సిడ్నీ: కరోనా కారణంగా ఈ నెల 29నుంచి ప్రాంభం కావలసిన ఐపిఎల్ టోర్నమెంట్ వాయిదా పడిన విషయం తెలిసిందే. పరిస్థితులు మెరుగైతే ఏప్రిల్ 15 తర్వాత ఈ టోర్నీని కొన్ని మార్పులు, చేర్పులతో తిరిగి నిర్వహించాలని శనివారం సమావేశమైన బిసిసిఐ అధికారులు, ఐపిఎల్ ఫ్రాంచైజీ యజమానులు నిర్ణయించారు. ఈ సమావేశంలో పలు ప్రత్యామ్నాయాల గురించి కూడా చర్చించినట్లు వార్తలు రావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ స్పిన్ బౌలర్ బ్రాడ్ హాగ్ కూడా ఒక కొత్త ఐపిఎల్ ఫార్మాట్ను సూచించాడు. ట్విట్టర్లో అభిమానులు అడిగే ప్రశ్నలు, సమాధానాల కార్యక్రమంలో ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా హాగ్ ఈ ప్రతిపాదన సూచించాడు.
ఐపిఎల్లో పాల్గొనే ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించాలని, అన్ని మ్యాచ్లను ఒకే వేదికలోనే నిర్వహించాలని ఆయన సూచించాడు. దీనివల్ల ఆటగాళ్లు ఒక చోటినుంచి మరో చోటికి ప్రయాణించడం తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డాడు. అయితే పెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్లను మాత్రం వేరే వేదికలో ఆడించవచ్చని కూడా హాగ్ సూచించాడు. ఏప్రిల్ 15వ తేదీ నాటికి పరిస్థితులు మెరుగుపడితే ఐపిఎల్ను కుదించి నిర్వహిస్తామని సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన గంగూలీ చేసిన వ్యాఖ్యలను, తనను ప్రశ్న అడిగిన అభిమాని ప్రశ్నను హాగ్ తన సమాధానానికి ట్యాగ్ చేశాడు కూడా.