Monday, April 29, 2024

రైతులను ఆదుకోవడంలో జగన్ ప్రభుత్వం విఫలం: సత్యకుమార్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః గతంలో ఎన్నడూ లేని విధంగా ఆంద్రప్రదేశ్‌లో కరవు విలయతాండవం చేస్తోందని బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు కరవుతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా కనీసం వారికి సాయం అందించడంలో కూడా సిఎం జగన్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రైతులను ఆదుకోవడంలో తీవ్రంగా విఫలమయ్యారని రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్వర్తి ఫిడేలు వాయించినట్లుగా జగన్ తీరు ఉందన్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతున్నా తనకేం పట్టదన్నట్లు తాడేపల్లి ప్యాలెస్‌కే పరిమితం అయ్యారని, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు కార్యక్రమాల్లో పాల్గొని అసత్యాలు, మాయమాటలు చెప్తూ ప్రజలను మోసాలకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరవు పరిస్థితులు ఎక్కడ లేవని, ఏదో కొద్దిగా ఉందని చెప్పడం సిగ్గు చేటన్నారు. కరవుతో రైతులు అల్లాడుతుంటే కనీసం సమీక్ష చేయడం లేదని రాష్ట్రమంతటా కరువు ఉన్నా కేవలం 103 మండలాల్లో మాత్రమే కరవుందని ప్రభుత్వం ప్రకటించడం దుర్మార్గం అన్నారు.

కరవుతో రాష్ట్రంలో 80 శాతం నష్టం జరిగితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 10 శాతం మాత్రమే నష్టాన్ని చూపిస్తున్నారని కరవు సాయం కోసం కేంద్రానికి సీఎం జగన్ కనీసం లేఖ కూడా రాయలేదని విమర్శించారు. రైతాంగం కరవుబారినపడి తీవ్రంగా నష్టపోతున్నా ఈ ప్రభుత్వం సాయం అందించడంలో మీనమేషాలు లెక్కిస్తోందని ఆరోపించారు. పంటలు ఎండుతున్నా రైతాంగానికి సాగునీరు ఇవ్వని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని తన సొంత కంపెనీలకు మాత్రం జీవోలు ఇచ్చి నిరంతరాయంగా నీరుస్తున్నారని దుమ్మెత్తి పోశారు. వైఎస్‌ఆర్ కడప జిల్లాలో కరవు తీవ్రంగా ఉన్నా వాటిని పట్టించుకోకుండా భారతి సిమెంట్స్‌కు 0.1 టీఎంసీ నీటిని నిరాటంకంగా తరలిస్తున్నారని తన సీఎం మేనమామ ప్రతిభ బయోటెక్స్ సంస్ధకు రోజుకు 500 కెఎల్డీ చొప్పున నీరు ఇస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యంతో రైతాంగానికి ఈ దుస్థితి ఏర్పడిందని, రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను వైసీపీ తీవ్ర నిర్లక్ష్యం చేసిందన్నారు. కేంద్రం నిధులిస్తున్నా ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును పట్టించుకోలేదని వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్ని సాగునీటి ప్రాజెక్టులు కొత్తగా నిర్మించారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని కరవు పరిస్థితులపై బీజేపీ కార్యాచరణ రూపొందించి పోరాటం చేస్తుందని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News