Monday, April 29, 2024

జాతియ విపత్తు కింద కేంద్రం ఐదు వేల కోట్లు కేటాయించాలి

- Advertisement -
- Advertisement -

హన్మకొండ: రాష్ట్ర భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టానికి కేంద్ర ప్రభుత్వం జాతియ విపత్తు కింద రూ. 5000 కోట్లు కేటాయించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం హన్మకొండలోని పలు వర్ష ప్రభావిత ప్రాంతాల్లో చాడ వెంకట్‌రెడ్డి సీపీఐ నాయకులతో కలిసి సందర్శించారు. అనంతరం బాలసముంద్రలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు తీరని నష్టం జరిగిందని, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించి వెళ్లడంతో సరిపోదని, కేంద్రం నుంచి ఆర్థికసాయం అందించాలన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా కేవలం రూ. 500 కోట్లు కేటాయించడం కంటి తుడుపు చర్యగానే మిగులుతుందన్నారు.

వరద ముంపు ప్రాంతాల్లో శాశ్వత నివారణ చర్యలు చేపట్టాలన్నారు. వరంగల్, హన్మకొండ పట్టణాల్లో నాలాలు కబ్జాకు గురయ్యాయని, చెరువులను రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించారని, వాటి వల్లనే కాలనీలు ముంపుకు గురయ్యాయన్నారు. ప్రజాప్రతి నిధులు, నాయకుల అండదండలతో నాలాలపై పెద్ద పెద్ద భవనాల నిర్మాణం జరిగి ందని, దాని వల్లనే రోడ్లపైకి, ఇళ్లలోకి వరద నీరు చేరుకుంటుందన్నారు. పాలకుల అలసత్వం వల్లనే వరంగల్, హన్మకొండలో ఈ పరిస్థితి ఏర్పడిందని, ఇప్పటికైనా ఆక్రమణకు గురైన నాలాలపై సర్వే చేయాలన్నారు.

నాలాలపై నిర్మాణాలను తొలగించి వారికి ప్రత్యామ్నాయం చూపాలని, నాలాలు వెడల్పు చేయాలని, ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలన్నారు. ఇటీవల వదరల వల్ల కొట్టుకొనిపోయిన, కూలిపోయిన ఇళ్లకు నష్టపరిహారం ఇవ్వాలని, వరదల వల్ల మృతిచెందిన వారికి ఎక్స్‌గ్రేసియా అందించాలని డిమాండ్ చేశారు. గ్రేటర్ వరంగల్‌కు ఏటా రూ. 300 కోట్లు ఇస్తామని చెప్పి సీపీఎం మాట నీటి మూటగా మారిందని, స్మార్ట్ సిటీ కింద ప్రకటించిన కేంద్రం ఏమిచ్చిందో బీజేపీ నాయకులు చెప్పాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, జిల్లా సహాయ కార్యదర్శులు తోట బిక్షపతి, మద్దెల ఎల్లేష్, నాయకులు ఆదరి శ్రీనివాస్, మారుపాక అనిల్‌కుమార్, కొట్టెపాక రవి, బాషబోయిన సంతోష్, మాలోతు శంకర్, మునిగాల బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News