగొట్టి తమ సంపదను పెంచుకునే ఈ దోపిడీదారులు ఎవరిని సంతృప్తి పరచడానికి ఇలా చేస్తున్నారనేది నరేంద్ర మోడీకి కానీ, నిర్మలా సీతారామన్ కానీ తెలియదా?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News