Saturday, April 27, 2024

కొలువుదీరిన కొత్త మంత్రులు.. తొలి ప్రాధాన్యతలో సీనియర్లకే కేబినెట్ బెర్త్‌లు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్త కేబినెట్ కొన్ని కొలువు దీరింది. రేవంత్ మంత్రి వర్గంలో తొలి విడత 11 మందికి చోటు దక్కిది. పార్టీలో సుదీర్ఘకాలంగా పని చేస్తున్న నేతలకే ప్రాధాన్యత కల్పించారు. మధిర ఎంఎల్‌ఎ మల్లు భట్టి విక్రమార్క, హుజూర్ నగర్ ఎంఎల్‌ఎ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, ఆందోల్ ఎంఎల్‌ఎ దామోదర రాజనర్సింహా, ములుగు ఎంఎల్‌ఎ సీతక్క, మంథని ఎంఎల్‌ఎ శ్రీధర్ బాబు, హుస్నాబాద్ ఎంఎల్‌ఎ పొన్నం ప్రభాకర్ గౌడ్, నల్గొండ ఎంఎల్‌ఎ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వరంగల్ ఈస్ట్ ఎంఎల్‌ఎ కొండా సురేఖ, ఖమ్మం ఎంఎల్‌ఎ తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు ఎంఎల్‌ఎ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొల్లాపూర్ ఎంఎల్‌ఎ జూపల్లి కృష్ణారావులను రేవంత్ తన టీంలోకి తీసుకున్నారు. కేబినెట్‌లో స్థానం దక్కించుకున్న వారి వివరాల్లోకి వెళితే….

సాధారణ కార్యకర్త నుంచి సిఎల్‌పి నేతగా, ఉప ముఖ్యమంత్రిగా భట్టి
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వైరా మండలం స్నానాల లక్ష్మీపురానికి చెందిన మల్లు అఖిలాండ, మాణిక్యమ్మ దంపతులకు 1961 జూన్ 15న భట్టి విక్రమార్క జన్మించారు. హైదరాబాద్ నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. సెంట్రల్ యూనివర్శిటీ నుంచి 1986లో ఎంఏ (చరిత్ర) పీజీ పూర్తి చేశాడు. మల్లు భట్టి విక్రమార్కకు నందినితో వివాహం జరగ్గా.. సూర్య విక్రమాదిత్య, సహేంద్ర విక్రమాదిత్య ఇద్దరు కుమారులున్నారు.

మల్లు భట్టి విక్రమార్కది ముందు నుంచే రాజకీయ కుటుంబం. మల్లు కుటుంబంలో భట్టి విక్రమార్క కంటే ముందే.. అనంత రాములు, మల్లు రవి రాజకీయంలో ఉన్నారు. మల్లు అనంత రాములు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పని చేశారు. ఆయన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి ఎంపిగా ప్రాతినిధ్యం వహించారు. ఆయన ఆకస్మిక మరణంతో మల్లు రవి నాగర్ కర్నూల్ నుంచి ఎంపిగా పోటీ చేసి గెలిచారు. అనంతరం.. జడ్చర్ల నుంచి మల్లు రవి ఎంఎల్‌ఎగా కూడా తెలిచారు. మల్లు అనంతరాములు మరణం తర్వాతే భట్టి విక్రమార్క కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ సిఎంగా ఉన్న సమయంలో పార్టీలో భట్టి చురుకుగా వ్యవహరించారు. 2007లో జరిగిన ఖమ్మం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంఎల్‌సిగా భట్టి గెలుపొందారు. 2009 వరకు ఎమ్మెల్సీగా కొనసాగిన భట్టి అసెంబ్లీ ఎన్నికల్లో మధిర నుంచి ఎంఎల్‌ఎగా పోటీ చేసి గెలిచారు. అప్పటివరకు సిపిఎం కంచుకోటగా ఉన్న మధిరలో ఆయన గెలిచి రికార్డు సృష్టించారు. ఆ తర్వాత 2014, 2018 ఎన్నికల్లోనూ మధిర నుంచి గెలిచి హ్యాట్రిక్ కొట్టగా 2023లోనూ విజయం సాధించారు. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2009 నుంచి 2011 వరకు చీఫ్ విప్‌గా మల్లు భట్టి విక్రమార్క పని చేశారు. 2011 నుంచి 2014 వరకు డిప్యూటీ స్పీకర్‌గా వ్యవహరించారు. 2018లో తెలంగాణ అసెంబ్లీలో సీఎల్పీ నేతగా భట్టి ఎన్నికయ్యారు. 1990-92 వరకు ఆంధ్రా బ్యాంక్ డైరెక్టర్‌గా మల్లు భట్టి విక్రమార్క పనిచేశారు. 2000-2003 వరకు పిసిసి సెక్రటరీగా మల్లు భట్టి విక్రమార్క కొనసాగారు.

పాదయాత్రతో పార్టీలో నూతనోత్సాహం
తెలంగాణలో చావు బతుకుల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఊపిరిలూదేందుకు మల్లు భట్టి విక్రమార్క తనదైన కృషి చేశారు. పీపుల్స్ మార్చ్ పేరుతో 2023 మార్చి 16న ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మధిర వరకు 1360 కిలో మీటర్ల మేర పాదయాత్ర చేశారు. ఈ యాత్ర 17 జిల్లాలు, 36 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా సాగింది. యాత్రలో అన్ని వర్గాల ప్రజలతో మమేకమవుతూ కష్టసుఖాలు తెలుసుకుంటూ కాంగ్రెస్ పార్టీని జనాల్లోకి భట్టి తీసుకెళ్లారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టటంలో భట్టి పాదయాత్ర కూడా ఓ కారణంగా చెప్పకుండా ఉండలేం.

ఐఎఎస్ అవ్వాలనుకుని పాలిటిక్స్‌లోకి వచ్చిన దామోదర రాజనర్సింహా
దివంగత మంత్రి రాజనర్సింహ-జానాబాయి దంపతుల రెండో కూమారుడు సీలారపు దామోదర 1958 డిసెంబరు 5న జన్మించాడు. హైదరాబాద్‌లో ఇంజనీరింగ్ విద్య అభ్యసించిన ఆయన ఐఏఎస్ కావాలని పబ్లిక్ సర్వీస్ పరీక్షలకు కూడా సిద్దమయ్యారు. తనకు రాజకీయ భవిష్యత్‌నిచ్చిన అందోలు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని అనునిత్యం పరితపించాడు. చదువుపై ఉన్న మక్కువతో అందోలు ప్రాంతాన్ని ఎడ్యుకేషన్ హాబ్‌గా మార్చారు. అనేక విద్యాసంస్థలను ఈ ప్రాంతంలో నెలకొల్పాడు. 1989లో ఆయన తండ్రి మాజీ మంత్రి రాజనర్సింహ అకాల మరణం చెందడంతో దామోదర రాజనర్సింహ రాజకీయాల్లోకి ప్రవేశించాల్సి వచ్చింది. 1989లో జరిగిన అందోల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి తొలిసారి ఎంఎల్‌ఎగా గెలుపొంది తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో రెండు సార్లు ఓటమి చెందినా, నియోజకవర్గాన్ని మాత్రం వదల్లేదు. ఇక్కడి ప్రాంత ప్రజలతో మమేకమైన అయన 2004 ఎన్నికల్లో అప్పట్లో మంత్రిగా పనిచేసిన పి.బాబూమోహన్‌పై భారీ మేజార్టీతో దామోదర్ గెలుపొందారు. 2006లో వైఎస్‌ఆర్ పాలనలో మంత్రివర్గంలో ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలను చేపట్టారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో గెలుపొందిన దామోదర వైఎస్‌ఆర్, రోశయ్య హయాంలో మంత్రి వర్గంలో పనిచేశారు. 2010లో అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తెలంగాణకు ప్రాంతానికి ఉప ముఖ్యమంత్రి పదవిని ఇవ్వాల్సిన సందర్భం రావడంతో 2011 జూన్ 10వ తేదీన డిప్యూటీ సీఎంగా నియమితులయ్యారు. ఆ తర్వాత 2014, 2018 ఎన్నికల్లో ఓటమి చెందగా, ఆగస్టు 20, 2023న జాతీయ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శాశ్వత ఆహ్వనిత సభ్యుడిగా నియమితులయ్యారు. ప్రస్తుతం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సమీప ప్రత్యర్థి క్రాంతికిరణ్‌పై విజయాన్ని సాధించి, ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈసారి కూడా రాష్ట్ర కేబినెట్‌లో మంత్రి పదవి దక్కింది.

ఐదుసార్లు ఎంఎల్‌ఎగా గెలుపొందిన దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
మంథని నియోజకవర్గం నుంచి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు విజయం సాధించారు. మాజీ స్పీకర్ దుద్దిళ్ళ శ్రీపాద రావు, జయమ్మ దంపతులకు 1969 మే 30న జన్మించారు. ఐఎఎస్ అధికారి శైలజ రామయ్యర్‌తో వివాహం జరిగింది. మంథని నుంచి ఐదుసార్లు ఎంఎల్‌ఎగా గెలుపొందారు. ఉమ్మడి ఎపిలో పౌర సరఫరాలు, శాసన వ్యవహారాల మంత్రిగా పని చేశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో న్యాయ విద్యను అభ్యసించారు. 1998లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా కూడా పేరు నమోదు చేసుకున్నారు. తండ్రి శ్రీపాదరావు హత్యతో 1999లో రాజకీయాల్లో వచ్చారు శ్రీధర్‌బాబు. 1999 శాసనసభ ఎన్నికల్లో మంథని నుంచి మొదటి సారిగా గెలుపొందారు. 2004, 2009, 2018, 2023 మంథని నుంచి విజయం సాధించారు. 2004-2019 వరకు ప్రభుత్వ చీఫ్ విప్ కూాడ ఉన్నారు. 2010-2014 వరకు కిరణ్‌కుమార్ రెడ్డి కేబినెట్‌లో శాసనసభ వ్యవహారాల మంత్రిగా, 2009-10 వరకు ఉన్నత విద్య, ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల మంత్రిగా విధులు నిర్వహించారు. 2014లో మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్‌గా ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

అత్యంత పిన్న వయస్సులో ఎంపిగా ఎన్నికైన నేతగా పొన్నం
పొన్నం ప్రభాకర్ గౌడ్ 1967 మే 8న జన్మించారు. తల్లిదండ్రుల పేర్లు సత్తయ్య – మల్లమ్మ. 2000 ఏప్రిల్ 21న మంజులతో వివాహం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీలో బిఎ, ఎల్‌ఎల్‌బి పూర్తి చేశారు. 2009లో కరీంనగర్ పార్లమెంట్ నుంచి తొలిసారిగా పోటీ చేసి విజయం సాధించారు. అత్యంత పిన్న వయస్సులో ఎంపిగా ఎన్నికైన నేతగా పొన్నం పేరు మీద రికార్డు ఉంది. విద్యార్థి ఉద్యమకారుడిగా రాజకీయ ప్రయాణం ప్రారంభించారు. 2022 డిసెంబర్ 10న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడుగా కూడా ఉన్నారు. 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బిసి డిక్లరేషన్ కమిటీ చైర్మన్ గా ఉన్నారు. 2014, 2019 ఎన్నికల్లో కరీంనగర్ ఎంపిగా పోటీ చేసి ఓడిపోయారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ నుంచి ఓటమి పాలయ్యారు. 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి విజయం సాధించి మంత్రి అయ్యారు.

రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా పేరున్న నేత కొండా సురేఖ
రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న నేత కొండా సురేఖ. 1965 ఆగస్ట్ 19న జన్మించారు. 1995లో మండల పరిషత్‌కు ఎన్నికల్లో విజయం సాధించి సంచలనంగా మారారు. 1996లో పిసిసి సభ్యురాలుగా పని చేశారు. 1999లో శాయంపేట నుంచి ఎంఎల్‌ఎగా గెలుపొందారు. 2000లో ఎఐసిసి సభ్యురాలిగా నియమితులయ్యారు. 2004లో శాయంపేట నుంచి రెండో సారి ఎంఎల్‌ఎగా గెలుపొందారు. 2009లో పరకాల నుంచి అసెంబ్లీకి మూడోసారి ఎన్నికయ్యారు. 2009లో వైఎస్ కేబినెట్‌లో మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పని చేశారు. 2011లో ఎంఎల్‌ఎ పదవికి రాజీనామా చేసిన సురేఖ జగన్ వెంట నడిచారు. 2013లో వైసిపికి రాజీనామా చేశారు. 2014 ఎన్నికల్లో వరంగల్ తూర్పు నుంచి బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా నాలుగోసారి విజయం సాధించారు. 2018లో బిఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. 2023లో వరంగల్ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా ఐదోసారి గెలుపొందారు.

కాంగ్రెస్‌లో కీలకమైన నేతల్లో ఒకరు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
కాంగ్రెస్‌లో కీలకమైన నేతల్లో ఒకరు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి . 1963 మే 23న జన్మించిన ఈయన ఎన్‌ఎస్‌యూఐ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో విజయం సాధించారు. నల్గొండ స్థానం నుంచి వరుసగా 3 సార్లు విజయం సాధించిన తొలి సభ్యుడయ్యారు. వైఎస్, రోశయ్య మంత్రివర్గంలో ఐటి, యువజన సర్వీసులు, క్రీడల మంత్రిగా కూడా పని చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో మౌలిక వసతులు, పెట్టుబడులు శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో 2011 అక్టోబరు 5న మంత్రి పదవికి రాజీనామా చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో భువనగిరి నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపిగా గెలుపొందారు. బిఆర్‌ఎస్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్‌పై 4500 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2022 ఏప్రిల్ 10న శాసనసభ ఎన్నికల స్టార్ క్యాంపెనర్‌గా నియమితులయ్యారు. 2023 సెప్టెంబర్ 20న కాంగ్రెస్ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీలో స్థానం దక్కించుకున్నారు.

తెలుగు రాజకీయాల్లో సీతక్క ఓ సంచలనం
ధనసరి అనసూయ అంటే తెలియకపోవచ్చేమో కానీ సీతక్క అంటే తెలియని వారు ఉండరు. తెలుగు రాజకీయాల్లో సీతక్క ఓ సంచలనంగా చెప్పవచ్చు. 15 ఏళ్లకుపైగా మావోయిస్టుగా అజ్ఞాతంలో ఉంటూ పోరాటాలు చేశారు. తర్వాత జనజీవన స్రవంతిలో కలిసిపోయి రాజకీయ జీవితం ప్రారంభించారు. ములుగు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధిస్తూ వస్తున్నారు. నాలుగు సార్లు పోటీ చేస్తే మూడుసార్లు విజయం సాధించారు. మొదట్లో సీతక్క జననాట్య మండలి ద్వారా గ్రామాల్లో తిరుగుతూ ప్రజలను చైతన్యవంతులను చేసేవాళ్లు. జరుగుతున్న అన్యాయంపై నాటకాల ద్వార ప్రజలకు తెలియ జెప్పేవారు. అప్పటి భూస్వాముల ఆగడాలను ఎదుర్కోవడానికి సాయుధ ప్రతిఘటన తప్ప మరొక మార్గం లేదని భావించి నక్సల్స్‌లో చేరారు. సీతక్క 1988లో నక్సల్‌లో చేరినప్పుడు సీతక్కా 10 వ తరగతి చదువుతున్న విద్యార్థి. ఫూలన్ దేవి రచనల నుంచి ప్రేరణ పొంది, ఆర్థిక దోపిడీ కులవాద వివక్షపై కోపంతో నక్సల్స్‌లో చేరారు. జనశక్తి (సీపీఐ) (ఎంఎల్) పార్టీలో చేరి పోరాటం చేశారు. చాలా సంవత్సరాలు అజ్ఞాత జీవితం గడిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనశక్తి సాయుధ పోరాటంలో మహిళా నక్సలైట్‌గా, దళం లీడర్‌గా ప్రధాన భూమిక వహించారు. ఎన్టీఆర్ పిలుపు మేరకు మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలిసిపోయారు. 2001లో హైదరాబాద్లో న్యాయవాదిగా మారడానికి ఎల్.ఎల్.బి చదివారు. చట్టం అధ్యయనం చేసిన తర్వాతే ఆమెకు ప్రజా విధానం, పాలనపై ఆసక్తి ఏర్పడింది. స్థానికంగా మంచి పేరు ఉన్నందున చంద్రబాబు ఆమెకు టికెట్ ఇచ్చారు. దీంతో సీతక్క రాజకీయ రంగప్రవేశం చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. 2004లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ములుగు నియోజకవర్గం నుంచి టిడిపి తరఫున పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి పొదెం వీరయ్య చేతిలో ఓటమి పాలయ్యారు. 2009 ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి పోటీ చేసి వీరయ్యపై గెలిచారు. 2014లోమూడోసారి టిడిపి అభ్యర్థినిగా బరిలో నిలిచి అజ్మీరా చందూలాల్ చేతిలో ఓడిపోయారు. తర్వాత టిడిపికి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018, 2023లో కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించారు. ఇప్పుడు మంత్రిగా ప్రమాణం చేయనున్నారు.

ఎన్టీఆర్, చంద్రబాబు, కెసిఆర్, రేవంత్ రెడ్డి కేబినెట్లలో మంత్రిగా తుమ్మల రికార్డ్
ఖమ్మం నియోజకవర్గం నుంచి తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించారు. 1953 నవంబరు 15న జన్మించిన ఈయన 1982లో తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1983లో టిడిపి అభ్యర్థిగా సత్తుపల్లి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఎన్టీఆర్ కేబినెట్‌లో చిన్న నీటిపారుదల శాఖ మంత్రిగా పని చేశారు. 1985, 1994,1999లో శాసనసభకు ఎన్నికయ్యారు. సత్తుపల్లి నుంచి నాలుగుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1995, 1996 లో మరోసారి చిన్న నీటి పారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. 1999లో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పని చేశారు. 2001లో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ఉన్నారు. 2014లో బిఆర్‌ఎస్‌లో చేరారు. 2015లో ఎంఎల్‌సిగా ఎన్నికై మంత్రిగా పని చేశారు. 2016లో పాలేరు నుంచి అసెంబ్లీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. కెసిఆర్ కేబినెట్‌లో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ఉన్నారు. 2023లో కాంగ్రెస్‌లో చేరిన తుమ్మల నాగేశ్వరరావు ఈసారి ఖమ్మం అసెంబ్లీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఎన్టీఆర్, చంద్రబాబు, కెసిఆర్, రేవంత్ రెడ్డి కేబినెట్లలో మంత్రిగా తుమ్మల పని చేసిన రికార్డు సొంతే చేసుకున్నారు.

రాజకీయాల్లోనూ కెప్టెన్‌గా ఉన్న ఉత్తమ్..
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో కేరీర్‌ను ప్రారంభించిన ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజకీయాల్లోనూ కెప్టెన్‌గా ఉన్నారు. ఈసారి కూడా హుజుర్‌నగర్ నియోజకవర్గం నుంచి విజయం సాధించి మంత్రిగా ప్రమాణం చేయనున్నారు. బిఎస్‌సిలో గ్రాడ్యుయేషన్ చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి 1982 నుంచి 1991 వరకు ఐఎఎఫ్‌లో పని చేశారు. 1999, 2004లో కోదాడ నుంచి ఎంఎల్‌ఎగా గెలుపొందారు. 2009, 2014, 2018, 2023లో హుజుర్‌నగర్ నుంచి విజయం సాధించారు. 2019లో హుజుర్ నగర్ ఎంఎల్‌ఎ పదవికి రాజీనామా చేసి 2019లో నల్గొండ ఎంపిగా గెలిచారు. 2015-2021 వరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్‌లో గృహనిర్మాణ శాఖ మంత్రిగా పని చేశారు. మిగ్ 21, మిగ్ 23ను ఫ్రంట్ లైన్ ఫైటర్ స్క్వాడ్రన్ గా ఉన్నారు. రాష్ట్రపతి భవన్‌లో భద్రత , ప్రోటోకాల్, పరిపాలన, రాష్ట్రపతి విదేశీ పర్యటనల కంట్రోలర్‌గా కూడా పని చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నుంచి ఆరుసార్లు ఎంఎల్‌ఎగా ఎన్నికయ్యారు.

వైవిధ్య రాజకీయానికి కేరాఫ్ పొంగులేటి…
పాలేరు నియోజకవర్గం నుంచి విజయం సాధించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజకీయం చాలా వైవిధ్యమైంది. ఆయన స్వగ్రామం ఖమ్మం జిల్లా నారాయణపురం. 1985లో ఎన్టీఆర్ సిఎంగా ఉన్నప్పుడు పేరువంచ మేజర్‌పై క్రాస్‌వాల్ నిర్మాణం చేసి బిజినెస్‌లోకి అడుగు పెట్టారు. 2013లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి తన రాజకీయాలు స్టార్ట్ చేశారు. 2014లో ఖమ్మం పార్లమెంట్‌కు పోటీ చేసి విజయం సాధించారు. కొంతకాలం తెలంగాణ వైసిపి అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఆ తర్వాత బిఆర్‌ఎస్ పార్టీలో పొంగులేటి చేరారు. 2023 జులై 2న రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. 2023 జులై 14న పిసిసి ప్రచార కమిటీ కో-ఛైర్మన్ గా ఉన్నారు. 2023లో పాలేరు నుంచి పోటీ, ఎంఎల్‌ఎగా తొలిసారి గెలుపొంది మంత్రి అయ్యారు.

6 సార్లు విజయం సాధించిన జూపల్లి కృష్ణారావు
కొల్లాపూర్ నియోజయవర్గం నుంచి విజయం సాధించారు. 1999లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. కొల్లాపూర్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004, 2009లో గెలుపుతో హ్యాట్రిక్ కొట్టారు. 2012, 2014లో బిఆర్‌ఎస్ తరపున ఎంఎల్‌ఎగా విజయం సాధించారు. 2018లో బిఆర్‌ఎస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఆరోసారి విజయం సాధించారు. వైఎస్ కేబినెట్‌లో పౌర సరఫరాలు, వినయోగదారుల వ్యవహారాలు మంత్రిగా, కిరణ్‌కుమార్ రెడ్డి మంత్రివర్గంలో దేవదాయ శాఖ మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News