Monday, April 29, 2024

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అల్పహారం అందించాలి

- Advertisement -
- Advertisement -

సిఎంకు బాలల హక్కుల సంక్షేమ సంఘం వినతి

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రం లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులందరికీ మధ్యాహ్న భోజనం తో పాటు అల్పాహారం కూడా అందించాలని బాలల హక్కుల సంక్షేమ సంఘం (బిహెచ్‌ఎస్‌ఎస్) ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేసింది. సమాజంలో వెనుకబడిన వర్గాలైన పేద బడుగు బలహీనర్గాలకు చెందిన పిల్లలను ముఖ్యంగా బాలికలను క్రమం తప్పకుండా బడికి రప్పించుటకు, వచ్చిన వారు బడి మానేయకుండా (డ్రాప్ ఔట్) ఉండడం కోసం, పిల్లలకు పోషకాహారాన్ని అందజేసి ఆరోగ్యాన్ని మెరుగుపరచాల్సిన అవసరం ఉందని సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డా. గుండు కిష్టయ్య, ఇంజమూరి రఘునందన్ అన్నారు. తరగతి గది ఆకలి నుండి వారిని రక్షించుట కోసం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశ పెట్టారన్నారు. ఇప్పటికీ చాలా మంది విద్యార్థులు వారి సామాజిక ఆర్థిక వెనుకబాటు కారణంగా ఉదయం పూట ఖాళీ కడుపులతోనే పాఠశాలకు వస్తున్నారని, ఉదయం ప్రార్ధనా సమయంలో ఎంతోమంది విద్యార్థులు కళ్ళు తిరిగి పడిపోతుంటారని, మధ్యాహ్న సమయంలో పెట్టే భోజనం కోసం ఎదురు చూస్తుంటారని తెలిపారు.

ఇటీవల తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వము దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో చదివే విద్యార్థులందరికీ అల్పాహారం ప్రవేశపెట్టిందని, దూర ప్రాంతాల నుండి విద్యార్థులు ఉదయాన్నే తినకుండా వస్తున్న విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం ఈ అల్పాహార పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తమిళనాడు ప్రభుత్వాన్ని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణా రాష్ట్రంలోనూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే అన్ని తరగతుల విద్యార్థులకు ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదివే విద్యార్థులందరికీ మధ్యాహ్న భోజనముతో పాటు ఉదయం పూట అల్పాహారము కూడా అందించాలని కోరారు. తద్వారా దేశంలోనే ప్రాథమిక,ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు అల్పాహారం అందించిన మొట్ట మొదటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిలువాలని బాలల హక్కుల సంక్షేమ సంఘం ఆకాక్షిస్తుందన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News