Monday, April 29, 2024

సెల్ఫీ క్యాంపైన్ కు పిలుపునిచ్చిన భట్టీ విక్రమార్క..

- Advertisement -
- Advertisement -

ఉచిత కరెంట్ విషయంలో గులాబీ నేతలు కాంగ్రెస్ పార్టీపై చేస్తున్న విమర్శలకు సిఎల్పి నేత మల్లు భట్టి విక్రమార్క గట్టి కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇటీవలే పీపుల్స్ మార్చ్ కార్యక్రమం చేపట్టి ప్రజలకు దగ్గరైన భట్టి విక్రమార్క తాజాగా సెల్ఫీ క్యాంపైన్ మొదలు పెట్టారు. కాంగ్రెస్ హయాంలో రైతులకు చేసిన మేలు ఏమిటో ప్రజలకు గుర్తుచేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం.

రాజశేఖర రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేశారు. ఆ నాటి ఆ మహత్తర ఘటనను ప్రజలకు గుర్తుచేసేలా సెల్ఫీ కార్యక్రమం మొదలు పెట్టారు. రాజశేఖర రెడ్డి ఉచిత విద్యుత్ ఫైలుపై సంతకం చేసిన నాటి ఫోటోను భారీ స్థాయిలో రూపొందించారు. కాంగ్రెస్ కార్యాలయంలో ఓ గోడపై దానిని అతికించారు. ఆ భారీ పోస్టర్ ముందు నిలబడి భట్టి విక్రమార్క సెల్ఫీలు దిగారు. రాజశేఖర రెడ్డి పోస్టర్ ముందు దిగిన సెల్ఫీను భట్టి విక్రమార్క తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.

గతంలో కాంగ్రెస్ హయాంలో రాజశేఖరరెడ్డి ద్వారా ప్రారంభమైన అనేక ప్రాజెక్టును సందర్శించి అక్కడ సెల్ఫీలు దిగాలని భట్టివిక్రమార్క నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తద్వారా గులాబీ నేతలకు కౌంటర్ ఇవ్వాలని భావిస్తున్నారు భట్టి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ రైతుల పక్షానే నిలుస్తుందని, రైతులకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్ అందిస్తామని భట్టి విక్రమార్క సెల్ఫీ కార్యక్రమం ద్వారా మరోసారి ప్రకటించారు. ఉచిత కరెంట్ విషయంలో కాంగ్రెస్ చిత్తశుద్ధిని ప్రశ్నించే విధంగా గులాబీ నేతలు చేస్తున్న ప్రచారానికి అదేస్థాయిలో కౌంటర్ ఇచ్చేందుకు భట్టి ఎంచుకున్న సెల్ఫీ మార్గం మంచి ఫలితాలను ఇవ్వనుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇందులో భాగంగా బిహెచ్ఇఎల్, ఇసిఐఎల్, హెచ్ సియు, డిబిఎల్ సంస్థలతో, రాష్ట్రంలో వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టుల వద్ద కూడా సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పోస్టు చేయాలని భట్టి విక్రమార్క సూచించారు. వాటితో పాటు పాటు మెట్రో రైలు, ఔటర్ రింగ్ రోడ్డు వద్ద కూడా సెల్ఫీలు దిగి బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రచారానికి ధీటుగా ప్రచారం చేయాలని కాంగ్రెస్ నేతలకు, కార్యకర్తలకు భట్టి విక్రమార్క సూచించారు.

రేవంత్ రెడ్డి కొన్ని వారాల క్రితం అమెరికా పర్యటన సందర్భంగా రైతులకు 3 గంటల పాటు ఉచిత కరెంట్ ఇస్తే చాలు అని అర్ధం వచ్చే విధంగా చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీని డిఫెన్స్ లో పడేశాయి. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు గులాబీ నేతలకు బ్రహ్మాస్త్రంగా మారింది. రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలను మొదలు పెట్టాయి. ఈ నేపథ్యంలో భట్టి విక్రమార్క డ్యామేజ్ కంట్రోల్ మొదలు పెట్టారు. ఉచిత విద్యుత్ విధానంలో పేటెంట్ హక్కు తమదేనని భట్టి విక్రమార్క కౌంటర్ ఎటాక్ మొదలు పెట్టారు. తాను చేసిన విధంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ నాయకులందరూ చేయాలని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News