Monday, April 29, 2024

మోడీ నుంచి మరిన్ని దాడులు: ఇండియా కూటమికి ఖర్గే హెచ్చరిక

- Advertisement -
- Advertisement -

ముంబై: ప్రతిపక్ష కూటమి మరింత బలపడుతున్న దృష్టా ప్రధాని నరేంద్ర మోడీ నుంచి మరిన్ని దాడులకు సిద్ధంగా ఉండాలని ప్రతిపక్ష ఇండియా(ఇండియన్ నేషనల్ డెమోక్రటిక్ ఇన్‌క్లూజివ్ అలయెన్స్) కూటమిని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే శుక్రవారం హెచ్చరించారు. 28 పార్టీలకు చెందిన 60 మందికిపైగా నాయకులు పాల్గొన్న ఇండియా కూటమి రెండవరోజు సమావేశంలో ప్రారంభోపన్యాసం చేస్తూ ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష కూటమిపై మోడీ చేస్తున్న దాడులను తీవ్రవాద సంస్థగా, బానిసత్వానికి చిహ్నంగా ఖర్గే అభివర్ణించారు.

పాట్నా,లో జరిగిన మొదటి సమావేశం, బెంగళూరులో జరిగిన రెండవ సమావేశం విజయవంతం కావడంతో ప్రధాని నరేంద్ర మోడీ తదనంతరం చేసిన ప్రసంగాలలో ఇండియా కూటమిపై దాడి చేయడమేగాక మన దేశం పేరును తీవ్రవాద సంస్థగా, బానిసత్వానికి చిహ్నంగా పోల్చారని ఖర్గే అన్నారు. కేంద్రంలోని ఈ ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్న కారణంగా రానున్న నెలల్లో మరిన్ని దాడులకు, అరెస్టులకు సిద్ధంగా ఉండాలని ఆయన ఇండియా కూటమిని హెచ్చరించారు. మనం బలపడేకొద్దీ మన నాయకులపై కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగించి అధికార దుర్వినియోగానికి ఈ ప్రభుత్వం పాల్పడడుతుందని ఆయన చెప్పారు. మహారాష్ట్ర, రాజస్థాన్, బెంగాల్‌లో ఇదివరకే ఈ దాడులను చూశామని, తాజాగా జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌లో గతవారమే ఈ దాడులు జరిగాయని ఆయన తెలిపారు.

సమైక్య కూటమిగా నిలబడి పార్లమెంట్ లోపల, వెలుపల ప్రభుత్వ జవాబుదారీతనంతో కట్టుబడేలా చేయగలిగామని ఆయన ఆన్నారు. మన కూటమి బలాన్ని చూసి ప్రభుత్వంలో వణుకు పుడుతోందని, అందుకే ముఖ్యమైన బిల్లులను పార్లమెంట్‌లో ఏకపక్షంగా ఆమోదించుకుందని, మన ఎంపీలను అల్పమైనకారణాలతో సస్పెండ్ చేసిందని, మనపై సభాహక్కుల తీర్మాలను ప్రవేశపెట్టిందని, మన మైకులు పనిచేయనివ్వలేదని, మన నిరసనలు బయట ప్రపంచానికి తెలియనివ్వకుండా కెమెరాలను అనుమతించలేదని, సంసద్ టివిలో మన ప్రసంగాలను సెన్సార్ చేసిందని ఖర్గే ఆరోపించారు.

మహిళలపై నేరాలకు పాల్పడేవారు, మత రాజకీయాలకు పాల్పడేవారు ప్రబుత్వం నుంచి అనుభవిస్తున్న రక్షణను ఆయన ప్రశ్నించారు. రైతులు, యువజనులు, మహిళలు, మధ్యతరగతి ప్రజలు, మేధావులు, ఎన్‌జిఓలు, జర్నలిస్టులతోసహా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు కేంద్రంలోని బిజెపి నియంతృత్వ పాలనకు బలైపోతున్నవారేనని, కష్టాల నుంచి తమకు విముక్తి లభిస్తుందన్న ఆశను ఇండియా కూటమిపై 140 కోట్ల మంది భారతీయులు పెట్టుకున్నారని ఆయన చెప్పారు. గత 9 సంవత్సరాలుగా బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ చిమ్మిన మతతత్వ విషం ఇప్పుడు అమాయక రైలు ప్రయాణికులు, స్కూలు పిల్లలపై జరిగిన విద్వేష హత్యలలో చూస్తున్నామని ఆయన అన్నారు. దేశంలోని ఒక ప్రాంతంలో మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన నేరస్థులు జైలు నుంచి విడుదలై సన్మానాలు అందుకోవడం ఆశ్చర్యకరమైన విషయమేమీ కాదని, దీంతో నేరస్థులు చెలరేగిపోయి పాశవిక దాడులకుకు పాల్పడడమేగాక మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనలు మోడీ నేతృత్వంలోని భారత్‌లో మరో ప్రాంతంలో జరిగాయని, కార్గిల్ వీరుడి భార్యను కూడా దుండగులు వదిలిపెట్ట లేదని ఖర్గే చెప్పారు.

అట్టడుగు వర్గాల పట్ల బిజెపి ప్రభుత్వం చూపుతున్న వివక్షకు నిదర్శనం వారి నాయకులు పేద గిరిజనులు, దళితులపై మూత్ర విసర్జన చేయడమని ఆయన అన్నారు. నేరస్థులు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారని ఆయన ధ్వజమెత్తారు.
రాష్ట్రాలను తన గుప్పిట్లో పెట్టుకోవడానికి మోడీ ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రాలకు పన్నుల ఆదాయంలో వచ్చే వాటి వాటాలను ఇవ్వకుండా కేంద్రం వేధిస్తోందని, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలకు ఉపాధి హామీ బకాలయిలను విడుల చేయడం లేదని ఆయన ఆరోపించారు. ఆర్థిక సంఘం సిఫార్సు ప్రకారం ప్రత్యేక గ్రాంట్లను, నిర్ధిష్ట గ్రాంట్లను విడుదల చేయడం లేదని, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల నుంచి తమ ప్రాజెక్టులను బిజెపి పాలిత రాష్ట్రాలకు తరలించేలా పెట్టుబడిదారులపై ఒత్తిడి జరుగుతోందని ఆయన ఆరోపించారు.

కేంద్ర దర్యాప్తు సంస్థలను, వ్యవస్థలను తన గుప్పిట్లో పెట్టుకోవాలని బిజెపి ప్రభుత్వం తహతహలాడుతోందని ఆయన ఆరోపించారు. ఇడి చీఫ్, సిబిఐ డైరెక్టర్, ఎన్నికల కమిషనర్లతోపాటు న్యాయమూర్తుల నియామకాలపై కూడా పెత్తనం తనకే ఉండాలని బిజెపి భావిస్తోందని ఖర్గే ఆరోపించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News