Monday, May 6, 2024

అవినాష్ కు సిబిఐ మరో నోటీసు జారీ..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి 19వ తేదన తమ ఎదుట హాజరు కావాలని సిబిఐ మరో నోటీసు జారీ చేసింది. పులివెందులలోని కడప ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటికి మంగళవారం సిబిఐ అధికారులు చేరుకున్నారు. అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి డ్రైవర్‌కు సిబిఐ అధికారులు నోటీసులు ఇచ్చి వెళ్లిపోయారు. వివేకాహత్య కేసులో అవినాష్‌రెడ్డిని మంగళవారం విచారణకు రావాలని సిబిఐ సోమవారం నోటీసులు జారీ చేసింది. అయితే తనకు ముందుగానే నిర్ణయించిన షెుడ్యూల్ కారణంగా తాను మంగళవారం విచారణకు రాలేనని అవినాష్ రెడ్డి సిబిఐకి లేఖ రాశారుు.

నాలుగు రోజుల తర్వాత విచారణకు వస్తానని అవినాష్ రెడ్డి సిబిఐకి రాసిన లేఖలో పేర్కొన్నారు. దీంతో సిబిఐ అధికారులు ఆయనకు మరో అవకాశం ఇచ్చారు. కాగా, అవినాష్ రెడ్డి హాజరు వుతారని మంగళవారం ఉదయం వరకూ ప్రచారం జరిగింది. ఆయన సోమవారమే పులివెందుల నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. మంగళ వారం ఉదయం నుంచి సిబిఐ కార్యాలయం వద్ద పులివెందుల నుంచి వచ్చిన అవినాష్ రెడ్డి అనుచరులు గుమికూడారు. అయితే చివరి క్షణంలో అవినాష్ రెడ్డి ఆగిపోయారు. ఇలా సిబిఐ నోటీసులు ఇచ్చిన తర్వాత విచారణకు హాజరు కాకపోవడం ఇదే మొదటి సారి కాదు. దాదాపుగా ప్రతీసారి ఇదే సమాధానం ఇచ్చారు.

కొన్ని సార్లు కోర్టులకు వెళ్లారు. ఈ కారణంగానే అవినాష్ రెడ్డి విచారణకు సహకరించడం లేదని సిబిఐ కోర్టుకు కూడా చెప్పింది. అరెస్టులకు ఎలాంటి ఆటంకాలు లేకపోయినప్పటికీ సిబిఐ ఇంకా అవినాష్‌రెడ్డి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వైఎస్ వివేకా హత్య కేసులో సిబిఐ ఎంపి అవినాష్ రెడ్డి పాత్రపై ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు దృష్టికి కీలక అంశాలు తీసుకెళ్లింది. వివేకా హత్య కేసు వెనుక జరిగిన కుట్రలో ఇంకా ఎవరైనా ఉన్నారేమో ఆయన ద్వారా తెలుసుకోవాల్సి ఉందని పేర్కొంది. అవినాష్ పాత్రపైన ప్రత్యక్ష సాక్షుల ద్వారా తెలిసిందని వివరించింది. గుండెపోటు అంటూ హత్యను దాచిపెట్టటం, సాక్ష్యాల విధ్వంసం, కుట్రలో అవినాష్ భాగమైనట్లు తేలినప్పటికీ సమాధానాలు ఎగవేసి, తప్పుదోవ పట్టించారని వివరించింది. దీంతో కస్టోడియల్ విచారణ అవసరమని కోర్టుకు నివేదించింది.

హత్యకు వినియోగించిన గొడ్డలి ఎక్కడ ఉందన్నది కస్డడీలో తెలుసుకోవాల్సి ఉందని పేర్కొంది, హత్య తరువాత 2019 మార్చి 15వ తేదీ తెల్లవారు జామున 1.58 గంటలకు అవినాష్ ఇంట్లో సునీల్ యాదవ్ ఉన్నట్లు గుగూల్ టేక్ ఔట్ ద్వారా తేలిందని సిబిఐ కోర్టుకు వివరించింది. అవినాష్ రెడ్డి పాత్రపై స్పష్టమైన ఆధారాలున్నాయని, ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వరాదని సిబిఐ పేర్కొంది. అందుకే విచారణకు హాజరైతే అరెస్ట్ చేస్తారేమోనని అవినాష్‌రెడ్డి భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటికి ఆరుసార్లు ఎంపి అవినాష్ సిబిఐ ముందు హాజరయ్యారు. ఇప్పుడు ఏడో సారి హాజరు కావాల్సి ఉంది. అయితే, మంగళవారం ఉదయం పదిన్నర గంటలకు హై-దరాబాద్ నుండి అవినాష్ రెడ్డి కడపకు బయలు దేరారు. పులివెందులకు వైఎస్ అవినాష్ రెడ్డి వచ్చేలోపుగానే సిబిఐ అధికారులు నోటీసులు ఇచ్చి వెళ్లిపోయారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని 2019 మార్చి 14న హత్య చేశారు.

ఈ హత్య కేసును సిబిఐ విచారిస్తుంది. ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును సిబిఐ విచారిస్తోంది. ఈ హత్య కేసును ఈ ఏడాది జూన్ 30వ తేదీ లోపుగా విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు సిబిఐని ఆదేశించింది. గతంలో ఇదే కేసును సిట్ విచారించింది. చంద్రబాబు సిఎంగా ఉన్న సమయంలో సిట్ విచారణ నిర్వహించింది. మరో వైపు వైఎస్ జగన్ సిఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏర్పాటు చేసిన సిట్ కూడా ఈ హత్య కేసును విచారించింది. వైఎస్ వివేకా హత్య కేసులో సిబిఐ అధికారులు ఇప్పటికే ఏడుగురిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఎ4 గా దస్తగిరి సిబిఐకి అఫ్రూవర్ గా మారాడు. దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలాన్ని సిబిఐ అధికారులు కోర్టకు సమర్పించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News