Sunday, April 28, 2024

నేటి నుంచి బిజెపి విజయ సంకల్ప యాత్ర

- Advertisement -
- Advertisement -

చార్మినార్ భాగ్యలక్ష్మిదేవాలయం వద్ద వాహనాలకు ప్రత్యేక పూజ
కేంద్రంలో మూడోసారి బిజెపి అధికారం చేపడుతుంది:  కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

మన తెలంగాణ/ హైదరాబాద్:  రాష్ట్రంలో నేటి నుంచి విజయ సంకల్ప యాత్ర చేపడుతున్నట్లు ఈ యాత్ర అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తామని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి తెలిపారు. సోమవారం చార్మినార్ భాగ్యలక్ష్మిదేవాలయం వద్ద యాత్ర వాహనాలకు పూజ నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ విజయ సంకల్ప యాత్ర ఫిబ్రవరి 20వ తేదీన ప్రారంభమై మార్చి 2వ తేదీన ముగుస్తుందని, ప్రధాని మోడీ నాయకత్వంలో బిజెపి కేంద్రంలో మూడవసారి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

రాబోయే కేంద్ర ప్రభుత్వంలో తెలంగాణ ప్రజల భాగస్వామ్యం కావాలని, గత పార్లమెంటు ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులతో తమ పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో 4 స్థానాల్లో విజయం సాధించిందన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో 17 సీట్లు గెలవడమే లక్ష్యంగా విజయ సంకల్ప యాత్ర చేపడున్నట్లు అన్ని మండలాలు, నియోజకవర్గాల కేంద్రాలలో అన్ని సామాజికవర్గాల ప్రజలతో మమేకమవుతూ, రోడ్ షోలు నిర్వహించుకుంటూ యాత్ర కొనసాగుతుందని పేర్కొన్నారు. మార్చి 2వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలు పర్యటించే విధంగా కార్యాచరణ రూపొందించుకున్నామని పార్టీ జెండా నేతృత్వంలోనే యాత్ర జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర పార్టీ ముఖ్య నాయకులందరూ యాత్రకు హాజరైతారని, రాష్ట్రంలోని యువత, విద్యార్థులు, రైతులు, బడుగుబలహీన వర్గాల ప్రజలందరూ నరేంద్రమోడీ మరొకసారి ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షిస్తున్నారు. అందుకోసమే భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆశీస్సుల కోసం వచ్చామని, హైదరాబాద్ పార్లమెంటు కూడా కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పని చేస్తున్నామని,త్రిపుల్ తలాక్ రద్దు తర్వాత ముస్లిం మహిళలు మోడీ నాయకత్వం కోరుకుంటున్నారని తెలిపారు.

17కు 17 సీట్లు గెలవడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించుకుంటామని,నరేంద్రమోదీ నాయకత్వంలో సమిష్టిగా పని చేసి మెజార్టీ సీట్లు సాధిస్తామన్నారు. మా జెండా కమలం పువ్వు జెండా,మా నాయకుడు నరేంద్ర మోడీ కమలం పువ్వు జెండా పట్టుకుని నరేంద్రమోదీ నాయకత్వంలో విస్తృతంగా ప్రచారం చేస్తామని వెల్లడించారు. బిజెపిని ఆదరించి మోడీ నాయకత్వానికి ఆశీస్సులు అందజేయాలని తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లోని యువకులు, బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ వచ్చి యాత్రను విజయవంతం చేయాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News